షిప్పింగ్‌ కోర్సుల్లో చేరతారా?

షిప్పింగ్‌లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీని నెలకొల్పింది. ముంబై, కోల్‌కతా, విశాఖ పట్నం, కొచిల్లో క్యాంపస్‌లు ఏర్పాటు   చేశారు. వీటికి దేశవ్యాప్తంగా 17 అనుబంధ కళాశాలలూ ఉన్నాయి. ఈ సంస్థల్లో సముద్రయానానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు. కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కెప్టెన్‌, ఇంజినీర్‌, షిప్‌ బిల్డర్‌, డిజైనర్‌, పోర్ట్‌ మేనేజర్‌...

Updated : 19 Apr 2022 05:42 IST

షిప్పింగ్‌లో సుశిక్షితులను అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీని నెలకొల్పింది. ముంబై, కోల్‌కతా, విశాఖ పట్నం, కొచిల్లో క్యాంపస్‌లు ఏర్పాటు   చేశారు. వీటికి దేశవ్యాప్తంగా 17 అనుబంధ కళాశాలలూ ఉన్నాయి. ఈ సంస్థల్లో సముద్రయానానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు. కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కెప్టెన్‌, ఇంజినీర్‌, షిప్‌ బిల్డర్‌, డిజైనర్‌, పోర్ట్‌ మేనేజర్‌, లాజిస్టిక్స్‌ ఎక్స్‌పర్ట్‌ మొదలైన ఉద్యోగాలు దక్కుతాయి. ఇటీవలే ఐఎంయూ సెట్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు...

కష్టపడాలనే స్వభావం, సముద్రయానంపై ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ మారిటైమ్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ సంస్థలు అందించే కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.  

నదేశంలో 12 మేజర్‌, 200కు పైగా నాన్‌ మేజర్‌ పోర్టులున్నాయి. దేశం వెంబడి సుమారు 7500 కి.మీ. తీర రేఖ ఉంది. దేశ ఆర్థికాభివృద్ధిలో సముద్ర రవాణా కీలక పాత్ర వహిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా నౌకాయానానికి ప్రాధాన్యం పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో భారీస్థాయిలో సామగ్రిని జల మార్గంలో ఖండాలు, దేశాలు దాటిస్తున్నారు. ఇందులో నౌకలు, నిపుణుల పాత్రే కీలకం. ఈ విభాగంలో సేవలు అందిస్తున్నవారు ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు.

ఏ కోర్సులు?

అండర్‌ గ్రాడ్యుయేట్‌
బీటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌
బీబీఏ: లాజిస్టిక్స్‌, రిటైలింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌
బీఎస్సీ: నాటికల్‌ సైన్స్‌, షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌  
డిప్లొమా: నాటికల్‌ సైన్స్‌
అర్హత: బీఎస్సీ, బీటెక్‌, డిప్లొమా కోర్సులకు ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూప్‌ ఉత్తీర్ణులు అర్హులు. అలాగే పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. బీబీఏ కోర్సుకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా అర్హులే.  

పీజీ కోర్సులు

ఎంటెక్‌: మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, డ్రెడ్జింగ్‌ అండ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్‌
ఎంబీఏ: పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌
అర్హత: ఎంటెక్‌ కోర్సులకు సంబంధిత లేదా అనుబంధ బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీటెక్‌ ఉత్తీర్ణత. ఎంబీఏ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
పీజీ డిప్లొమా: మెరైన్‌ ఇంజినీరింగ్‌
అర్హత: బీఈ/బీటెక్‌ 50 శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ ఉత్తీర్ణత.


పరీక్ష ఇలా...

యూజీ కోర్సులకు ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 10+2 స్థాయి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏ కోర్సులకు 120 ప్రశ్నలుంటాయి. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

ఎంటెక్‌ కోర్సుల ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. లాజికల్‌ రీజనింగ్‌, మ్యాథ్స్‌తోపాటు మెకానికల్‌ / నేవల్‌ ఆర్కిటెక్చర్‌ / మెరైన్‌ / సివిల్‌ వీటిలో ఏదో ఒక విభాగం నుంచి అభ్యర్థి జవాబులు రాయాలి. అన్ని పరీక్షలకూ ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పు సమాధానాలకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. బీఎస్సీ షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌, బీబీఏ లాజిస్టిక్స్‌, రిటైలింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌ కోర్సుల్లోకి పరీక్ష అవసరం లేకుండా ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో నేరుగా తీసుకుంటారు.

ఇవేకాకుండా పీహెచ్‌డీ, ఎంఎస్‌ రిసెర్చ్‌, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులు సైతం మారిటైమ్‌ యూనివర్సిటీ అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి 3 గంటల వ్యవధితో రెండు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌-1లో 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిని రెండు గంటల్లో పూర్తిచేయాలి. పార్ట్‌-2 గంట వ్యవధితో ఎస్సే ఉంటుంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేక ప్రకటన వెలువడుతుంది. డిసెంబరులో పరీక్ష నిర్వహిస్తారు.  

దరఖాస్తులకు చివరి తేదీ: మే 16

పరీక్ష తేదీ: మే 29

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.

వెబ్‌సైట్‌: www.imu.edu.in 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని