పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగాలు!

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) నిర్వహించే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) నాన్‌ టెక్నికల్‌, హవల్దార్‌ పోస్టులకు ప్రకటన వెలువడింది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ప్రశ్నపత్రాన్ని తెలుగు మాధ్యమంలోనూ రూపొందిస్తారు.

Updated : 23 Jan 2023 06:34 IST

కేంద్రంలో 12,523 ఖాళీలు
తెలుగులోనూ ప్రశ్నపత్రం

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ) నిర్వహించే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) నాన్‌ టెక్నికల్‌, హవల్దార్‌ పోస్టులకు ప్రకటన వెలువడింది. పదో తరగతి విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ప్రశ్నపత్రాన్ని తెలుగు మాధ్యమంలోనూ రూపొందిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు సుమారు రూ.30 వేల ప్రారంభ వేతనం పొందవచ్చు. తాజా ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు...

దేశంలో ఏటా వెలువడే ఉద్యోగ ప్రకటనల్లో ఎస్సెస్సీ ఎంటీఎస్‌ ఒకటి. ఖాళీలు వేల సంఖ్యలో ఉండటం, తక్కువ విద్యార్హత కారణంగా ఎక్కువమంది పోటీ పడుతున్నారు. పరీక్ష మరీ అంత కష్టంగా ఉండనందువల్ల దీన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఏదో ఒక ప్రయత్నంలో విజయాన్ని అందుకోవడం సాధ్యమే. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ రెండూ లెవెల్‌-1 ఉద్యోగాలే. వీరికి రూ.18 వేల మూల వేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. అన్నీ కలిపి వీరు రూ.30,000 జీతం అందుకోవచ్చు. అనుభవం, శాఖా పరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ నాన్‌ టెక్నికల్‌ పోస్టుల్లో అవకాశం వచ్చినవారు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ కార్యాలయాల్లో, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తారు. హవల్దార్‌ పోస్టుల్లో చేరినవాళ్లు కేంద్ర రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా పనిచేస్తారు. కేంద్రంలోని పరోక్ష పన్నుల విభాగాలు, నార్కోటిక్‌ బ్యూరోలో వీరు సేవలందిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలో చూపిన ప్రతిభ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంటీఎస్‌ పోస్టులు భర్తీ చేస్తారు. హవల్దార్‌ పోస్టులకు పీఈటీ, పీఎస్‌టీలు అదనం.

సులువుగానే ప్రశ్నలు

అన్ని ప్రశ్నలూ పదో తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఎదుర్కునేలా ఉంటాయి. అభ్యర్థి అవగాహనను తెలుసుకునేలా.. తేలిక, సాధారణ స్థాయిలోనే వీటిని అడుగుతారు. సగటు విద్యార్థి ఎక్కువ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు గుర్తించవచ్చు.

* న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. పూర్ణ సంఖ్యలు, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్‌, కొలతలు, క.సా.గు., గ.సా.భా., అంకెల మధ్య సంబంధాలు, బోడ్మాస్‌, స్క్వేర్‌, స్క్వేర్‌ రూట్‌.. మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

* రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌: ఆల్పా న్యూమరిక్‌ సిరీస్‌, కోడింగ్‌- డీకోడింగ్‌, ఎనాలజీ, డైరెక్షన్లు, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు, వయసును లెక్కించడం, క్యాలెండర్‌, క్లాక్‌..మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి. బాగా ఆలోచించి జవాబు గుర్తించవచ్చు.

* జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాసేయవచ్చు. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కళలు, సంస్కృతి విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి హైస్కూల్‌ సోషల్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది.

* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.

ఇవీ మార్పులు

* ఈ సారి పరీక్ష విధానం మారింది. గతంలో వంద ప్రశ్నలు వంద మార్కులకు ఉండేవి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వచ్చేవి. సెషన్లు లేవు. అన్ని విభాగాలకూ రుణాత్మక మార్కులు ఉండేవి.

* తాజాగా ప్రశ్నల సంఖ్యను 90కి కుదించారు. పరీక్ష వ్యవధిలో మార్పు లేదు. కాకపోతే ఒక్కో సెషన్‌నూ 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెషన్‌-1లో రుణాత్మక మార్కులు లేవు. అలాగే ఈ సెషన్‌లో 40 ప్రశ్నలకు 45 నిమిషాలు ఉంటాయి. దీంతో ప్రతి ప్రశ్నకు 67 సెకన్ల సమయం లభిస్తుంది.

* గత ఏడాది వరకు పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉండేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించారు. దీంతో అభ్యర్థులకు భారం తగ్గినట్లే.

* హవల్దార్‌ పోస్టులకు పీఈటీలో భాగంగా సైకిల్‌ తొక్కడాన్నీ ఈసారి తీసేశారు. 

* అభ్యర్థులు తెలుగు మాధ్యమంలో ఉండే ప్రశ్నపత్రాన్నీ ఎంచుకోవచ్చు.

* తాజా మార్పులన్నీ అభ్యర్థులకే ఎంతో సౌకర్యవంతం. అలాగే గతంతో పోలిస్తే ఈసారి పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ.

ఇలా సన్నద్ధం కండి!

1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలు బాగా పరిశీలించాలి. పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. అందువల్ల ఇప్పటినుంచి సిద్ధపడినా సుమారు 70 కంటే ఎక్కువ రోజుల వ్యవధే దొరుకుతుంది. ఈ సమయంలో మొత్తం సిలబస్‌ పూర్తిచేసుకోవచ్చు. సిలబస్‌ అనుసరించి.. ముందుగా 8,9,10 తరగతుల మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, సోషల్‌ పుస్తకాలు బాగా చదవాలి.
2 అన్ని విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి అవగాహన లేని/ వెనుకబడిన వాటికి అదనపు సమయం వెచ్చించుకోవాలి.  
3 వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.  
4 చదవడం పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలు నిశితంగా పరిశీలించాలి. వాటిని బాగా సాధన చేయాలి. ప్రశ్నల స్థాయి, అంశాలవారీ పరీక్షలో ప్రాధాన్యం గ్రహించి తుది సన్నద్ధతను అందుకు తగ్గట్టుగా చూసుకోవాలి.
5 చివరి నెల రోజులూ వీలైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. నిర్ణీత సమయంలో వాటిని పూర్తి చేయాలి. ఒక్కో మాక్‌ పరీక్ష పూర్తయిన వెంటనే విభాగాలవారీ ఏ అంశాల్లో తప్పు చేస్తున్నారో గమనించి వాటిని ప్రత్యేక శ్రద్ధతో చదివి, అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ఇదే పద్ధతిని పరీక్ష తేదీ వరకు కొనసాగించాలి.
6 సమాధానం గుర్తించడానికి ఎక్కువ వ్యవధి అవసరమయ్యే ప్రశ్నలను చివరలో సమయం ఉంటేనే ప్రయత్నించండి.
7 సెషన్‌-1లో ప్రశ్నలకు రుణాత్మక మార్కులు లేవు. అందువల్ల తెలియనివాటికి బాగా ఆలోచించి ఏదో ఒక ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. సెషన్‌-2లో ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. అందుకని అసలేమాత్రం తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకుండా, వదిలేయడం తెలివైన నిర్ణయం.


పరీక్ష ఇలా...

పరీక్షను రెండు సెషన్లుగా విభజించారు. రెండు సెషన్లలోనూ ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు. మొత్తం 270 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఒక్కో సెషన్‌ వ్యవధి 45 నిమిషాలు.

* సెషన్‌-1లో న్యూమరికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఉంటాయి. ఈ రెండింటిలో ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున 40 ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు లేవు.

* సెషన్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ సెషన్‌లో తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

* పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి సెషన్‌లోనూ జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాలవారు 20 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కుల పొందినవారి జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్లు అనుసరించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

* ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ): హవల్దార్‌ పోస్టులకు ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి. మహిళలు ఒక కిలోమీటర్‌ని 20 నిమిషాల్లో పూర్తిచేయాలి.

* ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ): పురుషులు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. పెరిగి 81 సెం.మీ. ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఎత్తు, 48 కి.గ్రా. బరువు అవసరం.


ముఖ్య సమాచారం

ఉద్యోగాలు: 12,523. (ఎంటీఎస్‌ 11994, హవల్దార్‌ 529).

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత

వయసు: జనవరి 1, 2023 నాటికి ఎంటీఎస్‌ పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1998 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. హవల్దార్‌, ఎంటీఎస్‌లో కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల వరకు అవకాశం ఉంది. వీటికి జనవరి 2, 1996 - జనవరి 1, 2005 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 17 రాత్రి 11 గంటల వరకు.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు.

పరీక్ష: ఏప్రిల్‌లో.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని