ఉదర వ్యాధుల ఉపశమన క్షేత్రం

సుబ్రహ్మణ్యుని ఆరు మహా పుణ్యక్షేత్రాల్లో తమిళనాడులోని తిరుచ్చెందూరు రెండోది. తక్కినవి గుట్టలపై ఉంటే.. ఇది దక్షిణ తూర్పు సముద్ర తీరంలో అలరారుతోంది.

Updated : 27 Apr 2023 06:15 IST

సుబ్రహ్మణ్యుని ఆరు మహా పుణ్యక్షేత్రాల్లో తమిళనాడులోని తిరుచ్చెందూరు రెండోది. తక్కినవి గుట్టలపై ఉంటే.. ఇది దక్షిణ తూర్పు సముద్ర తీరంలో అలరారుతోంది. తారకాసురుడు, సూర పద్ములను సంహరించిన మహిమాన్విత ప్రదేశమిది. ఇక్కడి సముద్రాన్ని దైవ సమానంగా పూజిస్తారు. అలాగే ధ్వజస్తంభానికి, గోవుకు పూజలు నిర్వహించిన తర్వాతే ఆలయంలో పూజలు ప్రారంభిస్తారు. ఇక్కడి మూల విరాట్టు వెనుకున్న మహా వల్లభ గణపతి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ ఆలయం రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఎత్తైన రాజ గోపురంతో నిర్మితమైంది. ఇది స్వామివారి వాహనమైన నెమళ్లకు ఆవాసం. సుబ్రహ్మణ్యుడు చూపిన మహిమలు, సునామీ సమయంలో సముద్ర తీరం వెనక్కు వెళ్లిన వివరాలు ఆలయంలో తైలవర్ణ చిత్రాల్లో కనిపిస్తాయి.

శ్రీ శంకర భాగవత్పాదులు ఉదరకోశ వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో.. మహాశివుడి ఆజ్ఞ మేరకు 33 శ్లోకాలతో ‘సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం’ రచించి ఉపశమనం పొందారు. ఉదర వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ సముద్ర స్నానం చేసి ఆ శ్లోకాలను పఠిస్తే ఆరోగ్యవంతులవుతారని చెబుతారు. అలాగే సఖ్యతలేని దంపతులు ఆలయ ఆవరణలో కొంగుచాచి భిక్షమెత్తి ఆ సొమ్ముతో స్వామి కైంకర్యం చేస్తే వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారి 12 చేతులుగా భావిస్తూ 12 ఈనెలున్న ఆకుల్లో స్వామివారి విభూతి ప్రసాదాన్ని ఇవ్వడం విశేషం.

ప్రతి మంగళవారం, కృత్తిక, విశాఖ నక్షత్రాల రోజులు, షష్ఠి తిథుల్లో స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. దీపావళి తర్వాత వచ్చే స్కందషష్ఠి నాడు సూర సంహార ఉత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు.

పరాశరం సచ్చిదానందమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని