UPSC: యూపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా డా.మనోజ్‌ సోనీ ప్రమాణస్వీకారం

UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా డా. మనోజ్‌ సోనీ ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఆయన రెండు యూనివర్సిటీల్లో మూడుసార్లు వీసీగా సేవలందించారు.

Published : 16 May 2023 17:34 IST

దిల్లీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) ఛైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త మనోజ్‌ సోనీ (Manoj Soni) మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. 2017 జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో సభ్యుడిగా చేరిన ఆయన.. గతేడాది ఏప్రిల్‌ 5 నుంచే యూపీఎస్సీ ఛైర్మన్‌ హోదాలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం యూపీఎస్సీలో సీనియ‌ర్ స‌భ్యురాలైన స్మితా నాగ‌రాజ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్టు అధికారులు వెల్లడించారు. యూపీఎస్సీలో సభ్యుడు కావడానికి ముందు మనోజ్‌ సోనీ మూడుసార్లు పలు యూనివర్సిటీల్లో వీసీగా పనిచేశారు.  

2009 ఆగస్టు 1 నుంచి 2015 జులై 31 వరకు గుజరాత్‌లోని డా. బాబాసాహెబ్‌ అంంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వరుసగా రెండు పర్యాయాలు వీసీగా సేవలందించిన ఆయన.. అంతకముందు బరోడాలోని మహారాజా సాయాజిరావు యూనివర్సిటీలో ఏప్రిల్‌ 2005 నుంచి 2008 ఏప్రిల్‌ వరకు వీసీగా పనిచేశారు. ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో స్పెషలైజేషన్‌తో పొలిటికల్‌ సైన్స్‌లో స్కాలర్‌ అయిన సోనీ.. వీసీగా ఉన్న కాలం మినహా 1991 నుంచి 2016 వరకు గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో వల్లభ్‌ విద్యానగర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్శిటీ (SPU)లో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అంశాన్ని బోధించేవారు. మహారాజా సాయాజీరావు వర్సిటీలో వీసీగా చేరినప్పుడు ఆయన అత్యంత పిన్న వయస్కుడైన వీసీగా రికార్డు నమోదు చేసుకున్నారు. అఖిలభారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యూపీఎస్సీలో ఛైర్మన్‌తో పాటు గరిష్ఠంగా 10మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం దాదాపు ఐదుగురు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నట్టు సమాచారం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని