‘డిజిటల్‌ సొసైటీ’లో ఎమ్మెస్సీ

నేటి మనిషి జీవితమంతా టెక్నాలజీనే! అవసరానికని తెచ్చుకున్న ఈ వెసులుబాటు మనల్ని అనూహ్యంగా ప్రభావితం చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో మనిషి వేస్తున్న ఈ డిజిటల్‌ అడుగులు...

Published : 05 Apr 2022 00:54 IST

నేటి మనిషి జీవితమంతా టెక్నాలజీనే! అవసరానికని తెచ్చుకున్న ఈ వెసులుబాటు మనల్ని అనూహ్యంగా ప్రభావితం చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో మనిషి వేస్తున్న ఈ డిజిటల్‌ అడుగులు ఎటు వెళ్తున్నాయి? ఓ సరికొత్త సమాజాన్ని ఎలా సృష్టిస్తున్నాయి? భావితరాలపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది?... వీటికి సమాధానంగా పుట్టుకొచ్చేందే ‘డిజిటల్‌ సొసైటీ’ కోర్సు.

మారుతున్న పరిస్థితుల దృష్ట్యా గత ఐదారేళ్లుగా దీన్ని అధ్యయనం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ట్రిపుల్‌ఐటీ బెంగళూరు ‘ఎమ్మెస్సీ - డిజిటల్‌ సొసైటీ’ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలు...
రెండేళ్ల ఈ ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సోషల్‌ సైన్సెస్‌ల కలయిక. విద్య, వైద్యం, నిర్మాణం, పరిపాలన వంటి రంగాల్లో డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులను తయారుచేయడమే దీని ప్రధాన లక్ష్యం. డిజైనింగ్‌ నైపుణ్యాలూ నేర్పిస్తారు. సమాజానికి ఉపయోగపడే టెక్నాలజీని డిజైన్‌ చేయడం, మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేయడంపై ఆసక్తి ఉన్న నవతరానికి ఈ కోర్సు చక్కగా నప్పుతుంది.

ఎలా ఉంటుంది: మొత్తం నాలుగు సెమిస్టర్లు. మొదటి మూడు సెమిస్టర్లలో కోర్‌ సబ్జెక్టులు, ఎలక్టివ్స్‌ నేర్చుకుంటారు. చివరి సెమిస్టర్‌లో థీసిస్‌ లేదా ఇంటర్నషిప్‌ చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగావకాశాలు..
యూఎక్స్‌ రిసెర్చర్‌, యూఎక్స్‌ డిజైనర్‌, ప్రొడక్ట్‌ మేనేజర్‌, ప్రొడక్ట్‌ అనలిస్ట్‌, డేటా అనలిస్ట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, పాలసీ రీసెర్చర్‌, రీసెర్చ్‌ కన్సల్టెంట్‌లుగా అవకాశాలుంటాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, డైలీహంట్‌, ఎవర్‌వెల్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో చేరొచ్చు.

స్పెషలైజేషన్లు..
1. హ్యూమన్‌ సెంటర్డ్‌ డిజిటల్‌ డిజైన్‌
2. డేటా ఇంటెన్సివ్‌ డిజిటల్‌ డిజైన్‌
3. రిసెర్చ్‌ అండ్‌ పాలసీ స్టడీస్‌

ఫీజు: సెమిస్టర్‌కు రూ.1,92,000/-

ఎవరు అర్హులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. క్యాట్‌ 2021/ సీడ్‌ 2022/ సీయూసెట్‌ 2022/ టిస్‌ నెట్‌ 2022లో తగిన స్కోర్‌ ఉన్నవారికి అర్హత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతావారు ప్రవేశపరీక్ష రాయాలి. ప్రవేశానికి పది, ఇంటర్‌, డిగ్రీ మార్కులనూ పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రవేశపరీక్ష: మొత్తం 90 నిమిషాల వ్యవధి. న్యూమరికల్‌ ఎబిలిటీ (20 మార్కులు), అనలైటికల్‌ ఎబిలిటీ (20), డిజైన్‌ అవేర్‌నెస్‌ (20) మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ఐటీ, సోషల్‌ అవేర్‌నెస్‌పై ఒక వ్యాసరూప ప్రశ్న ఉంటుంది. 700 పదాలకు మించని జవాబు రాయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని