పరమాత్మే సత్యం.. శాశ్వతం..

గీతలో శ్రీకృష్ణుడు చెప్పినా మరెవరు ఏ గ్రంథంలో చెప్పినా ఒకటే మాట... సత్యమే శాశ్వతం, ఆత్మే పరమాత్మ అని. అంటే మన మనోఫలకం మీద నిలిచేదే పరమాత్మ అనీ, ఎప్పటికీ అదే సత్యమనీ, ఆ సత్యమే శాశ్వతమనీ. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ‘ఎవ్వనిచే జనించు..

Updated : 10 Dec 2022 19:49 IST

గీతలో శ్రీకృష్ణుడు చెప్పినా మరెవరు ఏ గ్రంథంలో చెప్పినా ఒకటే మాట... సత్యమే శాశ్వతం, ఆత్మే పరమాత్మ అని. అంటే మన మనోఫలకం మీద నిలిచేదే పరమాత్మ అనీ, ఎప్పటికీ అదే సత్యమనీ, ఆ సత్యమే శాశ్వతమనీ. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ‘ఎవ్వనిచే జనించు..’ అంటూ ఆ గజేంద్రుడు అందుకోగానే, వైకుంఠవాసుడు సిరికిన్‌ చెప్పకనే బయల్దేరాడు కదా! అంటే సంసారం అనే సాగరంలో కోరికలనే మొసలికి చిక్కి పోరాడే సమయంలో... అంతూదరీ లేని పయనంతో సలిపే నొప్పికి ముగింపు అందుకోవాలన్న తలపు రావాలేగానీ ఆ ముక్తిపథం మనకు అందినట్లే. మనమున్న చోటే నిత్యమైన సత్యలోకం. ఇక్కడ సత్యలోకం అంటే దేవతలుండే స్థలం కాదు. అన్యం కానిదీ, శాశ్వతమైందీ అని. అదే ఆత్మ. అదే పరమాత్మ. ఆత్మను మోసే తనువే ఆలయమనుకుంటే, ఏ వికారాలూ ఉండవు. అయితే తెలుసుకోవటంతోనే ఆగి పోకూడదు. అనునిత్యం స్మరణలో ఉండాలి. మధ్యలో విడిచి పెట్టకూడదు. ఆ పయనం చావుపుట్టుకల మధ్య వచ్చేదో, జన్మజన్మల మధ్య సాగేదో కాదు. అజ్ఞానం నుంచి జ్ఞానంవైపు వెళ్లేది. అందుకే పదేపదే మననం చేసు కుంటూ పయనం సాగించాలి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నారంటే భావం అదే కదా!        

 - నాగిని


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని