యముడు చెప్పిన మృత్యు రహస్యం

వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు మన వారసత్వ సంపదలో భాగం. కఠోపనిషత్తులో...ఆత్మానం రధినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ది మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకానికి శరీరం రథం. ఆత్మ అందులో ప్రయాణిస్తోంది.

Updated : 02 Mar 2023 03:15 IST

వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు మన వారసత్వ సంపదలో భాగం. కఠోపనిషత్తులో...ఆత్మానం రధినం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ది మనః ప్రగ్రహమేవచ అనే శ్లోకానికి శరీరం రథం. ఆత్మ అందులో ప్రయాణిస్తోంది. బుద్ధి సారథి. అంటే రథాన్ని నడిపేది. ఇంద్రియాలు గుర్రాలు. మనసు పగ్గం. అది స్వాధీనంలో ఉంటేనే ఇంద్రియాలనే గుర్రాలు అధీనంలో ఉంటాయి. విజ్ఞానం, విచక్షణలతో మనసును అదుపులో ఉంచుకున్నప్పుడే సన్మార్గంలో పయనిస్తారనేది భావం. మనకు శ్రేయోమార్గం, ప్రేయోమార్గం అంటూ రెండు దారులున్నాయి. మొదటిది ముక్తి సాధనం. రెండోది ప్రాపంచిక సుఖాలకు చెందింది. బుద్ధిమంతులు మనసును నిగ్రహించి శ్రేయోమార్గం ఎంచుకుంటే మందబుద్ధులు సుఖాలకు వశులై రెండో మార్గం ఎంచుకుంటారు. అందుకే బుద్ధిమంతుడు సత్కర్మలు ఆచరించి మరణానంతరం భగవంతుణ్ణి చేరుకుంటారు. ఇలలో శాశ్వత కీర్తి సంపాదించి మార్గదర్శకులవుతారు. ఇది యముడు నచికేతుడికి బోధించిన మృత్యు రహస్యం. మృత్యువు తర్వాత ఏం మిగులుతుంది, ఏమవుతుంది అనేది మన మనసులో మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం మృత్యు దేవత అయిన యముడే చెప్పడం కఠోపనిషత్తు ప్రత్యేకత.                    
శివలెంక ప్రసాదరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని