Career Guidance:డిగ్రీతో కమాండెంట్‌ కొలువు

యువత మెచ్చే వాటిలో యూనిఫారం ఉద్యోగాలు ముందుంటాయి. అందులోనూ కేంద్ర సర్వీసుల్లో కొలువంటే మరింత ప్రత్యేకం. డిగ్రీ అర్హతతోనే మేటి ఉద్యోగంలో చేరిపోవచ్చు. సాయుధ దళాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి

Updated : 28 Apr 2022 05:58 IST

యువత మెచ్చే వాటిలో యూనిఫారం ఉద్యోగాలు ముందుంటాయి. అందులోనూ కేంద్ర సర్వీసుల్లో కొలువంటే మరింత ప్రత్యేకం. డిగ్రీ అర్హతతోనే మేటి ఉద్యోగంలో చేరిపోవచ్చు. సాయుధ దళాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. పరీక్ష, ఫిజికల్‌ టెస్టు, ముఖాముఖిలో ప్రతిభ చూపినవారిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. వీరు లెవెల్‌-10 హోదాతో ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. 

దేశ రక్షణ, భద్రతపై ఆసక్తి, యూనిఫారం ఉద్యోగాలపై ప్రత్యేక అభిలాష ఉన్నవారు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సీఏపీఎఫ్‌)ల్లో అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ (ఏసీ) పోస్టులకు ప్రయత్నించవచ్చు. ఎంపికైనవారు అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా సాయుధ బలగాలు..బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సు (సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్సు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)లో విధులు నిర్వర్తిస్తారు. వీరు గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ హోదా పొందుతారు. సివిల్స్‌తో ఐపీఎస్‌కు ఎంపికైనవారితో సమాన స్థాయి ఉన్న పోస్టులివి. అందువల్ల పాతికేళ్లలోపు వయసున్న పట్టభద్రులు పోటీపడవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది.  

ఫిజికల్‌ స్టాండర్డ్‌/ఎఫిషియన్సీ.. 

పురుషులైతే కనీసం 165 సెం.మీ. ఎత్తు, 50 కి.గ్రా. బరువు, 81 సెం.మీ.ఛాతీ విస్తీర్ణం ఉండాలి. ఇది ఊపిరి పీల్చిన తర్వాత 5 సెం.మీ.పెరగాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు, 46 కి.గ్రా. బరువు తప్పనిసరి. వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్‌ జంప్‌లో పురుషులు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు దూరం దూకాలి. షాట్‌పుట్‌లో 7.26 కి.గ్రా. దిమ్మను పురుషులు 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు షాట్‌పుట్‌ లేదు.

పరీక్ష ఇలా..

రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో మొదటి పేపర్‌కు 250 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటలిజెన్స్‌ అంశాల నుంచి 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. 

పేపర్‌ 2 మొత్తం 200 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌ 1లో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మూల్యాంకనం చేస్తారు. పేపర్‌ 2లో కనీసం 25 శాతం అంటే 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఇలా అర్హత పొందినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం కొంతమందిని ఎంపికచేసి, ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. 

ఏ అంశాల్లో ప్రశ్నలు?

పేపర్‌ 1: ఇందులో ఆరు అంశాల్లో అభ్యర్థి సమర్థతను పరీక్షిస్తారు. మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (న్యూమరికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) ప్రశ్నలు వస్తాయి. జనరల్‌ సైన్స్‌లో దైనందిన జీవితంతో ముడిపడే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. వర్తమాన సంఘటనల విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదువుకోవాలి. ఇందులో భాగంగా నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలనా విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ...మొదలైనవాటికి ప్రాధాన్యం ఉంటుంది. మరో విభాగం ఇండియన్‌ పాలిటీ అండ్‌ ఎకానమీలో దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు; మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైనవాటిపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర విభాగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. జాతీయవాదం, స్వాతంత్య్రోద్యమం సంఘటలకు సంబంధించిన ప్రశ్నలూ అడుగుతారు. చివరిదైన జాగ్రఫీలో భౌతిక,
సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యం ఉంటుంది. 

పేపర్‌ 2: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌ ఎలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లిష్‌ లేదా హిందీ మాధ్యమంలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులకు సంబంధించిన సంఘటనలు, ఎనలిటికల్‌ ఎబిలిటీ మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌ బిలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్, ప్రెసీ, లాంగ్వేజ్‌ స్కిల్స్‌ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి మొత్తం ఆంగ్లంలోనే జవాబులు రాయాలి.

ఇంటర్వ్యూ: ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే ముఖాముఖికి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 150 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

330తో మెరిసిపోవచ్చు..

ఈ పరీక్ష మరీ అంత కష్టంగా ఉండదు. అలాగని తేలిక కూడా కాదు. గత నియామకాలను పరిశీలిస్తే.. పరీక్ష, ఇంటర్వ్యూల్లో 600కు గానూ 330 మార్కులు సాధించిన జనరల్‌ అభ్యర్థులు ఏదో ఒక విభాగంలో అవకాశాన్ని పొందగలిగారు. రిజర్వేషన్లు ఉన్నవారు 300కు తగ్గకుండా స్కోర్‌ చేస్తే కొలువు దక్కుతుంది. అయితే ప్రశ్నపత్ర కఠినత్వం, పోస్టుల సంఖ్యను బట్టి సాధించాల్సిన మార్కులు మారతాయని గ్రహించాలి. 

ఇవి గమనించండి..

ఖాళీలు: మొత్తం 253.

విభాగాల వారీగా .. బీఎస్‌ఎఫ్‌ 66, సీఆర్‌పీఎఫ్‌ 29, సీఐఎస్‌ఎఫ్‌ 62, ఐటీబీపీ 14, ఎస్‌ఎస్‌బీ 82.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: ఆగస్టు 1, 2022 నాటికి కనిష్ఠం 20 ఏళ్లు; గరిష్ఠం 25 ఏళ్లు. ఆగస్టు 2, 1997 కంటే ముందు; ఆగస్టు 1, 2002 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

సన్నద్ధత..

పరీక్షలో విజయానికి ప్రాథమికాంశాలపై పట్టు తప్పనిసరి. అధ్యయనాన్ని అక్కడి నుంచే మొదలుపెట్టాలి. అందువల్ల హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌ అంశాలను ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతో పూర్తిచేసుకోవచ్చు. ఈ సబ్జెక్టుల్లో 8 నుంచి 12 తరగతుల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. 

సీఏపీఎఫ్‌(ఏసీ) పాత ప్రశ్నపత్రాలు యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. ఏయే అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, వాటి ప్రాధాన్యం, స్థాయి- ఇవన్నీ గమనించి అందుకు అనుగుణంగా సన్నద్ధతకు మెరుగులు దిద్దుకోవాలి. 

ఈ పరీక్షలో వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంది. వీటిలో ఎక్కువ మార్కులు పొందడానికి ఏదైనా దినపత్రికను అనుసరించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. గత ఏడాది ఆగస్టు నుంచి జరుగుతోన్న ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. అవార్డులు, నియామకాలు, నివేదికలు, రచనలు, సంఘటనలు, వార్తల్లో వ్యక్తులు, భద్రతపరమైన అంశాలను గుర్తుంచుకోవాలి. 

జనరల్‌ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్‌ పేపర్‌ పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. అందువల్ల రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. 

మెరుగ్గా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని చాలా ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థల నివేదికలు బాగా చదవాలి.

పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. వీటిలో సాధించిన స్కోరు గమనించి వెనుకబడిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

ఒకవైపు రాతపరీక్షకు సన్నద్ధమవుతూనే పరుగు, లాంగ్‌ జంప్, షాట్‌పుట్‌ల్లో అర్హత పొందడానికి సాధన ప్రారంభించాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 10 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి రూ. 200 పరీక్ష తేదీ: ఆగస్టు 7

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని