వెయిటేజి చూసి.. పట్టు పట్టాలి!

ఇంజినీరింగ్‌ వృత్తివిద్యలో ప్రవేశం కోరే ఇంటర్మీడియట్‌ ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్‌ కీలకం. దీని షెడ్యూల్‌ ఖరారయింది. పరీక్ష వ్యవధి మరో నాలుగు నెలలే ఉంది. జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహించే ఈ అఖిల భారత పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు

Published : 02 Sep 2019 00:46 IST

జేఈఈ - 2020 వ్యూహం

స్కోరుకు రెండో సంవత్సరమే కీలకం

ఇంటర్‌, జేఈఈల సమతుల్యత

ఇంజినీరింగ్‌ వృత్తివిద్యలో ప్రవేశం కోరే ఇంటర్మీడియట్‌ ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్‌ కీలకం. దీని షెడ్యూల్‌ ఖరారయింది. పరీక్ష వ్యవధి మరో నాలుగు నెలలే ఉంది. జనవరి, ఏప్రిల్‌లలో నిర్వహించే ఈ అఖిల భారత పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు మార్చిలో జరిగే ఇంటర్‌మీడియట్‌ బోర్డ్‌ పరీక్షలు సవాలే. ఈ ఒత్తిడిని నియంత్రించుకుని, జేఈఈ మెయిన్‌లో స్కోరు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. 200కు పైగా మార్కుల లక్ష్యాన్ని పెట్టుకుని సమయం వృథా చేయకుండా పట్టుదలగా ప్రిపరేషన్‌ సాగించాలి. అందుకు తోడ్పడే మెలకువలివిగో!

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహణలో జేఈఈ మెయిన్‌ పరీక్ష జనవరి 6 నుంచి 11 వరకు మొదటి దఫా జరగబోతోంది. రెండో దఫా ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు. ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐటీలూ, ఐఐటీలూ, డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశం పొందగోరే విద్యార్థులకు ఈ పరీక్ష ర్యాంకు ముఖ్యం. రాబోయే నాలుగు మాసాల కాలవ్యవధిలో అటు ఇంటర్మీడియట్‌ పరీక్షల ప్రిపరేషన్‌తోపాటు ఇటు జేఈఈ మెయిన్‌లో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించాలనుకున్న విద్యార్థులు ఆచరణాత్మక ప్రణాళికను అమలు చేయాలి.

ఇందుకు- ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యాంశాలతో సొంత నోట్సు రాసుకోవాలి. వెయిటేజి అధికంగా ఉన్న అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పాత ప్రశ్నపత్రాలను శ్రద్ధగా సాధన చేయాలి.

పరీక్షా విధానం

360 మార్కులకు 3 గంటల సమయంలో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించే పరీక్ష - జేఈఈ మెయిన్‌. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో ప్రతి సబ్జెక్టులో 30 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇస్తే ఒక రుణాత్మక మార్కు. 2019లో ఈ పరీక్షను జనవరి, ఏప్రిల్‌ మాసాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో 16 విభిన్న ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. అదే విధంగా 2020 సంవత్సరం కూడా ఉంటుంది.

గడిచిపోయిన పరీక్షల గురించి ప్రస్తావించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే- జేఈఈ మెయిన్‌- 2020 జనవరికి సన్నద్ధమయ్యే ప్రతి విద్యార్థీ గతంలో నిర్వహించిన పదహారు పేపర్లనూ ఎన్‌టీఏ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆ ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా సాధన చేయటం ఎంతో ప్రయోజనకరం.

సిలబస్‌, ప్రశ్నలు

2019 ప్రశ్నపత్రాలను సమగ్రంగా పరిశీలిస్తే తెలిసేది ఏమిటంటే 60% పైగా ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలోని మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచే అడిగారు. అందుకని సాధారణ విద్యార్థి జేఈఈ మెయిన్‌లో అసాధారణ ప్రతిభ చూపించాలంటే ద్వితీయ సంవత్సరంలోని అన్ని అంశాలపై ఎక్కువ పట్టు సాధించేలా ఉండాలి. దీనివల్ల అటు బోర్డు పరీక్షలూ, ఇటు జేఈఈ మెయిన్‌ పరీక్షలు రెండింటినీ సమతుల్యం చేయవచ్ఛు

సంక్షిప్త సమాచారం

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలలో ప్రతి అంశంపై సంక్షిప్త వివరాలతో కూడిన సొంతశైలి సమాచారం తయారు చేసుకోవాలి. తర్వాత ప్రతి అంశానికీ సంబంధించిన పరీక్షలకు ఎక్కువ సిద్ధం కావాలి. కాలాన్ని వృథా చేయకుండా కనీసం ప్రతి సబ్జెక్టుకు 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాలి. గంటలో 20 నుంచి 25 ప్రశ్నలు ప్రతి సబ్జెక్టులో తప్పులు చేయకుండా, వివరణతో కూడిన సమాధానాలను పేపర్‌పై రాస్తూ, సాధన చేస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి.

కెమిస్ట్రీ

కెమిస్ట్రీలో 30 నుంచి 35 శాతం ప్రశ్నలు ఫిజికల్‌ కెమిస్ట్రీ నుంచి, 25 నుంచి 30 శాతం ప్రశ్నలు ఇనార్గానిక్‌ నుంచి, మిగిలిన శాతం ప్రశ్నలు ఆర్గానిక్‌ నుంచి వస్తున్నాయి.

సొంత వివరణతో...

ఈ సబ్జెక్టులో జేఈఈ పరంగా పట్టు రావాలంటే పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలకు పరిమితం అవ్వాలి. వేరే వాటి జోలికి వెళ్లొద్ధు ప్రతి చాఫ్టర్‌లోని ప్రతి అంశాన్నీ చదివి దానికి స్వీయ వివరణతో కూడిన నోట్స్‌ తయారుచేసుకోండి. అదే అంశానికి సంబంధించిన పాత జేఈఈ మెయిన్‌ ప్రశ్నలన్నింటినీ సాధన చేయాలి.

పూర్తి పట్టు సాధించాల్సిన అంశాలు-

* కెమికల్‌ బాండింగ్‌

* పీ బ్లాక్‌ ఎలిమెంట్స్‌

* ఈక్విలిబ్రియమ్‌

* జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (జీఓసీ)

* థెర్మో డైనమిక్స్‌

* కోఆర్డినేషన్‌ కాంపౌండ్స్‌

ఫిజిక్స్‌

చాలామంది కష్టంగా భావించే ఫిజిక్స్‌లో కిందటిసారి జరిగిన పరీక్షలో ప్రాథమిక సమాచారం, మౌలిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కువ సమయం హరించని ప్రశ్నలను మాత్రమే అడిగారు. ఎప్పటిలాగే మెకానిక్స్‌ నుంచి 35% ప్రశ్నలు, హీట్‌ నుంచి 10%, ఎలక్ట్రో స్టాటిక్స్‌ అండ్‌ మాగ్నటిజం నుంచి 18%, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ- ఈఎంఐల నుంచి 20%, 17% ప్రశ్నలు ఆప్టిక్స్‌, మోడర్న్‌ ఫిజిక్స్‌ నుంచి ఇచ్చారు.

గత పరీక్షల నుంచి...

గతంలో జేఈఈ మెయిన్‌లో కీలకపాత్ర పోషించిన అంశాలపై ఎక్కువ దృష్టి సారించండి. పాత జేఈఈ పేపర్ల సాధన మరవవద్ధు ముఖ్య అధ్యాయాల్లో ప్రాథమిక అంశాలతోపాటు, మిశ్రమ అంశాలపై సాధన ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్స్‌లో పై అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడిగారో గమనించాలి. వాటికి సంబంధించిన సూత్రాలు, సమీకరణాలపై అవగాహన పెంచుకోవాలి.

పూర్తి పట్టు సాధించాల్సిన అంశాలు-

* గ్రావిటేషన్‌

* ఎస్‌హెచ్‌ఎం

* వేవ్స్‌

* కరెంట్‌ ఎలక్ట్రిసిటీ

* ఈఎంఐ

* మోడర్న్‌ ఫిజిక్స్‌

* థెర్మో డైనమిక్స్‌

మ్యాథ్స్‌

ఎక్కువమంది విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రాలతో పోలిస్తే మ్యాథ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే మ్యాథ్స్‌లో ఎప్పటిలాగే 35% ప్రశ్నలు వెక్టార్స్‌, 3డీ, కోఆర్డినేట్‌ జామెట్రీల నుంచి, 32% శాతం కాల్‌క్యులస్‌ నుంచి, 25% ఆల్జీబ్రా నుంచి, మిగిలిన శాతం ట్రిగొనామెట్రీ నుంచి మాత్రమే ఇస్తున్నారు.

పూర్తి పట్టు సాధించాల్సిన అంశాలు-

* సీక్వెన్సెస్‌ అండ్‌ సిరీస్‌

* స్ట్రెయిట్‌ లైన్స్‌-సర్కిల్స్‌

* మ్యాట్రిసెస్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌

* డఫెనిట్‌ ఇంటెగ్రల్స్‌

* అప్లికేషన్‌ ఆఫ్‌ డెరివేటివ్స్‌

* వెక్టార్స్‌ అండ్‌ 3డీ

రాబోయే రోజుల్లో పైన పేర్కొన్న అధ్యాయాల నుంచి నెలకు కనీసం రెండు అధ్యాయాలను క్షుణ్ణంగా సాధన చేయాలి. చివర్లో ప్రతి అంశంపై పాత జేఈఈ మెయిన్‌ పేపర్లలో అడిగిన ప్రశ్నలను సాధన చేయాలి. ఇలా క్రమపద్ధతిలో చేస్తే, అత్యధిక మార్కులు పొందొచ్ఛు

- ఎం. ఉమాశంకర్‌

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని