మేటి ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
ఉచితంగా పైలట్ శిక్షణ
తొలి నెల నుంచే లక్ష జీతం
వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ఏర్ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్) ముఖ్యమైంది. ఈ పరీక్షలో నెగ్గినవారు పైలట్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో కీలక కొలువుల్లో సేవలు అందించే వీలుంది. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం, ప్రోత్సాహకాలు సొంతమవుతాయి. భవిష్యత్తులో అత్యున్నత స్థాయిని చేరుకునే అవకాశమున్న ఈ పోస్టులకు గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. తాజాగా వెలువడిన ఏఎఫ్ క్యాట్ 2021 (2) వివరాలు చూద్దాం..
యువత ఆశించే ఉద్యోగాల్లో పైలట్ ఒకటి. అయితే చాలామంది విషయంలో ఆర్థిక నేపథ్యం ప్రధాన అడ్డంకిగా నిలుస్తుంది. మేటి సంస్థల్లో పూర్తిస్థాయిలో శిక్షణ పొందడానికి రూ.అర కోటి మించే ఖర్చవుతుంది. ఒకవేళ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నా ఉద్యోగానికి హామీ లేదు. అదే ఏఎఫ్ క్యాట్తో ఉచితంగా పైలట్ శిక్షణ పొందడంతోపాటు, ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో వాయుసేనలో దూసుకుపోవచ్చు. మేటి ప్రతిభ చూపినవారు నేరుగా యుద్ధ విమానాలు నడపడానికి అర్హత పొందవచ్చు.
పైలట్ ఒక్కటే కాకుండా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉన్నతోద్యోగాలకు ఏఎఫ్ క్యాట్ దారి చూపుతుంది. ఈ పోస్టులను ముందుగానే లక్ష్యంగా చేసుకున్నవారు మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకోవచ్చు. తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నవారు సైతం ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తే రెండు మూడు ప్రయత్నాల్లోనే కొలువును ఖాయం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను శాశ్వత, 14 ఏళ్ల వ్యవధితో తాత్కాలికంగా కొనసాగే ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వీటికి మహిళలూ పోటీ పడవచ్చు.
పరీక్ష ఇలా..
ఇందులో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్, నాన్ టెక్నికల్, మెటీరియాలజీ బ్రాంచీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగానే ఉంటుంది. దీన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు.
మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు.
స్టేజ్ 1, 2 ఇలా...
రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఏర్ఫోర్స్ సెలక్షన్ బోర్డు (ఏఎఫ్ఎస్బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3 చిన్ అప్స్ తీయగలగాలి. స్టేజ్ -1 స్క్రీనింగ్ టెస్టు. ఇందులో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రాటింగ్ టెస్టు, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్మెంట్స్, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్ -2కి వెళ్తారు.
స్టేజ్ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత ఇండోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. అనంతరం వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్ (పైలట్)కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం (సీపీఎస్ఎస్) పరీక్ష ఉంటుంది. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మెడికల్ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైనవారిని మెరిట్ లిస్టు తయారుచేసి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు.
ప్రశ్నాంశాలు, సన్నద్ధత
* జనరల్ అవేర్నెస్: ఈ విభాగంలో చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. సాధారణ అవగాహనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. హైస్కూల్ సోషల్, సైన్స్ పుస్తకాల్లోని ప్రాథమికాంశాలు చదువుకోవాలి. వర్తమానాంశాల కోసం పత్రికా పఠనం ఉపయోగపడుతుంది. ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకుని పరీక్షకు ముందు ఒకసారి చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
* వెర్బల్ ఎబిలిటీ: కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్ల్లీషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఒకాబులరీల నుంచి ప్రశ్నలడుగుతారు. అభ్యర్థి ఆంగ్లం ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునేలా ఈ ప్రశ్నలుంటాయి. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే సరిపోతుంది.
* న్యూమరికల్ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదువుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
* రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్: వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ (మెంటల్ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. బాగా ఆలోచించడం ద్వారా సమాధానం గుర్తించవచ్చు.
* ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్టులో సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎదుర్కోవడానికి బీటెక్ పాఠ్యపుస్తకాలు బాగా చదవడం తప్పనిసరి.
* పరీక్షకు ముందు వీలైనన్ని మాక్టెస్టులు రాయాలి. సమయపాలనను అలవాటు చేసుకుని, వెనుకబడిన విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఏ అర్హతలుండాలి?
ఫ్లయింగ్ బ్రాంచి, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ / ప్లస్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండడం తప్పనిసరి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: జులై 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1998 - జులై 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం
ఉండరాదు.
గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచి
ఇందులో ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్/ +2లో ఫిజిక్స్, మ్యాథ్స్ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ - నాన్ టెక్నికల్ బ్రాంచి
ఇందులో అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అడ్మిన్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు, ఎడ్యుకేషన్ బ్రాంచీ పోస్టులకు ఏదైనా పీజీ పూర్తిచేసుకున్నవారు, మెటీరియాలజీ విభాగానికి నిర్దేశిత సబ్జెక్టుల్లో సైన్స్ పీజీ చదువుకున్నవారు అర్హులు.
వయసు: గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జులై 1, 2022 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1996 - జులై 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ. ఎత్తు తప్పనిసరి.
ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 334 .
ఆన్లైన్ దరఖాస్తులు: జూన్ 1 నుంచి జూన్ 30 వరకు
వెబ్సైట్: https://afcat.cdac.in
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
సర్ప్రైజ్ గిఫ్ట్.. కళ్లు మూసుకో అని చెప్పి కత్తితో పొడిచి చంపారు!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు