చెప్పులు లేకుండా...

దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే విడిచి, కాళ్లు కడుక్కోవాలనేది మన సంప్రదాయం.

Published : 19 Jan 2023 00:15 IST

దేవాలయంలోకి ప్రవేశించే ముందు పాదరక్షలు బయటే విడిచి, కాళ్లు కడుక్కోవాలనేది మన సంప్రదాయం. ఈ నియమంలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నాయి. గుడి ప్రాంగణాన్ని పవిత్రంగా భావించా లనేది ముఖ్య కారణం. ఆ సంగతలా ఉంచితే ఆలయంలో మంత్ర పూర్వకంగా స్థాపించిన యంత్రాల వలన గుడిలో అనుకూల శక్తి వ్యాపించి ఉంటుంది. స్వయంభూ దేవాలయాలైతే విగ్రహాలను ప్రతిష్టించినవారి దైవిక శక్తి, తపశ్శక్తి తదితర శక్తుల సమాహారంతో ఆ నేల భాగం అయస్కాంత శక్తితో ప్రేరేపితమై ఉంటుంది. ఆ శక్తుల ప్రభావం మన శరీరంలోకి ప్రవహించడం ఆరోగ్యప్రదం. అందుకు ప్రధాన వాహకాలు పాదాలే. భూమి నుంచి వెలువడే సానుకూల తరంగాలను స్వీకరించే శక్తి పాదాల్లోనే ఉంటుంది. అంటే పాదాలు మనిషి లోని సర్వ శక్తులకూ ఆలంబనలు. వివిధ శరీర భాగాల్లోని నాడుల చివరలు పాదాల్లో ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆ నాడులన్నీ ఉత్తేజితమై ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆలయ పరిసరాల్లో ఉండే పూలమొక్కలూ,  ఔషధ వృక్షాలూ కూడా అనుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. ఇక వ గ్రహాన్ని అభిషేకించిన జలాదులతో పవిత్రమయ్యే నేలపై పాదాన్ని మోపడం వల్ల భక్తుడు అనుకూల శక్తి పొందుతాడు. లౌకికంగా చూస్తే... పాదరక్షలు ధరించకపోవడం వల్ల గర్వం, అహం లాంటివి తొలగిపోతాయి. ఇలా మానసిక, శారీరక శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాటిది. ప్రస్తుతం చేస్తున్న అయస్కాంత చికిత్స ప్రాచీన కాలంలోనే ఉండేది. అందువల్లే పాదరక్షలు లేని పాదాలతోనే ఆలయంలో ప్రవేశించాలన్నారు.

కె.వి.యస్‌.యస్‌.శారద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని