నేవీలో 2800 ఉద్యోగాలు

చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలకు భారతీయ నౌకాదళం వేదికగా నిలుస్తోంది. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తోంది. అందువల్ల యువతరం వీటిపై ఆసక్తి చూపుతోంది. తాజాగా 2800 సెయిలర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటిలో సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) 2000, ఆర్టిఫీసర్‌ అప్రెంటీస్‌ (ఏఏ) 500, మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) 300 ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. శిక్షణ నిర్వహించి అనంతరం విధుల్లోకి చేర్చుకుంటారు.

Updated : 25 Oct 2021 06:13 IST

పది, ఇంటర్‌ అర్హతలతో ఆకర్షణీయ కెరియర్‌

చిన్న వయసులోనే చక్కని ఉద్యోగాలకు భారతీయ నౌకాదళం వేదికగా నిలుస్తోంది. పదో తరగతి, ఇంటర్‌ విద్యార్హతలతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తోంది. అందువల్ల యువతరం వీటిపై ఆసక్తి చూపుతోంది. తాజాగా 2800 సెయిలర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. వీటిలో సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) 2000, ఆర్టిఫీసర్‌ అప్రెంటీస్‌ (ఏఏ) 500, మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) 300 ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. శిక్షణ నిర్వహించి అనంతరం విధుల్లోకి చేర్చుకుంటారు. వీటిలో ఏ ఉద్యోగానికి ఎంపికైనా మొదటి నెల నుంచే రూ.35,000కు పైగా వేతనం అందుకోవచ్చు. ఈ మూడు ఉద్యోగాలకూ ఎంపికైనవారు భవిష్యత్తులో మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌ స్థాయికి చేరుకోవచ్చు!

క్యాలెండర్‌ ప్రకారం పోస్టులు భర్తీ చేయడం రక్షణ ఉద్యోగాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. పది, ఇంటర్‌ అర్హతలతో నిర్వహించే నాన్‌ ఆఫీసర్‌ పోస్టులైన మెట్రిక్‌ రిక్రూట్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ పోస్టుకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించినప్పటికీ భర్తీ మాత్రం ఆయా రాష్ట్రాలవారీ కేటాయించిన ఖాళీల ప్రకారం జరుగుతుంది. కేవలం పది విద్యార్హతతోనే మెట్రిక్‌ ఎంట్రీలో భాగంగా షెఫ్‌, స్టివార్డ్‌, హైజీనిస్టులకు పోటీ పడవచ్చు. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ రెండు పోస్టులకూ అర్హులే. ఆసక్తి ఉన్నవారు ఈ రెండు పోస్టులకూ కలిపి పరీక్ష రాసుకోవచ్చు. మూడు విభాగాల్లో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ శిక్షణ సమయంలో రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం రూ.21,700 మూలవేతనం లభిస్తుంది. దీంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ) ఇస్తారు. వీటికి అదనంగా డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అందుకోవచ్చు. ఏఏకు ఎంపికైనవారికి ఎక్స్‌ గ్రూప్‌ పే కింద అదనంగా రూ.6200 అందుతుంది.


రాతపరీక్ష ఇలా...

* మెట్రిక్‌ రిక్రూట్‌: ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. సైన్సు, మ్యాథమేటిక్స్‌ ఒక విభాగంలో; జనరల్‌ నాలెడ్జ్‌ మరో విభాగంలో అడుగుతారు. అభ్యర్థులు రెండు సెక్షన్లలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రం ఇండియన్‌ నేవీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఫిజికల్‌, మెడికల్‌ పరీక్షలు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తిచేస్తారు.

* ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ: ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌. ప్రశ్నలన్నీ 10+2 (ఇంటర్మీడియట్‌) స్థాయిలోనే ఉంటాయి. రుణాత్మక మార్కులున్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. అన్ని సెక్షన్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి అలాగే నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోరు ఉన్నవారిని తర్వాత దశకు తీసుకుంటారు. సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రాలను నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.


విద్యార్హతలు, వయసు 

* మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌): పదో తరగతి ఉత్తీర్ణత. ఏప్రిల్‌ 1, 2002 - మార్చి 31, 2005 మధ్య జన్మించినవారే అర్హులు.

* సీనియర్‌ సెకెండరీ రిక్రూట్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంంప్యూటర్‌ సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి.

* ఆర్టిఫిసర్‌ అప్రెంటిస్‌ (ఏఏ): ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్ల్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.

* ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ రెండు పోస్టులకూ ఫిబ్రవరి 1, 2002 - జనవరి 31, 2005 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ మూడు పోస్టులకూ అవివాహిత పురుషులే అర్హులు.


ఎంపికైతే...

ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ ఉద్యోగంలో చేరినవారికి లెవెల్‌ 3 వేతన శ్రేణి ప్రకారం రూ. 21700 మూలవేతనం లభిస్తుంది. దీంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే రూ.5200, గ్రూప్‌-ఎక్స్‌ పే  రూ.6200 (ఏఏ పోస్టులకు), డీఏ ప్రతినెలా లభిస్తాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌లు ప్రారంభంలోనే రూ.35 వేలు, ఏఏలు రూ.42 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. క్యాంటీన్‌, ఎల్‌టీసీ, వైద్య సేవలు..మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. ఏఏకు ఎంపికైనవారు 20 సంవత్సరాలు, ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌ విభాగాల్లో చేరినవాళ్లు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సేవలు పొడిగిస్తారు. నిర్ణీత వ్యవధి తర్వాత పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పింఛను జీవితాంతం లభిస్తుంది. సెయిలర్‌- ఎంఆర్‌, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏగా విధుల్లో చేరినవారు మాస్టర్‌ చీఫ్‌ పెట్టీ ఆఫీసర్‌-1 (లెవెల్‌ 8) హోదా వరకు చేరుకోవచ్చు.


విధులిలా...

పదో తరగతితో మెట్రిక్‌ రిక్రూట్‌ ద్వారా ఎంపికైనవారికి షెఫ్‌, స్టివార్డ్‌, హైజీనిస్ట్‌ ఉద్యోగాలు ఉంటాయి. వీటిలో షెఫ్‌ పోస్టుకు ఎంపికైనవారు విధుల్లో భాగంగా ఆహారాన్ని వండాలి. ఆహార పదార్థాల స్టోర్‌ నిర్వహణ బాధ్యతను చూసుకోవాలి. స్టివార్డ్‌గా సేవలు అందించేవారు వడ్డన బాధ్యతలు తీసుకుంటారు. భోజన తయారీలోనూ పాలుపంచుకుంటారు. అలాగే వీరు వెయిటర్‌ గానూ వ్యవహరించాలి. హైజీనిస్టులు గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఉద్యోగంలో కొనసాగుతూనే వీరు వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులను పూర్తిచేస్తారు. సర్వీస్‌ నుంచి వైదొలిగే సమయానికి డిగ్రీతో సమాన హోదా ఉన్న సర్టిఫికెట్‌ అందుకుంటారు. ఆర్టిఫీసర్‌ అప్రెంటిస్‌ విధులు నిర్వర్తించేవారు నేవీలో ఉపయోగించే పరికరాలు (టర్బైన్లు, యంత్రాలు) నిర్వహణ, మరమ్మతులను చేపడతారు. వీరికి డిప్లొమా సర్టిఫికెట్‌ అందిస్తారు. ఎస్‌ఎస్‌ఆర్‌ విభాగంలో చేరినవాళ్లు అధునాతన నౌకలు, శక్తిమంతమైన పరికరాల నిర్వహణ, పర్యవేక్షణ తదితర బాధ్యతలు తీసుకుంటారు. సబ్‌ మెరైన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైన మరమ్మతులు వీరే చూసుకుంటారు. వీరికి 15 ఏళ్ల సర్వీసు అనంతరం డిగ్రీతో సమానమైన సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఎంఆర్‌ పోస్టులకు అక్టోబరు 29 నుంచి నవంబరు 2 వరకు స్వీకరిస్తారు. ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ పోస్టులకు అక్టోబరు 25లోగా దరఖాస్తు చేసుకోవాలి. ‌www.joinindiannavy.gov.in


ఎంపిక విధానం

ఏ విభాగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ), ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అర్హులను ఎంపికచేస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో మెట్రిక్‌ రిక్రూట్‌ (ఎంఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి వాళ్లు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం, ఆయా రాష్ట్రాల కోటా అనుసరించి 1500 మందిని పరీక్ష రాయడానికి ఎంపికచేస్తారు. అలాగే ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ పోస్టులకు ఇంటర్‌ మార్కుల మెరిట్‌, రాష్ట్రాల కోటా ప్రకారం మొత్తం పదివేల మందికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్ష రాయడానికి తాజా ఆర్‌టీ పీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరి.


ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ)

ఆయా పోస్టులకు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించినవారికి పీఎఫ్‌టీ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 స్క్వేట్‌ అప్స్‌, 10 పుష్‌అప్స్‌ తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి.


వైద్య పరీక్షలు

దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వీటిని నిర్వహిస్తారు. ఎంఆర్‌ పోస్టులకు 400, ఏఏ పోస్టులకు 600, ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు 2500 మందిని ఎంపికచేసి వైద్యపరీక్షలు జరుపుతారు. ఇందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్‌ ఆధారంగా ఆయా రాష్ట్రాల కోటా ప్రకారం తుది నియామకాలు చేపడతారు.


శిక్షణ..

ఎంఆర్‌ విభాగంలో ఎంపికైనవారికి ఏప్రిల్‌ నుంచి, ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ పోస్టులకు ఫిబ్రవరి నుంచి ఐఎన్‌ఎస్‌, చిలకలో ప్రాథమిక శిక్షణ మొదలవుతుంది. ఎంఆర్‌ విభాగానికి 12 వారాలు, ఏఏ పోస్టుకు 9 వారాలు, ఎస్‌ఎస్‌ఆర్‌ ఉద్యోగాలకు 22 వారాలపాటు ఈ శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్‌/ ట్రేడుల్లో ఏదైనా నేవీ కేంద్రంలో తర్వాత దశ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా ప్రొఫెషనల్‌ శిక్షణను పూర్తిచేసుకున్నవారిని సెయిలర్‌ - ఎంఆర్‌/ ఏఏ/ ఎస్‌ఎస్‌ఆర్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని