మన్యం ఇలవేల్పు మోదకొండమ్మ

దట్టమైన దండకారణ్యంలో.. పచ్చని ప్రకృతి.. ఎత్తైన చెట్లు.. అందమైన లోయల మధ్య విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో వెలసింది మోదకొండమ్మ. ఈ తల్లిని కోరిన వరాలిచ్చే వనమాతగా ఆరాధిస్తారు స్థానిక గిరిజనులు.

Updated : 25 Aug 2022 04:17 IST

దట్టమైన దండకారణ్యంలో.. పచ్చని ప్రకృతి.. ఎత్తైన చెట్లు.. అందమైన లోయల మధ్య విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలోని పాడేరులో వెలసింది మోదకొండమ్మ. ఈ తల్లిని కోరిన వరాలిచ్చే వనమాతగా ఆరాధిస్తారు స్థానిక గిరిజనులు. సంతోషాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. ప్రచారంలో ఉన్న కథను అనుసరించి మోదకొండమ్మకు ఆరుగురు చెల్లెళ్లు. వీరంతా మహిమ గల తల్లులుగా విరాజిల్లుతున్నారు. గాలిపాడు, కొత్తపాడు గ్రామాల దగ్గర దట్టమైన అడవిలో పినవేనం రాతి గుహ వద్ద ప్రస్తుత ఆలయానికి సమీపంలో కొండమ్మ తల్లి స్వయంభువుగా వెలసింది. ఏటా దసరా సందర్భంగా భక్తులు కాలినడకన అక్కడికి వెళ్లి అమ్మవారికి సంబరాలు జరిపి మొక్కుబడులు తీర్చుకునేవారు. ఒకసారి పండుగ జరిపిన తర్వాత భక్తులంతా వెళ్లి పోయారు. ఆ సమయంలో అమ్మవారు తన అక్కచెల్లెళ్లను ఆహ్వానించింది. కోటి ప్రభల మధ్య విందు జరుగుతున్న సమయంలో తానక్కడ మర్చిపోయిన మరచెంబును తీసుకువెళ్లేందుకు పూజారి గుహ వద్దకు వస్తున్నాడు. అది చూసి ఆగ్రహించిన అమ్మ ‘ఇకపై ఎవరూ ఇక్కడికి రానవసరం లేదు. పూజారి మరచెంబును కిందికి విసురు తున్నాను. అది పడిన చోట నేను ఉద్భవించినట్టు భావించండి’ అన్నదట. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు సంబరాలు జరుగు తున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో మూడురోజుల పాటు అమ్మవారి జాతర నిర్వహిస్తారు. స్థానిక సతకంపట్టు వద్ద ఘటాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలు ఉంటాయి. జాతరలో గిరిజన సంప్రదాయ నృత్యం ‘థింసా’ ప్రత్యేక ఆకర్షణ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. పాడేరులోని ఈ ఆలయానికి ద్వారక కాంప్లెక్స్‌ నుంచి, చోడవరం నుంచి కూడా బస్సులున్నాయి.

- దాసరి సుభాష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని