CDSE: త్రివిధ దళాల్లోకి... సీడీఎస్‌ఈ మార్గం!

ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో లక్షణమైన ఉన్నతోద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో అవకాశం పొందవచ్ఛు యూపీఎస్‌సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌(సీడీఎస్‌ఈ) వీటికి దారిచూపుతుంది. ఇందులో మెరిసినవారు శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో ఎందులోనైనా లెవెల్‌-10 వేతనంతో సేవలు అందించవచ్ఛు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్ఛు ఇటీవలే సీడీఎస్‌ఈ 2022(2) ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం...

Updated : 24 May 2022 06:41 IST

ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో లక్షణమైన ఉన్నతోద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో అవకాశం పొందవచ్ఛు యూపీఎస్‌సీ నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌(సీడీఎస్‌ఈ) వీటికి దారిచూపుతుంది. ఇందులో మెరిసినవారు శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో ఎందులోనైనా లెవెల్‌-10 వేతనంతో సేవలు అందించవచ్ఛు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్ఛు ఇటీవలే సీడీఎస్‌ఈ 2022(2) ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం...

దేశ రక్షణలో భాగం కావాలనే లక్ష్యం, అత్యున్నత స్థాయిలో విధులు నిర్వహించాలనే తపన, యూనిఫాం పోస్టులపై ఆసక్తి ఉన్నవారు రాయాల్సిన వాటిలో సీడీఎస్‌ఈ ముఖ్యమైంది. దీన్ని ఏటా రెండుసార్లు యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. పరీక్షతోపాటు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఇందులో ప్రతిభ చూపినవారు ఆసక్తి, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఓటీఏల్లో లెవెల్‌-10 వేతనశ్రేణితో సేవలు అందించవచ్ఛు వీరు భవిష్యత్తులో ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌లకు చీఫ్‌ కావడానికీ అవకాశం ఉంది. పైలట్‌ లక్ష్యంగా ఉన్నవారు సీడీఎస్‌ఈతో తమ కల నెరవేర్చుకోచ్చు.

డిగ్రీ పూర్తిచేసుకున్న 24 ఏళ్లలోపువారు ఎవరైనా ఈ పరీక్షకు పోటీ పడవచ్ఛు క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నందువల్ల ఈ పరీక్షను లక్ష్యంగా చేసుకున్నవారు తప్పకుండా రెండు మూడు ప్రయత్నాల్లో విజయం సాధించవచ్ఛు గత నియామకాలను పరిశీలిస్తే 45 శాతం మార్కులు పొందినవారు ఏదో ఒక సర్వీస్‌కు ఎంపికవుతున్నారు.

పరీక్ష ఇలా...

ఒక్కో పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్‌లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకూ దానికి కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇంగ్లిష్‌ విభాగం మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్‌లోనూ కనీసం 20 మార్కులు పొందాలి. కేవలం ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ (ఓటీఏ) పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్‌ పేపర్‌ రాయనవసరం లేదు.

ఈ విభాగాల్లో ప్రశ్నలు..

* ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌: ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్‌మెటిక్‌ (నంబర్‌ సిస్టమ్‌, ఎలిమెంటరీ నంబర్‌ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ నుంచి వీటిని అడుగుతారు.

* ఇంగ్లిష్‌: అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ల నుంచి ప్రశ్నలు సంధిస్తారు.

* జనరల్‌ నాలెడ్జ్‌: ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి ముడిపడినవే ఉంటాయి. రోజువారీ పరిశీలనల ద్వారా చాలా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్ఛు వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్‌, టెక్నాలజీ అంశాల్లో తాజా మార్పులపై ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు.

నెగ్గాలంటే....

* మ్యాథ్స్‌కు సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అధ్యాయాల కోసం 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. గణితం నేపథ్యం ఉన్నవారు ఈ పేపర్‌ను సులువుగానే ఎదుర్కోవచ్ఛు ఆర్ట్స్‌ విద్యార్థులు ఈ విభాగంలో మెరుగైన మార్కులకు అదనపు సమయం కేటాయించడం తప్పనిసరి. వీరు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.

* జనరల్‌ నాలెడ్జ్‌ పేపర్‌లో.. భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు ఉపయోగపడతాయి. లూసెంట్‌ లేదా అరిహంత్‌ జీకే పుస్తకాల్లో ఏదైనా చదివితే సరిపోతుంది. సైన్స్‌ విభాగంలోని ప్రశ్నలకు ఎన్‌సీఈఆర్‌టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు చూసుకోవాలి.

* ఇంగ్లిష్‌ విభాగం ప్రశ్నలన్నీ హైస్కూల్‌ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8, 9, 10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలను బాగా చదువుకోవాలి.

* ప్రాథమిక స్థాయి సన్నద్ధత పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి వీటిని పొందవచ్ఛు వీటిని పరిశీలిస్తే..ఆయా విభాగాల్లో ప్రశ్నలు ఏ తరహాలో వస్తున్నాయి, చదవాల్సిన అంశాలు, సన్నద్ధత ఎలా ఉండాలో అర్థమవుతుంది.

* చివరలో వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. ప్రతి పరీక్ష అనంతరం స్కోర్‌ గమనించాలి. ఎక్కడ తప్పుచేస్తున్నారు, ఏ అంశాల్లో వెనుకబడ్డారో సరిచూసుకుని, వాటిని అధిక ప్రాధాన్యంతో చదవాలి.

* రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలు వదిలేయడమే మంచిది. ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలను ఆఖరులో ప్రయత్నించాలి.

ఇంటర్వ్యూ

ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కీలకం. పరీక్షతో సమానంగా ఈ విభాగానికీ 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఐదు రోజులపాటు కొనసాగే ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో అంకానికి అనుమతిస్తారు. స్టేజ్‌-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి విశ్లేషించమంటారు. దీనిద్వారా అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం, అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2లో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు పలు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్‌ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.


విద్యార్హత

మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్‌ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఏర్‌ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: జులై 1, 2023 నాటికి 20-24 ఏళ్లలోపు ఉండాలి. ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, నేవల్‌ అకాడెమీలకు జులై 2, 1999 కంటే ముందు; జులై 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఏర్‌ ఫోర్స్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1999 కంటే ముందు, జులై 1, 2003 తర్వాత జన్మించినవారు అనర్హులు. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ పోస్టులకు జులై 2, 1998 కంటే ముందు, జులై 1, 2004 తర్వాత జన్మించినవారు అనర్హులు.

మొత్తం ఖాళీలు: 339. విభాగాల వారీ ఐఎంఏ-100, ఐఎన్‌ఏ-22, ఏఎఫ్‌ఏ-32, ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్‌ నాన్‌ టెక్నికల్‌ -169, ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్‌ నాన్‌ టెక్నికల్‌ 16.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 7 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.

పరీక్ష తేదీ: సెప్టెంబరు 4

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి

వెబ్‌సైట్‌:  https://upsc.gov.in/


కటాఫ్‌ ఇలా...

2021(1): రాత పరీక్షలో 300కు గానూ ఐఎంఏ 145, ఐఎన్‌ఏ 136, ఏఎఫ్‌ఏ 158, ఓటీఏ 107 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ) 600కు ఐఎంఏ 268, ఐఎన్‌ఏ 260, ఏఎఫ్‌ఏ 281, ఓటీఏ మెన్‌ 189 ఓటీఏ ఉమెన్‌ 191 అవకాశం లభించింది.

2020(2): రాత పరీక్ష 300కు: ఐఎంఏ 139, ఐఎన్‌ఏ 134, ఏఎఫ్‌ఏ 152, ఓటీఏ 97 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ)600కి: ఐఎంఏ 263, ఐఎన్‌ఏ 257, ఏఎఫ్‌ఏ 279, ఓటీఏ మెన్‌ 179, ఓటీఏ ఉమెన్‌ 178 వరకు అవకాశం పొందారు.


శిక్షణ

అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్‌ ప్రకారం ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఓటీఏ వీటిలో ఏదో ఒక చోట అవకాశం పొందుతారు. ఏ విభాగంలో చేరినప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్‌ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్‌లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్‌ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఏర్‌ ఫోర్స్‌ అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలల పాటు పైలట్‌ శిక్షణ బీదర్‌, ఎలహంక, హాకీంపేటల్లో ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో 11 నెలలు శిక్షణలో పాల్గొంటారు. వీరు మద్రాస్‌ విశ్వవిద్యాలయం పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని అందుకోవచ్ఛు అనంతరం ఆసక్తి ఉంటే మరో ఏడాది కోర్సు పూర్తిచేసుకుని పీజీ పట్టా పొందవచ్చు.


ఉద్యోగంలో...

శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెప్టినెంట్‌, నేవీలో సబ్‌ లెప్టినెంట్‌, ఏర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో కెరియర్‌ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నప్పటికీ ఈ మూడూ సమాన హోదా (లెవెల్‌ 10) ఉన్న ఉద్యోగాలే. వీరికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలటరీ సర్వీస్‌ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్‌ అలవెన్సు అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రోత్సాహకాలు కలిపి మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. రెండేళ్ల సర్వీస్‌తో ఆర్మీలో కెప్టెన్‌, నేవీలో లెప్టినెంట్‌, ఏర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెప్టినెంట్‌ హోదాలు సొంతం చేసుకోవచ్ఛు ఆరేళ్లపాటు విధుల్లో కొనసాగితే మేజర్‌/ లెప్టినెంట్‌ కమాండర్‌/ స్క్వాడ్రన్‌ లీడర్‌ గుర్తింపు లభిస్తుంది. 13 ఏళ్ల సర్వీస్‌ ఉన్నవాళ్లు ఏర్‌ ఫోర్సులో వింగ్‌ కమాండర్‌ కావచ్ఛు అదే నేవీలో కమాండర్‌, ఆర్మీలో లెప్టినెంట్‌ కల్నల్‌ హోదా పొందవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని