ఒక్కసారే మూడు ఆలయాల దర్శనం

సూర్యాపేటకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఎరకేశ్వర, త్రికూటేశ్వర, మహాదేవ ఆలయాలున్నాయి. ఇవన్నీ సుమారు అరకిలోమీటరు దూరంలోనే ఉంటాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన రాతి ఆలయాలివి.

Updated : 31 May 2023 21:25 IST

సూర్యాపేటకు ఐదుకిలోమీటర్ల దూరంలో ఎరకేశ్వర, త్రికూటేశ్వర, మహాదేవ ఆలయాలున్నాయి. ఇవన్నీ సుమారు అరకిలోమీటరు దూరంలోనే ఉంటాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన రాతి ఆలయాలివి. ఈ మూడు ఆలయాల్లోనూ శంభు లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.   కాలక్రమంలో ధ్వంసమైన ఎరకేశ్వరాలయ స్తంభాలను ఇటీవల పునరుద్ధరించారు. నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయ కళావైభవం అద్భుతం. ఎరకేశ్వరునికి నిత్యం అభిషేకం చేసి ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. కార్తికమాసం, మహాశివరాత్రి లాంటి విశేష దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో కళాప్రదర్శనకు అనువైన వేదిక ఉంది. పూర్వం మనవాళ్లు నాట్యానికి ఇచ్చిన ప్రాధాన్యతకు సంకేతమిది.సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కానీ మహాదేవ ఆలయంలో శివపార్వతులను విగ్రహరూపంలో చూస్తాం. ఇక్కడ ప్రతి శివరాత్రికి స్వామివారికి కల్యాణం నిర్వహిస్తారు. పక్కనున్న త్రికూటేశ్వరాలయంలో మూడు వైపులా మూడు శివలింగాలు, మధ్యలో నంది ఉండటం ప్రత్యేకత. ఇక్కడే సరస్వతీదేవి కూడా కొలువై ఉంది. చదువుల తల్లిని పాలరాతితో మలచారు. ఈ దివ్య విగ్రహానికి అపురూప అలంకరణ తోడై సమ్మోహనంగా ఉంటుంది. ఈ అమ్మను దర్శించుకుంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. ఈ చుట్టుపక్కల పిల్లలందరికీ ఇక్కడే అక్షరాభ్యాసం చేస్తారు. ఒకేసారి మూడు ఆలయాలను దర్శించుకోవడం భక్తులకు భాగ్యమే కదూ!  

దామా వినీత


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని