పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

Updated : 23 Jan 2023 06:38 IST

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌  విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఏటా ఉపకార వేతనాలు అందిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి ఇటీవలే ప్రకటన వెలువడింది!

ఓఎన్‌జీసీ ఏటా మొత్తం 2000 స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. వీటిలో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్‌ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతుంది. కోర్సు పూర్తయ్యేంతవరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

* ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్‌ కేటగిరీల్లో ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు

* అర్హత: ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైమ్‌ కోర్సు రెగ్యులర్‌ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌(బీఈ/బీటెక్‌), ఎంబీబీఎస్‌ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2021-2022 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ- జియాలజీ/ జియోఫిజిక్స్‌ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది.

* వయసు: జనవరి 1, 2021 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.

* ఎంపిక: ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సులకు ఇంటర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.

* స్కాలర్‌షిప్పు వ్యవధి: ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్లు; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.

కోర్సులకు ఎన్ని ఉపకార వేతనాలు?

ఇంజినీరింగ్‌: 494 (ఎస్సీ, ఎస్టీ), 300 ఓబీసీ, 300 జనరల్‌
ఎంబీబీఎస్‌: 90 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌
ఎంబీఏ: 146 (ఎస్సీ, ఎస్టీ), 50 ఓబీసీ, 50 జనరల్‌
జియాలజీ/ జియోఫిజిక్స్‌: 270 (ఎస్సీ, ఎస్టీ), 100 ఓబీసీ, 100 జనరల్‌.

దేశాన్ని 5 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్‌ నుంచి ఎస్సీ, ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్‌ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతోన్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్‌ నిర్ణయిస్తారు. ఏపీ, తెలంగాణలు జోన్‌ 5 పరిధిలో ఉన్నాయి.

నిబంధనలు

* వేరే ఏ స్కాలర్‌షిప్పులూ మంజూరు కానివారే ఓఎన్‌జీసీ ఉపకార వేతనాలకు అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా లబ్ధి పొందేవాళ్లు ఈ స్కాలర్‌షిప్పునకు అర్హులే. ఎంపికైనవారి వివరాలను ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో భారత్‌లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

* స్కాలర్‌షిప్పు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్పు అందదు.

* దరఖాస్తు: ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేయాలి. కులధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల పత్రం, ఇంటర్‌ లేదా గ్రాడ్యుయేషన్‌ మార్కు షీట్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు పత్రాల వివరాలు అందించాలి.

* దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 6

* వెబ్‌సైట్‌: https://ongcscholar.org/

గమనిక: 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పుల ప్రకటన త్వరలో వెలువడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని