పర్యావరణం..సులువుగా అధ్యయనం!

సన్నద్ధత విధానం ఈరోజుల్లో అన్ని పోటీ పరీక్షల్లోనూ ‘పర్యావరణ మార్పులు’ ఓ కీలకాంశం. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు దీన్ని వర్తమాన వ్యవహారాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల సులువుగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం బిట్లు బట్టీ పట్టకుండా... పర్యావరణ అధ్యయనం ప్రాథమిక అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల... దాని ఆధారంగా వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇవ్వగలుగుతారు.

Published : 17 May 2022 05:49 IST

‘ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌’ 

సన్నద్ధత విధానంఈ రోజుల్లో అన్ని పోటీ పరీక్షల్లోనూ ‘పర్యావరణ మార్పులు’ ఓ కీలకాంశం. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్‌ ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు దీన్ని వర్తమాన  వ్యవహారాలతో అనుసంధానం చేసుకుంటూ చదవడం వల్ల సులువుగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం బిట్లు బట్టీ పట్టకుండా... పర్యావరణ అధ్యయనం ప్రాథమిక అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల... దాని ఆధారంగా వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇవ్వగలుగుతారు.

4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించినా మొదటి 500 మిలియన్‌ సంవత్సరాలు కేవలం రసాయనిక విప్లవం (కెమికల్‌ రివల్యూషన్‌) జరిగింది. అంటే అనేక అకర్బన, కర్బన మూలకాలు పదార్థాలుగా ఏర్పడ్డాయి. అవి ఒకదానికొకటి అనుసంధానించుకొని అతి సంక్షిష్టమైన న్యూక్లియోటైడ్‌లుగా అవతరించాయి. నత్రజని క్షారాలు, రైబోజ్‌ - ఫాస్పేట్‌ల కలయికనే న్యూక్లియోటైడ్‌ అంటున్నాం. భూమి సూర్యుని నుంచి విడివడిన తర్వాత సూర్యుని చుట్టూ పరిభ్రమించడం, తన చుట్టూ తాను తిరగడం వల్ల అనేక మార్పులు జరిగాయి. ఇక్కడి నుంచే జీవం ఆరంభమైంది. అభ్యర్థులు దీన్నుంచే మొదలుపెట్టాలి.

ఇదే విధానంలో ఏర్పడిన అమైనో ఆమ్లాలు న్యూక్లియోటైడ్‌లకు ఆకర్షితమై దగ్గరగా వచ్చాయి. మూడేసి న్యూక్లియోటైడ్‌లు ఒక్కొక్క అమైనో ఆమ్లాన్ని ఆకర్షించడం మొదలుపెట్టాయి. ఈ న్యూక్లియోడైట్‌ గొలుసునే ఆర్‌ఎన్‌ఏ అంటారు. 3 న్యూక్లియోటైడ్‌లను కలిపితే ఒక కోడాన్‌ అంటారు, అదే ట్రిపుల్‌ కోడాన్‌. ఈ కోడాన్‌లన్నీ వరసగా అమరి ఆర్‌ఎన్‌ఏలో ఉంటాయి. ఒక్కొక్క అమైనో ఆమ్లం ఒకదానికొకటి కలిసి ఒక పాలీపెప్టెడ్‌ గొలుసు ఏర్పడుతుంది. దీనినే ప్రొటీన్‌ అంటారు. ఈ విధంగా ఆర్‌ఎన్‌ఏ చుట్టూ ఒక ప్రొటీన్‌ ఏర్పడి వైరస్‌ అవతరించింది. దాని నుంచి కాలానుగుణంగా బాక్టీరియా, ప్రొటోజోవా, స్పంజికలు, కీటకాలు తదిరాలతోపాటు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఆవిర్భవించాయి. ఈ జంతువులకు సమాంతరంగా మొక్కలు ఉద్భవించాయి.

ఈ రకంగా ఉద్భవించిన మొక్కలు, జంతువులు... వాతావరణం, జలావరణం, శిలావరణం కలయిక ద్వారా ఏర్పడిన బయోస్పియర్‌లో భాగమయ్యాయి. మిగిలినవి అబయోటిక్‌ కారకాలుగా ఉన్నాయి. ఇవి బయోస్పియర్‌లోని మొక్కలను, జంతువులను క్రమంగా ప్రభావితం చేస్తూ మార్పులకు గురిచేస్తున్నాయి. ఈ ప్రభావంతో అనేక కొత్త జీవులు పుట్టుకొచ్చాయి. దీనినే బయో డైవర్సిటీ అంటాం.

ప్రస్తుతం జరుగుతున్నది ఆరో అంతరించిపోయే దశ. పోటీ పరీక్షల్లో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మిగతావాటిలో మానవ ప్రమేయం లేదు. కానీ ప్రస్తుతం మనుషుల కారణంగా ఈ ప్రక్రియ వేగవంతం అవుతోంది.

అభివృద్ధి -పర్యావరణం.. 

మానవ అభివృద్ధి జరగాలంటే పర్యావరణానికి కొంత చేటు తప్పదు అనే భావన ఉంది. అయితే వాతావరణం ప్రతి జీవి మనుగడకు అవసరమైన వనరులను సమకూరుస్తుంది. కానీ ఇక్కడ అవసరానికి బదులు ఆశ వస్తేనే సమస్య మొదలవుతుంది. పశ్చిమ దేశాలు పర్యావరణాన్ని నాశనం చేసి అభివృద్ధి సాధించాయి. ఇప్పుడు అంతా అయిపోయాక పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతున్నాయనేది అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల వాదన.

* 2వ ప్రపంచ యుద్ధానంతరం 1948లో పర్యావరణ పరిరక్షణకు వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలతో కలిపి ఐయూసీఎన్‌ (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌) అవతరించింది. ఈ సంస్థ 1964 నుంచి జంతు, మొక్క జాతుల్లో అంతరించిపోతున్న, అంతరించడానికి సిద్ధంగా ఉన్న వివిధ జాతుల వివరాలను రెడ్‌ లిస్ట్‌ పేరుతో విడుదల చేస్తోంది.

* 1972లో జరిగిన స్టాక్‌హోమ్‌ సమావేశం, తదనంతరం ఏర్పాటైన యూఎన్‌ఈపీ (యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌)... దీనివల్ల ప్రపంచ దేశాల్లో జరిగిన మార్పులతోపాటు మన దేశంలో 253వ రాజ్యాంగ అధికరణ ప్రకారం చేసిన చట్టాలు, ఏర్పడిన సంస్థలు, అవి చేస్తున్న పరిరక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.

జీవులు అంతరించడానికి ముఖ్యంగా 4 కారణాలు..

1. అవి నివసిస్తున్న ప్రాంతం లేకుండా పోవడం - ఇది ప్రభుత్వం చేపడుతున్న అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల వల్ల కావొచ్చు.

2. ప్రకృతి వనరుల్ని అతిగా ఉపయోగించడం. 

3. ఇతర ప్రాంతాలకు చెందిన జాతులను ప్రవేశపెట్టడం వల్ల స్థానిక జాతులు అంతరిస్తాయి. ఉదాహరణకు పార్దీనియా, ఎకోర్నియాలు ప్రవేశించడం వల్ల స్థానిక జాతులు నశించాయి.

4. కో ఎక్స్‌టింక్షన్‌ వల్ల కావొచ్చు. ఒక జాతి మరొక జాతిపై ఆధారపడినప్పుడు ఒకటి అంతరిస్తే రెండోదీ అంతరిస్తుంది.

ఈ నేపథ్యంలో ఒక జీవికి, మరో జీవికి మధ్య ఉన్న సంబంధాన్ని అభ్యర్థులు గుర్తించాలి.

* ప్లస్‌ అనేది లబ్ధి చేకూర్చే సంబంధం 

* మైనస్‌ అనేది నాశనం చేసే సంబంధం బీ సున్నా తటస్థతను సూచిస్తుంది. 

* ఉదాహరణకు పిట్చర్‌ మొక్క కీటకాన్ని తింటుంది. ఇది ప్రిడేషన్‌కు ఉదాహరణ. 

అలాగే సతతహరితారణ్యాలలోని మొక్కలు సూర్యరశ్మి కోసం ఒకదానితో మరొకటి పోటీపడతాయి. ఆవులపై ఉండే ఎగ్రిట్‌ కమెన్సలిజమ్‌కు ఉదాహరణ. ఆవరణ వ్యవస్థలోని జీవులు ఈ విధంగా ఒకదానితో మరొకటి సంబంధం కలిగి, అజీవక కారకాలతో ప్రభావితం అవుతూ జీవిస్తున్నాయి.

ఇంతకుముందు అంతరించిపోయిన పరిస్థితులు..భూమి చరిత్రను మనం 5 యుగాలుగా చెప్పొచ్చు. అవి 

1. అజోయిక్‌ యుగం  2. ప్రొటిరోజోయిక్‌ యుగం 3. పెలియోజోయిక్‌ యుగం 4. మీసోజోయిక్‌ యుగం 5. సన్‌జోయిక్‌ యుగం

* ఈ యుగాల్లో అనేక జీవులు పరిణామం చెందాయి, మరికొన్ని అంతరించాయి. ఇప్పటివరకు అయిదుసార్లు ఇలా అంతరించిపోవడం (ఎక్స్‌టింక్షన్‌) జరిగింది. ఇది ముఖ్యంగా పేలియో, మీసో, సన్‌జోయిక్‌ యుగాల్లో జరిగింది. అజీవక కారకాల్లో వచ్చిన మార్పులకు తట్టుకోలేకే జీవులు అంతరించి మళ్లీ కొత్త జీవులు ఉద్భవించాయి. దీనికి కారణం ప్రకృతే!

* వివిధ దేశాలు వాతావరణ ఉష్ణోగ్రత పెరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయనేదీ ముఖ్యమే. ఇటీవల జరిగిన గ్లాస్‌గో సమావేశంలో చర్చించిన అంశాలు - నిర్ణయాల అమల్లో వస్తున్న సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు పరిశీలించాలి. 

8  వెట్‌లాండ్స్‌ (చిత్తడి నేలలు) పరిరక్షణ కోసం 1971లో ఇరాన్‌లోని రామ్‌సర్‌లో జరిగిన సమావేశం గురించి తెలుసుకోవాలి. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో గుర్తించిన వెట్‌లాండ్స్‌పై దృష్టి సారించాలి.


స్టడీకోట్‌

నువ్వు దేన్నయినా నేర్చుకోవడం మొదలుపెడితే.. నీ మనసు అలసిపోదు, భయపడదు, నిరుత్సాహపడదు!

- లియొనార్డో డావెన్సీ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని