డాంబికపు గరిటె

బుద్ధుని శిష్య గణంలో ఉదయుడికి లేనిపోని డాంబికాలు చెప్పడం అలవాటు. కొత్తగా చేరిన శిష్యులకు తాను గొప్ప మేధావినంటూ ఏవేవో కల్పించి చెప్పి ఆశ్చర్యపరిచేవాడు. కానీ జ్ఞానతేజస్సు ఉట్టిపడే మహా కశ్యప,

Published : 22 Sep 2022 00:28 IST

బుద్ధుని శిష్య గణంలో ఉదయుడికి లేనిపోని డాంబికాలు చెప్పడం అలవాటు. కొత్తగా చేరిన శిష్యులకు తాను గొప్ప మేధావినంటూ ఏవేవో కల్పించి చెప్పి ఆశ్చర్యపరిచేవాడు. కానీ జ్ఞానతేజస్సు ఉట్టిపడే మహా కశ్యప, మౌద్గల్యుడు, ఉపాలి తదితరుల ముందు మాత్రం నోరు మెదిపేవాడు కాదు. ఎప్పట్లాగే అతడోరోజు కొత్తవారిని ఆకట్టుకోవాలని ఏవో కట్టుకథలు చెబుతున్నాడు. దూర ప్రాంతం నుంచి వచ్చిన భిక్షువులు ఆ మాటలు విని అతడి గర్వాన్ని తగ్గించాలనుకున్నారు. వాళ్లు ఉదయుడికి దగ్గరగా వచ్చి ‘తమరు గొప్ప జ్ఞానిలా ఉన్నారు.. మాకు కలిగిన సందేహాన్ని తీర్చగలరా?!’ అనడిగారు. ఉదయుడు దర్పాతిశయంతో తల పంకిస్తూ నవ్వి ‘అడగండి’ అన్నాడు. ‘మతిమరపు అనేది రూప స్కందం లోనిదా? సంస్కార స్కందం లోనిదా?’ అనడిగారు. అంత పరిజ్ఞానం లేని ఉదయుడు తెలియదంటూ అక్కణ్ణించి వెళ్లిపోయాడు. వాళ్లు బుద్ధుణ్ణి కలిసినప్పుడు ‘స్వామీ! మీ శిష్యుడు ఉదయుడు అజ్ఞానంలో ఉంటే మీరెందుకు పట్టించుకోలేదు?’ అనడిగారు. బుద్ధుడు శాంతంగా తల పంకించి ‘యావజ్జివమపి చేద్‌ బాలః పాండిత్యం పర్యుపాసతే న స ధర్మం విజానాతి దర్వి సూపరసం యథా’ అన్నాడు. అంటే శ్రద్ధాసక్తులు లేని వ్యక్తి జీవితాంతం పండితుల సన్నిధిలో ఉన్నా జ్ఞానం ఆర్జించలేడు. వంటకాలను రోజూ కలియబెట్టే గరిటె ఆ వంటల రుచులు గ్రహించలేదని భావం. ఆ మాటలు విన్న భిక్షువులు మౌనంగా నమస్కరించారు.

- పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని