అవుతారా ఆర్మీ ఆఫీసర్‌?

ఇండియన్‌ ఆర్మీ 191 ఎస్‌ఎస్‌సీ టెక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. బీటెక్‌ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.

Published : 17 Mar 2022 10:22 IST

ఇండియన్‌ ఆర్మీ 191 ఎస్‌ఎస్‌సీ టెక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. బీటెక్‌ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో శిక్షణలోకి తీసుకుంటారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరికి సుమారు రూ.లక్ష వేతనంతోపాటు ప్రోత్సాహకాలూ అందుతాయి. 

ఏడాదికి రెండు సార్లు ఆర్మీ ఎస్‌ఎస్‌సీ టెక్‌ మెన్, ఉమెన్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థుల గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో  మౌఖిక పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజులు పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 

శిక్షణ.. వేతనాలు..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో అక్టోబరు, 2022 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్‌ కమిషన్‌ (శాశ్వత ఉద్యోగం) విధానంలో తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వీరు వైదొలగాల్సి ఉంటుంది. 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ఆలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. పలు ప్రోత్సాహకాలు పొందవచ్చు. 

ఖాళీల వివరాలు 

మొత్తం 191 పోస్టుల్లో మెన్‌ 175, ఉమెన్‌ 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. 

మెన్‌ ఖాళీల్లో విభాగాలవారీ.. సివిల్‌లో 40, ఆర్కిటెక్చర్‌ 2, మెకానికల్‌ 21, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ 14, కంప్యూటర్‌ సైన్స్‌ 33, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 9, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ 6, టెలీకమ్యూనికేషన్‌ 3, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 10, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 2, మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మైక్రోవేవ్‌ 1, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌/ ఏవియానిక్స్‌ 5, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 4, ప్రొడక్షన్‌ 1, ఆటోమొబైల్‌ 3, ఇండప్ట్రియల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌ 2, బాలిస్టిక్స్‌ 1, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ 1, ఫుడ్‌ టెక్‌ 1, అగ్రికల్చర్‌ 1, మెటలర్జీ అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ 2, ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ 1, ఫైబర్‌ ఆప్టిక్స్‌ 1, వర్క్‌షాప్‌ టెక్నాలజీ 2, లాజర్‌ టెక్నాలజీ 2, బయోటెక్నాలజీ 1, రబ్బర్‌ టెక్నాలజీ 1, కెమికల్‌ ఇంజినీరింగ్‌ 1, ట్రాన్స్‌పోర్టేషన్‌ 1, మైనింగ్‌ 1 చొప్పున ఉన్నాయి. మహిళలకు సంబంధించి సివిల్‌ 2, ఆర్కిటెక్చర్‌ 1, మెకానికల్‌ 2, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ 1, కంప్యూటర్స్‌ 3, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2, ఏరోనాటికల్‌ 1, టెలికమ్యూనికేషన్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 1 ఉన్నాయి.  

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల పోస్టులకు ఆ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ పూర్తిచేసుకున్నవారూ అర్హులే. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు పోటీపడవచ్చు.

వయసు: అక్టోబరు 1, 2022 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబరు 2, 1995 - అక్టోబరు 1, 2002లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 6 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.
www.joinindianarmy.nic.in  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని