తీర్థయాత్ర ఎలా చేయాలి?

పాండవులందరూ ఓసారి తీర్థయాత్రలు చేయాలని సంకల్పించారు. తమ శ్రేయోభిలాషి, ఆత్మబంధువు అయిన శ్రీకృష్ణపరమాత్ముడిని కూడా తోడుగా తీసుకెళ్లాలని అనుకున్నారు. తమ మనసులో మాట చెప్పడానికి

Updated : 21 Jan 2021 01:53 IST

పాండవులందరూ ఓసారి తీర్థయాత్రలు చేయాలని సంకల్పించారు. తమ శ్రేయోభిలాషి, ఆత్మబంధువు అయిన శ్రీకృష్ణపరమాత్ముడిని కూడా తోడుగా తీసుకెళ్లాలని అనుకున్నారు. తమ మనసులో మాట చెప్పడానికి ఆయన దగ్గరకు వెళ్లారు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నానని, తన ప్రతినిధిగా ‘ఈ కాయను తీసుకెళ్లి తీర్థయాత్రలన్నీ తిప్పండి’ అని ఓ సొరకాయను పాండవుల చేతుల్లో పెట్టాడు. వాళ్లు చాలా సంతోషంగా ఆ కాయను తమ వెంట తీసుకెళ్లారు. పుణ్యక్షేత్రాలు తిరిగారు. గంగ సహా అన్ని నదుల్లో, సాగరాల్లో స్నానాలు చేశారు. ఆ కాయను కూడా జలాల్లో తడిపారు. యాత్రలన్నీ ముగించుకుని హస్తినాపురానికి చేరుకున్నారు. శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి, సొరకాయను కూడా వెనక్కుఇచ్చారు. ఆ మధ్యాహ్నం కృష్ణుడు పాండవులకు ఆతిధ్యాన్నిచ్చాడు. పాండవులు వెంట తీసుకెళ్లిన సొరకాయను తరిగి ఘుమఘుమలాడే కూర చేయించి పాండవులకు వడ్డించాడు. ఆ కూర కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకునేసరికి పాండవుల నోరు చేదెక్కింది. ‘ఇదేంటి మహానుభావా! ఈ చేదు సొరకాయతో భోజనం పెట్టావు’ అన్నారు. అప్పుడు కృష్ణుడు ‘అయ్యో! ఇన్ని పుణ్యతీర్థాలు తిప్పారు కదా... సొరకాయలో చేదు పోయి తీయగా మారిందనుకున్నాను’ అన్నాడు. అప్పుడు అర్థమైంది పాండవులకు పరమాత్ముడి అంతరార్థం. ఎన్ని తీర్థాలు దర్శించుకున్నా అంతరంగంలో మార్పు రాకుంటే ఫలమేం ఉండదని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని