ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్లను ఇండియన్‌ ఆర్మీ ఏటా విడుదల చేస్తోంది. వీటికి మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేర్చుకుంటారు.

Updated : 12 Sep 2022 06:25 IST

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్లను ఇండియన్‌ ఆర్మీ ఏటా విడుదల చేస్తోంది. వీటికి మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేర్చుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇటీవల వెలువడిన ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ ప్రకటన పూర్తి వివరాలు చూద్దాం...

ఎన్‌సీసీలో చేరినవారిని ఆర్మీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పలు నియామక ప్రకటనల్లో కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్త్తోంది. అలాగే ఏడాదికి రెండుసార్లు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు.

ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్‌, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ, వేతనం ఇలా...
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విధానంలో ఎంపికైనవారికి ఏప్రిల్‌, 2023 నుంచి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు.

వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్‌ కమిషన్‌) కిందికి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. ఆ తర్వాత వీరు వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్‌, ఆరేళ్ల సేవలతో మేజర్‌, 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఎన్నో ప్రోత్సాహకాలు పొందవచ్చు.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ
మొత్తం ఖాళీలు: 55. (50 పురుషులకు, 5 మహిళలకు). ఈ రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు (పురుషులు 5, మహిళలు 1) యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఏప్రిల్‌ 1, 2023లోగా డిగ్రీ పూర్తిచేయాలి. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ అవసరం లేదు.
వయసు: జనవరి 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు: సెప్టెంబరు 15 మధ్యాహ్నం 3 వరకు.  
వెబ్‌సైట్‌:
http://www.joinindianarmy.nic.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని