బీటెక్‌తో ఆర్మీలో చేరొచ్చు!

ఇండియన్‌ ఆర్మీ 191 టెక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటికి బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోటీ పడవచ్చు.

Updated : 25 Jan 2023 06:42 IST

ఇండియన్‌ ఆర్మీ 191 టెక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటికి బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోటీ పడవచ్చు. మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ), చెన్నైలో శిక్షణ నిర్వహిస్తారు. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేసి, లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరు మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష  వేతనం పొందవచ్చు. పలు ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు. ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలు..

ర్మీ ఏడాదికి రెండుసార్లు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) టెక్‌ మెన్‌, విమెన్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. ఖాళీల్లో మెన్‌ 175, విమెన్‌ 14, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. మెన్‌ ఖాళీల్లో విభాగాలవారీ.. సివిల్‌ 49, కంప్యూటర్‌ సైన్స్‌ 42, ఎలక్ట్రికల్‌ 17, ఎలక్ట్రానిక్స్‌ 26, మెకానికల్‌ 32, ప్లాస్టిక్‌ టెక్‌/రిమోట్‌ సెన్సింగ్‌ 9 ఉన్నాయి. మహిళలకు సంబంధించి.. సివిల్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌ 5, ఎలక్ట్రికల్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 2, మెకానికల్‌ 3 కేటాయించారు. డిఫెన్స్‌ విడోస్‌ కోసం 2 ఖాళీలు ఉంచారు.

విద్యార్హత: సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ ఖాళీలకు ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచేసుకున్నవారూ అర్హులే. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు అర్హులు.

వయసు: అక్టోబరు 1, 2023 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే అక్టోబరు 2, 1996 - అక్టోబరు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులను అకడమిక్‌ (బీటెక్‌/ఎమ్మెస్సీ) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలవారికి బెంగళూరులో మౌఖిక పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్‌, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ.. వేతనాలు: ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో అక్టోబరు, 2023 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీరు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. వ్యవధి అనంతరం వీరు వైదొలగాలి. లెఫ్టినెంట్‌గా చేరినవాళ్లు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్‌, ఆరేళ్ల సేవలతో మేజర్‌, 13 ఏళ్లకు లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. ఉద్యోగంలో మొదటి నెల నుంచి రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనంతోపాటు రూ.15,500 మిలట్రీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. క్యాంటీన్‌, రేషన్‌.. పలు ప్రోత్సాహకాలూ పొందవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 3 వరకు

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని