మొదట అవగాహన.. ఆపైనే బిట్ల సాధన!

జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌)!  తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న నోటిఫికేషన్లు అన్నిటిలోనూ రాతపరీక్షల్లో ఉమ్మడిగా ఉండే సిలబస్‌. పరిధి దృష్ట్యా ఇది చాలా విస్తృతమైనది. ఇంత విస్తారమైన సిలబస్‌ చదివినా 100- 150 మార్కులకు మాత్రమే ఆబ్జెక్టివ్‌

Updated : 04 Apr 2022 06:30 IST

జీఎస్‌ ప్రిపరేషన్‌ మెలకువలు

జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌)!  తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న నోటిఫికేషన్లు అన్నిటిలోనూ రాతపరీక్షల్లో ఉమ్మడిగా ఉండే సిలబస్‌. పరిధి దృష్ట్యా ఇది చాలా విస్తృతమైనది. ఇంత విస్తారమైన సిలబస్‌ చదివినా 100- 150 మార్కులకు మాత్రమే ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో అవకాశం ఉంటుంది. ఎలా ప్రిపేరైతే గరిష్ఠ మార్కులు తెచ్చుకోవచ్చనే విషయంలో ప్రధానంగా కొత్త అభ్యర్థులు సందిగ్ధతకు లోనవుతుంటారు. ఆయా విభాగాలపై పట్టు తెచ్చుకోలేని పరిస్థితిలో ప్రేరణ కూడా కోల్పోతూ ఉంటారు. ఫలితంగా కావలసిన స్థాయిలో పోటీ పడలేని పరిస్థితిలో చిక్కుకుంటారు! జనరల్‌ స్టడీస్‌పై పట్టు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. చేయాల్సిందల్లా వ్యూహాత్మకంగా చదవటం! అదెలాగో పరిశీలిద్దాం.

జీఎస్‌లో 11 / 12 విభాగాలు ఉన్నప్పటికీ అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉండదు. ప్రధానంగా భారత భౌగోళిక అంశాలు, స్వాతంత్య్రోద్యమం, భారత రాజ్యాంగ వ్యవస్థ, జనరల్‌ సైన్స్‌, కరెంట్‌ అఫైర్స్‌, అంక గణితం, రీజనింగ్‌ సామర్థ్యాలకు ఎక్కువ మార్కులుంటాయి. అందువల్ల అభ్యర్థులు మొదట ఈ విభాగాలపై పట్టు తెచ్చుకునేందుకు కాలపట్టిక (టైమ్‌ టేబుల్‌)ను తయారు చేసుకోవాలి.

* మిగతా విభాగాలకు ప్రశ్నల సంఖ్యలో, మార్కుల కేటాయింపులో పెద్ద ప్రాధాన్యం లేకపోయినా చాలా తక్కువ శ్రమతో ఆయా అంశాలపై పట్టు సాధించవచ్చు. మార్కులు పొందవచ్చు. పర్యావరణ అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, విపత్తు నిర్వహణ, గవర్నెన్స్‌ మొదలైనవి ఈ కోవకి చెందుతాయి. ఈ విషయాలను సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అందుకే మొత్తం కాలపట్టికలో వీటికి తక్కువ సమయాన్ని కేటాయించి వ్యూహాత్మకంగా చదవాలి.

* ఉన్నత పాఠశాల స్థాయి జ్ఞానంతో జనరల్‌ స్టడీస్‌లోని కొన్ని విభాగాలను అనుసంధానం చేసుకుని ఉన్నట్లయితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. జనరల్‌ సైన్స్‌, భారత భౌగోళిక అంశాలు, అర్థశాస్త్ర అంశాలు ఈ తరహా ప్రశ్నకు సంబంధించినవిగా గుర్తించాలి. పాఠశాల స్థాయి పుస్తకాల్లోని సంబంధిత అంశాలపై పట్టు సాధించిన తరువాత ఇంకా అవసరమనుకుంటే గ్రాడ్యుయేషన్‌ స్థాయి పుస్తకాలు చదవొచ్చు.

* జనరల్‌ స్టడీస్‌లోని కొన్ని విభాగాలను డిగ్రీ స్థాయిలోనే చదవాల్సి ఉంటుంది. ప్రధానంగా తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు గానీ, విశ్వవిద్యాలయాల డిగ్రీ పుస్తకాలు గానీ చదవొచ్చు. భారత రాజ్యాంగ వ్యవస్థ, పర్యావరణ అంశాలు, అర్థ శాస్త్రంలోని కొన్ని టాపిక్స్‌, భారత స్వాతంత్య్రోద్యమం, ప్రాచీన భారతదేశ చరిత్ర, శాస్త్ర సాంకేతిక అంశాలు... మొదలైనవి డిగ్రీ స్థాయిలో చదవాల్సి ఉంటుంది.

* రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ ప్రశ్నలస్థాయి పరీక్ష స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. దిగువ స్థాయి ఉద్యోగాల పరీక్షల్లో సాధారణ స్థాయి ప్రశ్నలుంటాయి. ఒక ప్రత్యేక సబ్జెక్టుకు సంబంధం ఉన్న పరీక్షలోని జనరల్‌ స్టడీస్‌లో కూడా రీజనింగ్‌ ప్రశ్నలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల్లో సాధారణ స్థాయిలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ ఎక్కువ సందర్భాల్లో క్లిష్టత స్థాయి ఎక్కువ ఉన్న ప్రశ్నలు అడిగారు. అందువల్ల ఈ విభాగాన్ని ప్రిపేర్‌ అయ్యేటప్పుడు మొదటి నుంచి కొద్దిగా కఠినత్వం ఎక్కువగా ఉన్న ప్రశ్నలు సాధించేలా చూసుకోవాలి.

* జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఆధారం చేసుకుంటూ కరెంట్‌ అఫైర్స్‌ (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక అర్ధ గంట సమయాన్ని కేటాయిస్తూ వివిధ జాతీయ, అంతర్జాతీయ విషయాలపై దృష్టి పెట్టాలి. బిట్ల రూపంలో ఈ సబ్జెక్టును చదవకూడదు. విస్తృత అవగాహనతో చదివాక బిట్ల రూపంలో సాధన చేస్తే ఎక్కువ ఉపయోగం. పరీక్ష సమయానికి కనీసం నాలుగు నెలల ముందు జరిగిన వివిధ వ్యవహారాలను ప్రశ్నల రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో జరిగిన వివిధ విషయాలపె ఎక్కువ దృష్టి పెట్టాలి. పరీక్ష సమయానికి నాలుగు నుంచి ఆరు నెలల వెనుక కాలానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయా విషయాలపై స్థూల అవగాహన ఉండాలి. పరీక్ష తేదీకి ఆరు నెలల ముందు నుంచి కరెంట్‌ అఫైర్స్‌పై దృష్టి పెట్టినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు.

* జనరల్‌ స్టడీస్‌లోని కొన్ని విభాగాలు కరెంట్‌ అఫైర్స్‌తో ముడిపడి ఉంటాయి ఆ విభాగాల్లోని ప్రశ్నలకు జవాబులను కరెంట్‌ అఫైర్స్‌తో అనుసంధానించి చదవాలి. ఇండియన్‌ ఎకానమీలో భారత ఆర్దిక సర్వే 2021-22, బడ్జెట్‌ 2022-23 లోని వివిధ గణాంకాలు, భావనలను ఆర్థిక వ్యవస్థ సిలబస్‌లోని వివిధ అంశాలతో ముడి పెట్టుకోవాలి. అదే విధంగా భారత రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన సవరణలు సుప్రీంకోర్టు తీర్పులు, కొత్తగా చేర్చిన అధికరణాలు, షెడ్యూళ్లకు ప్రాధాన్యం ఉంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని అనేక విషయాలపై అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకుని అప్‌డేట్‌ నాలెడ్జి పెంచుకోవాలి.

* గ్రూప్‌-1 పరీక్ష రాసే అభ్యర్థులు స్క్రీనింగ్‌ పరీక్షలో, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి ప్రిపేర్‌ అయ్యేటప్పుడే ప్రిలిమినరీ,  మెయిన్స్‌ ప్రశ్నల రూపాన్ని అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ పట్టు సాధించవచ్చు.

* జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లోని కొన్ని అంశాలు మిగతా పేపర్స్‌లో విస్తృత మార్కుల కింద ఇచ్చారు. అందుకని గ్రూప్‌-2 రాస్తున్న అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌లో అంతర్భాగంగా కాకుండా వాటిని ప్రత్యేకంగా చదివితే ప్రయోజనం ఎక్కువ.

కురుక్షేత్ర, యోజన, న్యూ ఇండియా సమాచారం, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో వెబ్‌సైట్‌ మొదలైన వనరుల పఠనం ద్వారా జనరల్‌ స్టడీస్‌ లోని వివిధ అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. మార్కులను కూడా గణనీయంగా పెంచుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వ వనరులన్నీ సమర్థంగా వినియోగించుకునే మెలకువను జనరల్‌ స్టడీస్‌లో కూడా వినియోగిస్తే ఉద్యోగాలు సులభంగా పొందే అవకాశం ఉంటుంది.


ఏది జీకే?  ఏది కరెంట్‌ అఫైర్స్‌?

కొన్ని పోటీ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌లో అంతర్భాగంగా జనరల్‌ నాలెడ్జ్‌ (జీకే) కూడా ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు, సంఘటనలు, ప్రపంచంలో గుర్తింపు పొందిన ప్రత్యేక ప్రదేశాలు, వస్తువులు, జీవులు మొదలైనవి జీకే కింద పరిగణనలోకి తీసుకుంటారు. మనోరమ ఇయర్‌ బుక్‌ లాంటి పుస్తకాలు చదవడం వల్ల జీకేలోని విషయాలపై అవగాహన వస్తుంది.

‘భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించారు?’ అనేది జనరల్‌ నాలెడ్జ్‌.
‘ఈ సంవత్సరం భారతరత్న అవార్డును ఎవరికి ఇచ్చారు?’ అనేది కరెంట్‌ అఫైర్స్‌.  
‘ప్రపంచంలోని 7 వింతలూ’.. జనరల్‌ నాలెడ్జ్‌. ‘ఇటీవల పర్యావరణ కాలుష్యం కారణంగా ఏ ప్రపంచ వింత ఉనికిని కోల్పోతోంది?’
 
- ఇది వర్తమానాంశం.

వివిధ విషయాలను చదివేటప్పుడు మౌలిక అంశాలను జనరల్‌ నాలెడ్జ్‌ కింద చదివి, తాజా పరిణామాలను కరెంట్‌ అఫైర్స్‌ కింద చదువుతూ అనుసంధానం చేసుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని