బ్రహ్మ ప్రారంభించాడు..

బ్రహ్మదేవుడు ఆశ్వయుజమాసంలో శ్రీనివాసుని జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాటి నుంచి స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Updated : 07 Oct 2021 05:24 IST

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు

బ్రహ్మదేవుడు ఆశ్వయుజమాసంలో శ్రీనివాసుని జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నాటి నుంచి స్వామివారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. పదోశతాబ్దం నాటి తమిళ శాసనంలో దీని ప్రస్తావన ఉంది. శ్రీవారి కౌతుకమూర్తిగా వివిధ సేవలు జరిపించుకునే భోగశ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని పల్లవ రాజ్యాధికారి ధర్మపత్ని స్వామికి కానుకగా ఇచ్చింది. అర్చకులు భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని కౌతుకమూర్తిగా, ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవమూర్తిగా వినియోగించారు. 1339 నుంచి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి బ్రహ్మోత్సవాలతోపాటు ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 14వ శతాబ్దం వరకు పెరటాసి, మార్గశిర మాసాల్లో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగేవి. 15వ శతాబ్దంలో చిత్రి, ఆడి, ఆవణి, పెరటాసి, అల్పిసి, మాసి, పంగుణి మాసాల్లో ఏడు బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత పది బ్రహ్మోత్సవాల చొప్పున నిర్వహించారు.  18వ శతాబ్ద్దం నాటికి విదేశీయుల పాలనతో భూములు అన్యాక్రాంతమై తక్కిన బ్రహ్మోత్సవాలు నిలిచిపోయినా బ్రహ్మ ఆరంభించిన బ్రహ్మోత్సవాలు మాత్రం కొనసాగుతున్నాయి.

మూడేళ్లకోసారి అధిక మాసం వస్తుంది. అధికమాసం లేని సంవత్సరంలో ఆశ్వయుజ విదియ మొదలు విజయదశమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అధికమాసం ఉన్న ఏడాదిలో భాద్రపద మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు సాలకట్ల (వార్షిక బ్రహ్మోవ్సవాలు)గా నిర్వహిస్తారు. రెండో బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలంటారు. వీటిలో భాద్రపదంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముఖ్యమైనవి. ఇవి అంకురార్పణ, ధ్వజ ఆరోహణతో మొదలై ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ, ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహన సేవ పూర్తయిన తర్వాత ఉత్సవమూర్తులను ఆలయంలోని తిరుమలరాయ మండపంలో తిరుచ్చిలో ఆస్థానం జరుగుతుంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహన సేవ అయిన తర్వాత రంగనాయకుల మండపంలో బంగారు శేషవాహనంపై ఉత్సవమూర్తులకు ఆస్థానం నిర్వహిస్తారు.

- మహంకాళి కిరణ్‌కుమార్‌, తిరుపతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని