దివ్యమైన అవకాశాలు!

దేశంలో చాలామంది చిన్నారులు, పెద్దలు వినికిడి లోపంతో, సరిగా మాట్లాడలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివారికి స్పీచ్‌, హియరింగ్‌ నిపుణుల సేవలు కీలకం. ఈ విభాగాల్లో రాణించడానికి ప్రత్యేకంగా కొన్ని కోర్సులు, సంస్థలు ఉన్నాయి.

Updated : 13 Jun 2022 01:08 IST

సుశిక్షితులను తయారుచేసే స్పీచ్‌, హియరింగ్‌ కోర్సులు

దేశంలో చాలామంది చిన్నారులు, పెద్దలు వినికిడి లోపంతో, సరిగా మాట్లాడలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివారికి స్పీచ్‌, హియరింగ్‌ నిపుణుల సేవలు కీలకం. ఈ విభాగాల్లో రాణించడానికి ప్రత్యేకంగా కొన్ని కోర్సులు, సంస్థలు ఉన్నాయి. వాటిలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌) ముఖ్యమైంది. ఇక్కడ డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో పలు కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు.

ఏఐఐఎస్‌హెచ్‌ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1966లో మైసూర్‌లో ఏర్పాటుచేశారు. దివ్యాంగులకు ముఖ్యంగా చెవుడు, మూగ సమస్యలతో బాధపడుతున్నవారికి నాణ్యమైన విద్య, సేవలు అందించడానికి సుశిక్షితులను తయారుచేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇక్కడి కోర్సుల్లో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్‌ అందిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు సంతృప్తికరమైన ఉపాధిని పొందవచ్ఛు ఎన్‌జీవోలు, ప్రత్యేక సేవల కేంద్రాలు, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సెంటర్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. సొంతంగానూ రాణించవచ్చు.


డిప్లొమా కోర్సులు

1. హియరింగ్‌ ఎయిడ్‌ అండ్‌ హియర్‌ మౌల్డ్‌ టెక్నాలజీ

సీట్ల సంఖ్య: 28

అర్హత: ఫిజిక్స్‌తో ఇంటర్‌ లేదా ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచ్‌ల్లో డిప్లొమా / ఐటీఐ లేదా డెంటల్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు సంబంధిత అర్హత పరీక్షలో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.

2. డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌

సీట్ల సంఖ్య: 28

అర్హత: ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 17 ఏళ్లు ఉండాలి.

3. డిప్లొమా ఇన్‌ హియరింగ్‌, లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌

సీట్ల సంఖ్య: ఈ కోర్సును ఏఐఐఎస్‌హెచ్‌తోపాటు 8 అనుబంధ సంస్థల్లో నిర్వహిస్తున్నారు. ఏఐఐఎస్‌హెచ్‌లో 30 ఇతర చోట్ల 28 చొప్పున ఉన్నాయి.

అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. వయసు జులై 1 నాటికి 21 ఏళ్లలోపు ఉండాలి.

పై కోర్సుల వ్యవధి ఏడాది. ఎంపికైనవారికి నెలకు రూ.250 చొప్పున పది నెలల పాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు.


బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు...

1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ)

సీట్లు: 80

అర్హత: ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఈ కోర్సులోకి ఎంపికైనవారికి మొదటి మూడేళ్లు సంవత్సరానికి 10 నెలల పాటు నెలకు రూ.800 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో భాగంగా నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు.

2. స్పెషల్‌ బీఎడ్‌

సీట్లు: 22

అర్హత: ఏదైనా డిగ్రీలో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత. అలాగే అభ్యర్థి వయసు జులై 1 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.

కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవారికి నెలకు రూ.400 చొప్పున ఏటా పది నెలల పాటు స్టైపెండ్‌ అందుతుంది.


మాస్టర్‌ డిగ్రీ కోర్సులు...

1. ఎమ్మెస్సీ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ

అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి రెండేళ్లు. 44 సీట్లు ఉన్నాయి. ఎంపికైనవారికి నెలకు రూ.1300 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు రెండేళ్లు చెల్లిస్తారు.

2.ఎమ్మెస్సీ ఆడియాలజీ

అర్హత: బీఎస్సీ (స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) / బీఏఎస్‌ఎల్‌పీ

కోర్సు వ్యవధి రెండేళ్లు. సీట్లు 44. ఎంపికైనవారికి నెలకు రూ.1300 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు రెండేళ్లు చెల్లిస్తారు.

3. స్పెషల్‌ ఎంఎడ్‌

అర్హత: బీఎడ్‌ లేదా స్పెషల్‌ బీఎడ్‌లో కనీసం 50 (ఎస్సీ, ఎస్టీలైతే 45) శాతం మార్కులతో ఉత్తీర్ణత. అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

22 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.650 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు రెండేళ్లు చెల్లిస్తారు.


పీహెచ్‌డీ...

స్పీచ్‌- లాంగ్వేజ్‌ పాథాలజీ, ఆడియాలజీ, స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, లింగ్విస్టిక్స్‌ అంశాల్లో పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారు వీటికి అర్హులు. ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.20,000 రెండో ఏడాది నెలకు రూ. 22,000 మూడో సంవత్సరం నెలకు రూ.25,000 చొప్పున స్టైపెండ్‌ అందిస్తారు. పోస్టు డాక్టొరల్‌ ఫెలోషిప్‌లో చేరినవారికి ప్రతి నెల రూ.35,000 చొప్పున చెల్లిస్తారు. పీహెచ్‌డీ వ్యవధి మొత్తం హెచ్‌ఆర్‌ఏ అందుతుంది. ఏటా కాంటింజెన్సీ ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15

పరీక్ష తేదీ: జులై 24

వెబ్‌సైట్‌: http://aiishmysore.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని