జేఈఈ మెయిన్‌లో జయమ్ము నిశ్చయమ్ము!

జేఈఈ మెయిన్‌-2023 కోసం విద్యార్థులు కష్టపడి సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించటానికి ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!

Updated : 05 Jan 2023 18:07 IST

జేఈఈ మెయిన్‌-2023 కోసం విద్యార్థులు కష్టపడి సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించటానికి ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!

కరోనా ఉద్ధృతి సమయంలో విద్యార్థుల సౌలభ్యం కోసం జేఈఈ-మెయిన్‌ పరీక్షను నాలుగు దఫాలుగా నిర్వహించారు. ఈసారి రెండు దఫాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మొదటి విడత జనవరి 24 నుంచి 31 వరకు కాగా.. అనూహ్యంగా వచ్చే ఆటంకాలను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండో విడత ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు ఉంటుంది. ఆటంక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 13, 15 తేదీలను కూడా అందుబాటులో ఉంచారు.

ఈ పరీక్ష ప్రత్యేకతలు ఏంటి?

* జేఈఈ మెయిన్‌-2022 మొదటి విడతను జూన్‌ 23 నుంచి 29 వరకు, రెండో విడత జులై 25 నుంచి 30 వరకు నిర్వహించారు. దీంతో విద్యార్థుల సన్నద్ధతకు చాలా సమయం దొరికింది. దాంతోపాటు బోర్డ్‌ పరీక్షలు కూడా అయిపోయి ఉండటంతో విద్యార్థులకు కాస్తంత ఉపశమనంతోపాటు, పరీక్షలపై పూర్తిగా దృష్టి సారించడానికి అవకాశం దొరికింది. 

* మొదట వచ్చిన వదంతుల వల్ల జేఈఈ మెయిన్‌-2023 కూడా ఇంచుమించు అలాగే నిర్వహిస్తారని అనుకున్నారు. కానీ మళ్లీ 2017, 2018 నాటి పరిస్థితులను గుర్తుచేసేలా జరపనుండటం గమనార్హం. 

* ఒకరకంగా ఇది మంచిదనే చెప్పాలి. ఎందుకంటే ఆహ్లాదకరమైన ఒత్తిడి ఉన్నప్పుడే విద్యార్థుల్లో చైతన్యం వస్తుంది. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే విజయాన్ని సాధించవచ్చు. సెక్షన్‌-బి నుంచి ఏదైనా 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. సెక్షన్‌-ఎ నుంచి అన్ని ప్రశ్నలూ తప్పనిసరి. 

* ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం రాసిన ప్రశ్నకు 1 రుణాత్మక మార్కు ఉంటుంది. 

* మొత్తం మీద 75 ప్రశ్నలు, 300 మార్కులతో జేఈఈ మెయిన్‌-2023 నిర్వహిస్తారు. 

* సెక్షన్‌-బి లోనివి ‘సంఖ్యాత్మక విలువగల ప్రశ్నలు’ అన్న విషయం మరవకూడదు.


సన్నద్ధత ఎలా ఉండాలి? 

పటిష్ఠమైన ప్రణాళికతో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని టైమ్‌టేబుల్‌ను తయారుచేసుకోవాలి.

1. టైమ్‌టేబుల్‌ను విద్యార్థి తనకు అనువుగా ఉండేలా తయారుచేసుకోవాలి.

2. సబ్జెక్టుల మధ్య సమయాన్ని విభజించే బదులు ఒక రోజులో రెండు సబ్జెక్టులపై దృష్టి పెట్టండి.

3. ఏది, ఎప్పుడు, ఏం చదవాలని ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు.

4. రోజులో రెండు సబ్జెక్టులు మాత్రమే చదవడం వల్ల అందులోని భావాలను అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి మీద ఎక్కువ దృష్టి పెట్టటడం సాధ్యమవుతుంది. తద్వారా చదివే అంశాలపై పట్టు సాధించడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.

5. ప్రతి గంట సన్నద్ధతలో ఓ పది నిమిషాలు విరామం తీసుకోవచ్చు. ఈ సమయంలో కుటుంబసభ్యులతో సరదాగా గడపండి. అప్పుడు సెల్‌ఫోన్‌ మాత్రం వాడొద్దు.

6. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులను ఎక్కువగా సాధన చేయండి. వీటిని డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌ మీదే తీసుకోండి. ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్లలో రాయొద్దు.

7. మీరు పరిపూర్ణంగా పూర్తిచేసిన అంశాలు, అధ్యాయాలను మాత్రమే తిరిగి పునశ్చరణ చేయండి. కొత్త అంశాల జోలికి వెళ్లొద్దు.

8. సమీకరణాలు- సూత్రాలు లాంటి అంశాలపై దృష్టి పెట్టండి.

9. అన్నింటికన్నా ముందు జేఈఈ మెయిన్‌- 2019 నుంచి 2022 వరకూ నిర్వహించిన అన్ని ప్రశ్నపత్రాలను పరిపూర్ణంగా సాధన చేయండి. అంతేగాని వాటిని బట్టీపట్టొద్దు.

10. రోజులో కనీసం 3 గంటల సమయం సబ్జెక్టులకు ఇచ్చి, చివరి 3 గంటలు మాక్‌ టెస్టులు రాయండి. అందులో తప్పుగా సమాధానాలు గుర్తించినవాటికి సరైన విశ్లేషణ తీసుకోవాలి. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు అదే తప్పు పునరావృతం కాకుండా చూసుకోండి.

11. ‘ఎన్ని ప్రశ్నలు రాశామన్నది కాదు.. ఎన్ని కరెక్టుగా గుర్తించామన్నదే’ కీలకం అని మర్చిపోవద్దు.

12. ప్రశ్నలు పూర్తిగా చదివి అందులోని ముఖ్యమైన పదాలను, పదాల సరళిని గమనించి.. అనంతరం సమాధానం గుర్తిస్తే చిన్నచిన్న తప్పులను కట్టడి చేయొచ్చు.

13. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకునేవారికి విజయం తథ్యం. ఎందుకంటే ఏదో రూపేణా పరీక్ష సమయంలో ఎదురైన చేదు అనుభవాలతో భయపడకుండా, ధైర్యంగా ముందుకు వెళితే విజయం మీదే.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని