చైతన్యానికి మేలుకొలుపు!

ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు!చైత్రంలో సంవత్సరం ప్రారంభమైతే ఇది మొదటిది ఎలా అయ్యింది? ఈ మాసంలో విష్ణుమూర్తి నిద్ర వెనుక అసలు అంతరార్థమేంటి? తొలి ఏకాదశి మానవాళికి అందించే సందేశం ఏంటి...?

Updated : 15 Jul 2021 01:46 IST

జులై 20 తొలి ఏకాదశి

 

ఆషాఢ శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు!చైత్రంలో సంవత్సరం ప్రారంభమైతే ఇది మొదటిది ఎలా అయ్యింది? ఈ మాసంలో విష్ణుమూర్తి నిద్ర వెనుక అసలు అంతరార్థమేంటి? తొలి ఏకాదశి మానవాళికి అందించే సందేశం ఏంటి...?

●* ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఉత్తరాయణంలో ప్రయాణించిన సూర్యుడు ఇక నుంచి దక్షిణాయనంలోకి వస్తాడు. అలా వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి తొలి ఏకాదశి అయ్యింది.

●* ● ప్రాచీన కాలంలో వర్ష హేమంత వసంతాల్నే రుతువులుగా పరిగణించేవారు. ప్రస్తుత (వేసవి, వర్ష, శీత) కాలాలు లాగా, మిగిలిన రుతువులు ఆ మూడింటిలో అంతర్భాగమే. మానవ మనుగడ వ్యవసాయ ఆధారంగా కొనసాగింది కాబట్టి వర్ష రుతువును సంవత్సరాదిగా పరిగణించేవాళ్లు. అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు. అలా ఇది సంవత్సరంలో తొలి ఏకాదశి అయ్యింది. దీనికే పద్మ ఏకాదశి, శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండగ లాంటి పేర్లూ ఉన్నాయి.

రసాతలం నుంచి పాలన

●*● స్వామి యోగనిద్రకు సంబంధించి మరొక ఐతిహ్యం పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపిస్తుంది. దీన్ని సాక్షాత్తూ కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. వామన రూపంలో వచ్చిన విష్ణువుకు మూడడుగులు దానం చేసి, రసాతలానికి చేరిన బలిచక్రవర్తి మళ్లీ తపమాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకొని తన దగ్గరే ఉండిపొమ్మని కోరాడు. అప్పుడు విష్ణువు తనను తాను రెండుగా విభజించుకుని ఒక రూపాన్ని క్షీరాబ్ధిలో, మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు. అలా ఉంచిన రోజే ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆ రోజు నుంచి కార్తిక ఏకాదశి వరకు లోక రక్షణ, శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి కోరాడు. అందువల్ల క్షీరాబ్ధిలో చాతుర్మాస్య యోగనిద్రలో ఉండే విష్ణువు రసాతలంలో మెలకువగా ఉండి సృష్టి రక్షణ, శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తాడని పద్మపురాణం చెబుతుంది.

నిరంతర దైవ ధ్యానం!

ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తొస్తుంది. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలకు పదకొండోదైన మనస్సును కలిపి భగవత్‌ స్మరణలో ఉండటమే ఉపవాసం. మధ్వాచార్యుల ద్వైత సంప్రదాయంలో కఠిన నిర్జల ఉపవాసం కనిపిస్తుంది. ఈ ఏకాదశి ఉపవాసం జైన బౌద్ధాల్లో కూడా ఉంది. వాత పిత్త శ్లేష్మ ప్రకోపాల నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

●* ఏకాదశి ఉపవాసం వెనుక మరొక అంతరార్థం కూడా ఉంది. సాధారణంగా సంవత్సరానికి 24 ఏకాదశులు. మనకు రోజుకు 24 గంటలు. మన ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు. అంటే 24 ఏకాదశులు ఉపవాసం ఉంటే, నిరంతరం దైవస్మరణలో ఉన్నట్లు. ఇక వసంత గ్రీష్మ రుతువుల్లోని అధిక వేడి నుంచి వర్ష రుతువు చల్లదనంలోకి మార్పు చెందినప్పుడు దానికి తగ్గట్టుగా శరీరంలో ఉష్ణాన్ని, వ్యాధి నిరోధకశక్తిని పెంచే పేలపిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు.

చాతుర్మాస్య దీక్ష

 విష్ణుమూర్తి నిద్రలో ఉంటే నాలుగు నెలల పాటు లోకాన్ని ఎవరు రక్షిస్తారు? పీఠాధిపతులు, యతులు, స్వామీజీలు, తాపసులు అందరికీ తన బాధ్యతను అప్పజెప్పి యోగనిద్రలోకి వెళతాడు విష్ణువు. అందుకే మూడు రాత్రులు మించి ఒక ప్రదేశంలో ఉండని స్వామీజీలు కూడా చాతుర్మాస్య దీక్షలో నాలుగు నెలల పాటు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉంటారు. నిరంతర సంచార జీవనంలో ఉండే వీరు- శాస్త్రాధ్యయనానికి ఈ చాతుర్మాస్య దీక్షను గొప్ప అవకాశంగా భావిస్తారు. పూర్వం ప్రతి రుతువు ప్రారంభంలో ఒక యాగం జరిగేది. ఆషాఢ పూర్ణిమ నుంచి జరిగే వరుణ ప్రఘాస యజ్ఞమే కాలక్రమంలో చాతుర్మాస్యంగా పరిణామం చెందిందంటారు.

తపనే తపస్సు!

●* విష్ణువు యోగనిద్ర వెనుక ఒక సామాజిక కోణం కూడా దర్శనమిస్తుంది. తపస్సు అంటే ‘స్వధర్మ వర్తిత్వం’ అని చెబుతోంది మహాభారతంలోని యక్షప్రశ్నల ఘట్టం. దీన్నే మాతృశ్రీ జిల్లెళ్లమూడి అమ్మ సులువైన మాటల్లో ‘పని పట్ల తపనే తపస్సు’ అని చెప్పారు. అంటే వ్యక్తి తన పనిని దీక్షగా చేస్తే అదీ తపస్సే. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ఈ వర్షాకాలం నాలుగు నెలలు కష్టపడి సంపాదించుకుంటే తరవాతి రోజుల్లో ఆ ఫలితాన్ని అనుభవిస్తూ భగవత్‌ చింతనలో కాలం గడపవచ్చునని దీని అంతరార్థం.

నారదుడి పూర్వజన్మ

తొలి ఏకాదశి పరంగా నారదుడి పూర్వజన్మ వృత్తాంతమూ కనిపిస్తుంది. ఒక స్త్రీ ఇళ్లలో పని చేసుకుంటూ తన కొడుకుతో జీవించేది. ఒక రోజు పాము కాటుకు గురై ఆమె మరణించింది. ఆ బాలుడు అనాథలా తిరుగుతూ తొలి ఏకాదశిన చాతుర్మాస్య దీక్ష కోసం వచ్చిన రుషుల వద్దకు చేరాడు. వారికి శుశ్రూష చేస్తూ నాలుగు నెలలు అనేక దైవ సంబంధ విషయాలు తెలుసుకొని, చిత్తశుద్ధితో ఆచరించాడు. ఫలితంగా మరుజన్మలో దేవర్షి నారదుడిగా జన్మించి నిరంతర నారాయణ నామస్మరణలో మునిగి తేలాడు.

●* ●తాళజంఘుని కుమారుడైన ముర అనే రాక్షసుడితో విష్ణువు పోరాడుతూ అలసట చెంది, ఏకాదశి అనే ఒక కన్యను సృష్టించి ఆమె ద్వారా ఆ రాక్షసుణ్ని సంహరించాడట. ఆ రకంగా ఏకాదశిని విష్ణుమూర్తి కుమార్తెగా చెబుతారు. ఏ పనినైనా శక్తి వంచన లేకుండా త్రికరణశుద్ధిగా చేసినప్పుడు విజయాన్ని సాధించవచ్చని చెప్పడం ఈ ఏకాదశి పుట్టుక వెనుక ఉన్న అంతరార్థం. ఇది మనిషిలోని చైతన్యానికి ప్రతీక. తొలి ఏకాదశి గొప్పదనం అంబరీషుడు, హరిశ్చంద్రుని కథ, రుక్మాంగద చరిత్ర, మాంధాతృ చరిత్ర, పద్మ, స్కాంద, భవిష్యోత్తర పురాణం లాంటి చాలా చోట్ల కనిపిస్తుంది.

- డా|| ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


తపశ్శక్తి సాధన

●* ●శయనం అంటే నిద్ర. ఎవరి నిద్ర? భగవంతుడి నిద్ర! ఆయనకు నిద్ర ఏంటి? అది మనం అనుకునే తామస నిద్ర కాదు. యోగ నిద్ర. తనపై ఆధారపడ్డ 14 లోకాల్లోని 84 లక్షల జీవరాశుల్ని పోషించడంతో పాటు, ఎవరికి ఎవరి వల్ల ఏ కష్టం వచ్చినా రక్షించాల్సిన, శిక్షించాల్సిన బాధ్యత విష్ణువుది. ఈ రక్షణ శిక్షణల సామర్థ్యం తపశ్శక్తి ద్వారా మాత్రమే సాధ్యం. అవతారమూర్తి రాముడు రావణుణ్ని సంహరించడానికి అహల్యతో మొదలుపెట్టి శబరి, ఇంకా ఎందరో మహర్షుల తపశ్శక్తిని స్వీకరించాడు. అప్పటికీ సరిపోక యుద్ధరంగంలో అగస్త్యుణ్ని ఆహ్వానించి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి తన తపశ్శక్తికి, దాన్ని కూడా వినియోగించుకున్నాడు. విష్ణువు ఎనిమిది నెలల్లో లోకకల్యాణం కోసం వినియోగించిన తపశ్శక్తిని మళ్లీ సంపాదించుకోవడానికి ఆషాఢ ఏకాదశి నుంచి కార్తిక ఏకాదశి వరకు యోగనిద్ర పేరుతో తపమాచరిస్తాడు. ఆ యోగనిద్ర ప్రారంభానికి శయన ఏకాదశి అనీ, ముగింపునకు ఉత్థాన ఏకాదశి అనీ పేరు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని