పోలీస్‌ కొలువు సాధించాలంటే...

తెలంగాణ ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఇతర తత్సమాన క్యాటగిరీల్లో మొత్తం 17 వేలకు పైగా పోస్టులు భర్తీచేస్తామని ఇటీవల ప్రకటించింది. జిల్లాలు, స్థానికత, రోస్టర్‌ విధాన ప్రక్రియను

Published : 05 Apr 2022 00:51 IST

తెలంగాణ ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఇతర తత్సమాన క్యాటగిరీల్లో మొత్తం 17 వేలకు పైగా పోస్టులు భర్తీచేస్తామని ఇటీవల ప్రకటించింది. జిల్లాలు, స్థానికత, రోస్టర్‌ విధాన ప్రక్రియను పూర్తిచేసి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యూనిఫాం పోస్టులకు మేధాశక్తితోపాటు శారీరక సామర్థ్యం కీలకం. ఇదే చివరి అవకాశంగా భావించి అభ్యర్థులు సన్నద్ధతను ప్రణాళికతో పూర్తిచేస్తే విజయం సాధించవచ్చు.

పోలీస్‌ ఉద్యోగాల ప్రకటన, పరీక్షల నిర్వహణ, నియామకాలు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో జరుగుతాయి.

సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత ఉండాలి. ఏజెన్సీ అభ్యర్థులకు అర్హతలో సడలింపులుంటాయి. వయసు 21- 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఫైర్‌ సర్వీస్‌, తదితర పోస్టులకు 18-30 ఏళ్లు ఉండొచ్చు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ రెండు పోస్టులకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఆర్టీసీలో సర్వీసు ఉన్నవారికి అయిదేళ్లు, ఎన్‌సీసీ, ఎక్స్‌సర్వీస్‌ అంటే.. ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ వారికి మూడేళ్లు, సెన్సెస్‌లో పనిచేసినవారికి మూడేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

సబ్ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌, తత్సమాన పోస్టులకు మూడు దశల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ముందుగా ప్రాథమిక/ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు శారీరక దార్ఢ్య పరీక్ష ఉంటుంది. అనంతరం తుది పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీరికి తర్వాతి దశ అంటే శారీరక దార్ఢ్య పరీక్షకు అనుమతిస్తారు.

కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 200 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ఇందులోని అంశాలు...

1. అరిథ్‌మెటిక్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ 2. జనరల్‌ సైన్స్‌ - సమకాలీన అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికత 3. అంతర్జాతీయ, జాతీయ ప్రాముఖ్యం ఉన్న సమకాలీన సంఘటనలు 4. భారత జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలు 5. భారతదేశ భూగోళశాస్త్రం 6. జనరల్‌ ఇంగ్లిష్‌ 7. ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ 8. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ

ఎస్‌ఐ ప్రాథమిక పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌ రెండు భాగాల్లో ఉంటుంది.

ఎ) అరిథ్‌మెటిక్‌ అండ్‌ టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ ఆబ్జెక్టివ్‌ టైపు 100 మార్కులు.

అరిథ్‌మెటిక్‌: ఇందులో నంబర్‌ సిస్టమ్‌, సింపుల్‌, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, రేషియో ప్రపోర్షన్‌, యావరేజ్‌, పర్సంటేజ్‌, ప్రాఫిట్‌-లాస్‌, టైమ్‌వర్క్‌, క్లాక్‌, క్యాలెండర్‌, పార్టనర్‌షిప్‌, మెన్సురేషన్స్‌

రీజనింగ్‌: వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌, ఎనాలజీ, సిమిలారిటీ అండ్‌ డిఫరెన్స్‌, స్పాటియల్‌ విజువలైజేషన్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, ఎనాలిసిస్‌, జడ్జిమెంట్‌, డెసిషన్‌ మేకింగ్‌, విజువల్‌ మెమరీ మొదలైనవి.
బి) జనరల్‌ స్టడీస్‌లో 100 మార్కులకు 100 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ఇందులో-

జనరల్‌సైన్స్‌ అండ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అంతర్జాతీయ, జాతీయ సమకాలీన అంశాలు

భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం

భారతదేశ భూగోళశాస్త్రం

ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ


కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష

కానిస్టేబుల్‌ తుది పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. అర్హత సాధించడానికి ఓసీలైతే 40 శాతం, బీసీలు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 30 శాతం మార్కులు పొందాలి. జనరల్‌ ఇంగ్లిష్‌, అరిథ్‌మెటిక్‌ అండ్‌ రీజనింగ్‌, భారతదేశ చరిత్ర- జాతీయోద్యమం, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, భారతదేశ భూగోళశాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, నైతికత- విలువలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణపై ప్రశ్నలుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని