భారతీయ విద్యార్థులకు షాక్‌.. ఆస్ట్రేలియన్‌ యూనివర్సిటీల వీసా నిరాకరణ

ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా, జమ్ముకశ్మీర్‌లకు చెందిన విద్యార్థులకు వీసాలు మంజూరు చేయడంపై ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు తాత్కాలిక నిషేధం విధించాయి.

Published : 26 May 2023 21:31 IST

మెల్‌బోర్న్‌: అస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు (Australian universities) భారత్‌ విద్యార్థులకు (Indian Students) షాకిచ్చాయి. ఉత్తరాఖండ్‌ (Uttarakhand), ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh), గుజరాత్‌ ( Gujarat), హరియాణా (Haryana), పంజాబ్‌ (Punjab), జమ్ముకశ్మీర్‌కు (Jammu Kashmir) చెందిన విద్యార్థులకు వీసా జారీపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులు స్వీకరించొద్దని ఫెడరేషన్‌ యూనివర్సిటీ, వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలు ఎడ్యుకేషన్‌ ఏజెంట్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. ఈ అంశంపై ఇప్పటికే వ్యక్తిగతంగానూ మెయిల్స్‌ పంపినట్లు ఫెడరేషన్‌ యూనివర్సిటీ వెల్లడించింది.

ఆయా రాష్ట్రాల విద్యార్థులు చేస్తున్న చాలా దరఖాస్తులు వాస్తవమైనవి కాదని, మోసపూరితంగా ఉన్నాయని ఆస్ట్రేలియా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించడం వల్లే వీసా మంజూరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అక్కడి యూనివర్సిటీలు వెల్లడించాయి. భారత్‌ నుంచి వచ్చిన వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం గత పదేళ్లలో ఇదే గరిష్ఠమని, మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 25 శాతం మోసపూరితంగానే ఉన్నాయని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే విశ్వవిద్యాలయాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కనీసం రెండు నెలలపాటు ఈ నిషేధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి అస్ట్రేలియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వలసలు, విద్య, నైపుణ్య మార్పిడులను పెంపొందించుకునేందుకు ఇప్పటికే భారత్‌, ఆస్ట్రేలియాలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు భారతీయ విద్యార్థుల వీసా ప్రక్రియకు సంబంధించి ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని ఆస్ట్రేలియన్‌ యూనివర్సిటీలు భావిస్తున్నట్లు ‘ది సిడ్నీ హెరాల్డ్‌’ వెల్లడించింది. విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్‌ కోవన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ వోలోంగాంగా, టొరెన్స్‌ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలన్నీ దరఖాస్తులను పరిశీలించేందుకు వాటికి అనుబంధంగా కొందరు ఏజెంట్లను నియమించుకుంటాయి. వారి నుంచి వచ్చిన మెయిల్స్‌ ఆధారంగా విద్యార్థులకు వీసాలు మంజూరు చేస్తాయి. భవిష్యత్‌లో ఈ ప్రక్రియను మరింత పగడ్బందీగా నిర్వహించాలని విశ్వవిద్యాలయాలు ఏజెంట్లకు సూచించినట్లు ‘ది సిడ్నీ హెరాల్డ్‌’ పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని