అవుతారా.. కానిస్టేబుల్‌?

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన పోలీస్‌ ఉద్యోగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులే అత్యధికం. సుమారు 16 వేల పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామకం జరగబోతోంది. పట్టుదల, పక్కా ప్రణాళికలకు కృషి జోడిస్తే ప్రిలిమ్స్‌లో సులభంగా అర్హత పొందవచ్చు...

Updated : 14 Apr 2022 18:45 IST

ప్రిలిమ్స్‌ ప్రణాళిక 

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన పోలీస్‌ ఉద్యోగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులే అత్యధికం. సుమారు 16 వేల పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామకం జరగబోతోంది. పట్టుదల, పక్కా ప్రణాళికలకు కృషి జోడిస్తే ప్రిలిమ్స్‌లో సులభంగా అర్హత పొందవచ్చు. తద్వారా కొలువు సాధించేందుకు ముందడుగు వేయవచ్చు! 

కానిస్టేబుల్‌ పోస్టులకు విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయినందున విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలి. దీంతో శారీరక సామర్థ్య, తుది పరీక్షలకు సులభంగా మార్గాన్ని వేసుకోవచ్చు. పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలో 200 మార్కులకు 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. దీనికి 180 నిమిషాల సమయం ఉంటుంది.

మొత్తం 200 మార్కుల్లో ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 30 శాతం మార్కులు సాధిస్తే ప్రిలిమ్స్‌లో అర్హత పొందొచ్చు. అంటే ఓసీ అభ్యర్థులు 80 మార్కులు, బీసీలు 70 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించవలసి ఉంటుంది.

రిఫరెన్స్‌ పుస్తకాలు

6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు

ఇంటర్మీడియట్‌ తెలుగు అకాడమీ పుస్తకాలు

ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలు

జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు


ఈ నాలుగు అంశాలే కీలకం

1  శాస్త్ర సాంకేతిక, సమకాలీన అంశాలు: ప్రిలిమ్స్‌ పరీక్షలో సమకాలీన, శాస్త్ర సాంకేతిక, భౌతిక, జీవశాస్త్ర అంశాలది ప్రధాన పాత్ర. ఇటీవల అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో వచ్చిన పరిణామాలు, మార్పులపై దృష్టి సారించాలి. కరోనా వైరస్, దాని వేరియంట్స్‌పై దృష్టి సారిస్తూ అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు, సమావేశాలు, సదస్సులు, అవార్డులు, ఉపగ్రహ ప్రయోగాలు, సాధించిన విజయాలు, వైఫల్యాలు, క్రీడలు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, వాతావరణ మార్పులు.. మొదలైన అంశాలపై దృష్టి పెట్టాలి. భౌతిక, జీవశాస్త్రాల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలపై సమగ్రమైన అవగాహన ఉండాలి. జీవశాస్త్రం, దాని జన్యువులు, రచయితలు, శాస్త్రీయ నామాలు, భౌతికాంశాలైన కాంతి, ధ్వని, మూలకాలు మొదలైనవాటిపై దృష్టి సారిస్తే సులభంగా అధిక మార్కులపై పట్టు సాధించవచ్చు. ఇందులో 40-45 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. 

2  జనరల్‌ ఇంగ్లిష్‌: ఇది ప్రిలిమ్స్‌లో కీలకమైన అంశం. గ్రామీణ నేపథ్యంతో ప్రిపేరవుతున్న విద్యార్థులను కొంచెం ఆందోళనకు గురిచేసే అంశంగా భావించవచ్చు. ఇందులో అధిక మార్కులను సాధించడం కోసం 10వ తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి  వర్బ్స్,  మిస్సింగ్‌ వర్డ్స్, టెన్సెస్, ఆర్టికల్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, వర్డ్‌ ఫార్మేషన్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, రీప్లేస్‌మెంట్, రీ అరేంజ్‌మెంట్, పేరా జంబుల్స్‌పై అవగాహన ఉంటే అధిక మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ భాగం నుంచి 30-35 మార్కులు వచ్చే అవకాశం ఉంది. 

3  చరిత్ర, తెలంగాణ ఉద్యమం, అవతరణ: 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ద్వారా తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీస్‌ కానిస్టేబుల్, వివిధ పోటీ పరీక్షల్లో చరిత్రతోపాటు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అవతరణపై ప్రత్యేక దృష్టి సారించి అధిక సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రాచీన, మధ్య, ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమంతోపాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి 40-45 ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ప్రతి అభ్యర్థీ తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనుల నుంచి కాకతీయులు, 1948-1969 దశ, 1970-2001 దశ, 2001 తర్వాత జరిగిన పరిణామాలపై అంటే సంస్కృతి, సామాజిక పరిస్థితులు, భాష, యాస, ఆట-పాట మొదలైన అంశాలపై సమగ్రమైన అవగాహన పెంచుకోవాలి. ఈ అంశాలు పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ అర్హత సాధించడంలో ప్రధానం. 

4  అరిథ్‌మెటిక్, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ: పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో భాగంగా అరిథ్‌మెటిక్‌- రీజనింగ్‌ అతి ముఖ్యమైన అంశం. గత కానిస్టేబుల్‌ పరీక్షలను పరిశీలిస్తే.. ఇందులో మొత్తం 200 మార్కులకు సగటున 45-50 మార్కులు/ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రశ్నలను పదో తరగతి స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివితే సులభంగా మార్కులను సాధించవచ్చు. ఇందులో ప్రధానంగా రేషియో, ప్రపోర్షన్స్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, ఏవరేజెస్, టైమ్‌-డిస్టెన్స్, వర్క్స్, ప్రాఫిట్‌-లాస్, అనాలజీ, కోడింగ్‌- డీకోడింగ్, శ్రేణులు, పోలికలు, భిన్న పరీక్షలు, రక్త సంబంధాలు, దిశలు, క్యాలండర్, గడియారాలు మొదలైన అంశాలపై ప్రిపేర్‌ అవ్వాలి. 

ఈ నాలుగు అంశాలతోపాటు ప్రతి విద్యార్థీ ఆర్థిక, రాజకీయ, భౌగోళికాంశాలపై పట్టు సాధిస్తే గరిష్ఠ మార్కులను పొందొచ్చు. ఈ అంశాల నుంచి 50-55 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అత్యధికంగా ప్రపంచం, భారతదేశ, తెలంగాణ నైసర్గిక స్వరూపాలు, నదులు, ప్రాజెక్టులు, అడవులు, జీవవైవిధ్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, ప్రణాళికలు, బ్యాంకులు, ద్రవ్యోల్బణం, నోట్ల రద్దు, ప్రాథమిక హక్కులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై అవగాహన అవసరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని