NET: బోధన రంగంలో..ఈ స్కోరు పాస్‌పోర్టు!

పీజీ స్థాయిలో చదువుకున్న కోర్సులో సమర్థతకు కొలమానంగా నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్‌) నిలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా లెక్చరర్‌షిప్‌లో అర్హత సాధించినవారు విద్యాసంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు

Updated : 11 May 2022 06:10 IST

పీజీ స్థాయిలో చదువుకున్న కోర్సులో సమర్థతకు కొలమానంగా నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్‌) నిలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా లెక్చరర్‌షిప్‌లో అర్హత సాధించినవారు విద్యాసంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు ఎంపికైనవారు ప్రతి నెలా స్టైపెండ్‌ పొందుతూ పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) తరఫున నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏడాదికి రెండు సార్లు నెట్‌ నిర్వహిస్తోంది. గత డిసెంబరులో జరగాల్సిన పరీక్ష కొవిడ్‌ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా జూన్‌ ప్రకటన వెలువడింది. గత డిసెంబరు, ఈ జూన్‌లకు సంబంధించి రెండు పరీక్షలూ కలిపి నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు మే 20లోగా దరఖాస్తు చేసుకోవచ్చు!

పీజీ పూర్తిచేసుకున్నవారూ, ప్రస్తుతం చివరి సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ నెట్‌ రాసుకోవచ్చు. పరీక్షను 82 సబ్జెక్టులు/విభాగాల్లో దేశవ్యాప్తంగా 541 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల్లో పరీక్షలు రాసేవారికి ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో వస్తాయి. నెట్‌లో అర్హత పొందినవారు తమ స్కోరును బోధన రంగంలో పాస్‌పోర్టులా ఉపయోగించుకోవచ్చు. ప్రైవేటు విద్యా సంస్థలు సైతం ఎక్కువ స్కోర్‌ సాధించినవారికి అధిక వేతనంతో ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి.  

పరీక్ష ఇలా...
మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో పేపర్‌ 1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు అడుగుతారు. వీటికి వంద మార్కులు. రెండో పేపర్‌ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో వంద ప్రశ్నలు అభ్యర్థి ఎంచుకున్న విభాగం/సబ్జెక్టు నుంచి వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు. మొత్తం పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్‌ 1, 2 మధ్య ఎలాంటి విరామం ఉండదు.


అర్హత పొందితే...

జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో నెగ్గితే దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో అసిన్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఆర్‌ఎఫ్‌ అర్హులు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్‌డీ) చేసుకోవచ్చు. వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెలా రూ.31,000 చెల్లిస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించనట్లయితే స్టైపెండ్‌లో 30 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ అదనంగా చెల్లిస్తారు. ప్రతి ఏటా కాంటింజెన్సీ గ్రాంటు ఇస్తారు ఇటీవల కాలంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్‌ స్కోర్‌తో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ హోదాతో లీగల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్‌ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, దివ్యాంగులకు 50 శాతం మార్కులు సరిపోతాయి. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్‌ఎఫ్‌ కోసం జూన్‌ 1, 2022 నాటికి 31 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపులు వర్తిస్తాయి..అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దరఖాస్తులకు వయసు నిబంధన లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: మే 20 సాయంత్రం 5 వరకు
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1100. ఓబీసీ(నాన్‌ క్రీమీ లేయర్‌), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.550; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ జండర్లకు రూ.275
పరీక్ష తేదీలు: వివరాలు తర్వాత ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో..అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో. ఆదిలాబాద్‌, అసిఫాబాద్‌, భూపాలపల్లి, గద్వాల్‌, హయత్‌నగర్‌, హైదరాబాద్‌, సికిందరాబాద్‌, జగిత్యాల, జనగామ, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌, నల్గొండ, నిజామాబాద్‌, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వరంగల్‌.  
వెబ్‌సైట్‌:
https://ugcnet.nta.nic.in/


సన్నద్ధత  

రుణాత్మక మార్కులు లేనందున తెలియని ప్రశ్నలకు పరీక్ష చివరిలో బాగా ఆలోచించి దేన్నైనా సమాధానం ఇవ్వవచ్చు.

* పేపర్‌ 1: ఇందులో 10 విభాగాలు ఉంటాయి. వీటిలో ఒక్కో విభాగం నుంచి 5 చొప్పున ప్రశ్నలు రావచ్చు. అభ్యర్థిలో టీచింగ్‌, రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ పరిశీలిస్తారు. రీజనింగ్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, డైవర్జెంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పాత ప్రశ్నపత్రాల అధ్యయనం ద్వారా ఈ పేపర్‌పై అవగాహన పొందవచ్చు. ఈ విభాగంలో ఎక్కువ మార్కుల కోసం టాటా మెక్‌గ్రాహిల్స్‌ లేదా మరేదైనా పుస్తకాన్ని బాగా చదువుకుంటే సరిపోతుంది.  
* పేపర్‌-2: ఇందులో మొత్తం సబ్జెక్టు ప్రశ్నలే ఉంటాయి. సంబంధిత సబ్జెక్టులో ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా వీటిని అడుగుతారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉన్నప్పటికీ ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివినవారే సమాధానాలు గుర్తించగలరు. అందువల్ల అభ్యర్థులు ముందుగా సంబంధిత సబ్జెక్టులో యూజీ పుస్తకాలు బాగా చదువుకోవాలి. ఆ తర్వాత పీజీ పుస్తకాలు సిలబస్‌ ప్రకారం అధ్యయనం చేయాలి. యూజీసీ వెబ్‌సైట్‌లో ఆయా సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలు పేర్కొన్నారు. దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. చాప్టర్లు లేదా టాపిక్‌ వారీ ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలు చదవాల్సి వస్తుంది. అయితే వీటిని పరిమితంగానే ఎంచుకుని బాగా అధ్యయనం చేయాలి. పరీక్షలో విజయానికి పాత ప్రశ్నపత్రాల అధ్యయనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల వాటిని సునిశితంగా పరిశీలించాలి. ఇలా చేయడం వల్ల ప్రశ్నల స్వభావం, అడిగే విధానంపై అవగాహన పెంచుకోవచ్చు. ఏ అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, అధ్యయనం ఏ తరహాలో ఉండాలో తెలుసుకోవచ్చు.
అధ్యయనం పూర్తయిన తర్వాత పరీక్షకు నెల రోజుల ముందు నుంచి మాక్‌ టెస్టులు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ చాప్టర్లు/విభాగాల్లో వెనుకబడుతున్నారో తెలుసుకుని వాటిని మరింత శ్రద్ధగా చదవాలి. ఇదే పద్ధతిని పది మాక్‌ పరీక్షలకు కొనసాగిస్తే అభ్యాసం సరైన దిశగా వెళ్తున్నట్లు భావించవచ్చు. పరీక్షలో విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని