POSTAL JOBS: పదో తరగతితో తపాలా కొలువులు!

తపాలా విభాగంలో సేవలు అందించడానికి గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించవచ్చు. పోస్టును బట్టి రూ.పదివేల నుంచి రూ.పన్నెండు వేల వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి....

Updated : 18 May 2022 06:14 IST

ఏపీలో 1716, తెలంగాణలో 1226 ఖాళీలు
గ్రామీణ డాక్‌ సేవక్‌ ప్రకటన

తపాలా విభాగంలో సేవలు అందించడానికి గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించవచ్చు. పోస్టును బట్టి రూ.పదివేల నుంచి రూ.పన్నెండు వేల వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌లో 1716, తెలంగాణలో 1226 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. దీనికిగాను బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం)కు రూ.12 వేలు, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌లకు రూ.10 వేలు చెల్లిస్తారు. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్‌ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ఫోన్‌ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్‌ తొక్కడం రావాలి.  

ఎంపిక విధానం

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్‌డ్‌/ అన్‌ రిజర్వ్‌డ్‌ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్‌-1 తర్వాత దానికి ఆప్షన్‌-2...ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్‌ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్‌/పోస్టు ద్వారా అందుతుంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి.
వయసు: జూన్‌ 5, 2022 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.    
ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు.
మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 5

వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in/


బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (బీపీఎం)

పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.


అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (ఏబీపీఎం)

ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తిచేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.


డాక్‌ సేవక్‌

విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని