44 కేంద్రీయ సంస్థల్లోకి ఒకే పరీక్షతో!

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌, రాష్ట్రస్థాయి, ప్రైవేటు సంస్థలెన్నో యూజీలో విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. దీంతో పీజీ వరకు ఆగకుండా యూజీలోనే విశ్వవిద్యాలయాల ప్రధాన క్యాంపసుల్లో చదువుకోవచ్చు.

Updated : 16 Feb 2023 07:35 IST

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌, రాష్ట్రస్థాయి, ప్రైవేటు సంస్థలెన్నో యూజీలో విభిన్న కోర్సులను అందిస్తున్నాయి. దీంతో పీజీ వరకు ఆగకుండా యూజీలోనే విశ్వవిద్యాలయాల ప్రధాన క్యాంపసుల్లో చదువుకోవచ్చు. వీటిలో ప్రవేశానికి సంస్థలవారీ విడిగా పరీక్ష రాయాల్సిన పని   లేదిప్పుడు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ)తో 44 కేంద్రీయ విద్యాసంస్థల్లో చేరిపోవచ్చు. ఇటీవలే ప్రవేశ ప్రకటన వెలువడిన నేపథ్యంలో పూర్తి వివరాలు..

విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అందిస్తోన్న బీఏ, బీఎస్సీ, బీకాం, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ ఎడ్‌, బీఏ ఎడ్‌, బీబీఏ, బీబీఎం... ఇలా పలు కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ యూజీ స్కోరు ఉపయోగపడుతుంది. పరీక్షను గరిష్ఠంగా పది సబ్జెక్టుల్లో రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ చేరాలనుకుంటున్న రెండు మూడు సబ్జెక్టులు ఎంచుకుని వాటిలో రాయడమే శ్రేయస్కరం. దీని వల్ల సన్నద్ధత కేంద్రీకృతమై మెరుగైన స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది.


తెలుగులోనూ పరీక్ష

ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ప్రశ్నపత్రం/ పరీక్ష మాధ్యమం కోసం అభ్యర్థులు 13 భాషల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. పరీక్షలో మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
సెక్షన్‌ 1: ఎ, బి విభాగాలుంటాయి. ఈ రెండూ భాషలకు చెందినవే. 1ఏలో 13 భాషల నుంచి ఏదైనా నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్‌ ఇందులో ఉంటుంది. ఎంచుకున్న భాషలో మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 40కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. 1బీలో 20 భాషల నుంచి నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. వీటిలో స్థానిక, విదేశీ భాషలూ ఉన్నాయి. ఆసక్తి ఉన్న భాషలో 50 ప్రశ్నల్లో 40కి సమాధానం రాస్తే సరిపోతుంది.
సెక్షన్‌ 2: 27 సబ్జెక్టుల నుంచి ఏదైనా నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. ఆ విభాగంలో 45 ప్రశ్నలుంటే 35, 50 ఉంటే 40కి సమాధానం గుర్తించాలి. ప్రవేశం పొందాలనుకుంటున్న కోర్సు/ విశ్వవిద్యాలయం అనుసరించి వీటిని ఎంచుకోవాలి. ఒక్కో అభ్యర్థీ గరిష్ఠంగా 10 సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. వేర్వేరు తేదీలు, షిఫ్టుల్లో వీటిని నిర్వహిస్తారు. ప్రతి రోజూ మూడు విడతల్లో పరీక్షలుంటాయి.
సెక్షన్‌ 3: జనరల్‌ టెస్టు. ఇందులో 60 ప్రశ్నలు వస్తాయి. వాటిలో 50కి సమాధానం గుర్తిస్తే సరిపోతుంది.
1ఏలో: అస్సామీస్‌, బెంగాళీ, ఇంగ్లిష్‌, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్‌, తెలుగు, ఉర్దూ ఉంటాయి. వీటిలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవాలి.
1బీలో: అరబిక్‌, బోడో, చైనీస్‌, డోగ్రీ, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, పర్షియన్‌, రష్యన్‌, సంతాలీ, సింధీ, స్పానిష్‌, టిబెటన్‌, సంస్కృతం (వీటిలో యూజీలో చేరాలనుకుంటున్న భాషకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి)
సబ్జెక్టులివీ: అకౌంటెన్సీ/బుక్‌ కీపింగ్‌, అగ్రికల్చర్‌, ఆంత్రొపాలజీ, బయాలజీ/బయలాజికల్‌ స్టడీస్‌/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ, బిజినెస్‌ స్టడీస్‌, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌, ఇంజినీరింగ్‌ గ్రాఫిక్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ /విజువల్‌ ఆర్ట్స్‌ (స్కల్ప్‌చర్‌ / పెయింటింగ్‌) /కమర్షియల్‌ ఆర్ట్‌, జాగ్రఫీ/జియాలజీ, హిస్టరీ, హోమ్‌ సైన్స్‌, నాలెడ్జ్‌ ట్రెడిషన్‌-ప్రాక్టీసెస్‌ ఇండియా, లీగల్‌ స్టడీస్‌, మాస్‌ మీడియా/మాస్‌ కమ్యూనికేషన్‌, మ్యాథమెటిక్స్‌/అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌, పెర్ఫామింగ్‌ ఆర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ఎన్‌సీసీ/యోగా, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, సంస్కృతం, సోషియాలజీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌.  


ఏ అంశాల్లో?

లాంగ్వేజ్‌లు: ఇందులో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబ్యులరీ ప్రశ్నలు ఉంటాయి.
సబ్జెక్టు: ఎంచుకున్న సబ్జెక్టులో 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్‌: జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ (గణితంలోని ప్రాథమికాంశాల అనువర్తనంపై ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ విభాగాల్లో), లాజికల్‌ అండ్‌ ఎనలిటికల్‌ రీజనింగ్‌ నుంచి వస్తాయి.


ఈ కేంద్రీయ సంస్థల్లోకి...

సీయూసెట్‌ యూజీలో చూపిన ప్రతిభతో...  యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, అలీఘర్‌ ముస్లిం, అస్సాం, బాబా సాహెబ్‌ భీమ్‌రావు అంబేడ్కర్‌, బెనారస్‌ హిందూ, సెంట్రల్‌ శాన్‌స్క్రిట్‌, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌, గురు ఘాసిదాస్‌, హేమవతి నందన్‌ బహుగుణ గర్వాల్‌, ఇందిరా గాంధీ నేషనల్‌ ట్రైబల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహాత్మాగాంధీ అంతర్‌ రాష్ట్రీయ హిందీ, మహాత్మాగాంధీ సెంట్రల్‌, మణిపూర్‌, మౌలానా అజాద్‌ ఉర్దూ, మిజోరాం, నేషనల్‌ శాన్‌స్క్రిట్‌, నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌, పాండిచ్చేరి, రాజీవ్‌ గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి శాన్‌స్క్రిట్‌, సిక్కిం, తేజ్‌పూర్‌, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌, త్రిపుర, అలహాబాద్‌, దిల్లీ, విశ్వభారతి, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, జార్ఖండ్‌, కర్ణాటక, కశ్మీర్‌, కేరళ, ఒడిశా, రాజస్థాన్‌, సౌత్‌ బిహార్‌, తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు.
రాష్ట్రీయ విద్యా సంస్థలు, డీమ్డ్‌, ప్రైవేటు సంస్థలు ఈ స్కోరుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. మొత్తం 90 సంస్థల్లో ప్రవేశానికి ఈ స్కోరు ప్రామాణికం.


సన్నద్ధత

1 వెబ్‌సైట్‌లో సబ్జెక్టులవారీ సిలబస్‌ వివరాలు ప్రకటించారు. వాటిని గమనించాలి.
2 సిలబస్‌లో పేర్కొన్న అంశాలను ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాల నుంచి బాగా చదవాలి.
3 గత ఏడాది నిర్వహించిన సీయూఈటీ-యూజీ ప్రశ్నపత్రాలన్నీ గమనించాలి. ప్రశ్నల తీరు, స్థాయి పరిశీలించాలి. ఏ అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారో చూసుకుని, వాటిని బాగా చదవాలి.
4 వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
5 పరీక్షకు ముందు నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేసి ఫలితాలను విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.


హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో...

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను పలు విభాగాల్లో ఇక్కడ అందిస్తున్నారు. వీటిలో ప్రవేశం సీయూఈటీ-యూజీతో లభిస్తుంది.

* ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ. వీటిలో అప్లయిడ్‌ జియాలజీలో 10, బయాలజీలో 48, మిగిలినవాటిలో ఒక్కో విభాగంలో 20 చొప్పున సీట్లు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీలో 20 సీట్లకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా పోటీ పడవచ్చు.
* ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్‌): తెలుగు 19, హిందీ 10, లాంగ్వేజ్‌ సైన్సెస్‌ 19, ఉర్దూ 10 సీట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్‌ ఏ గ్రూపులోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌లో తెలుగు/హిందీ/ ఉర్దూ చదివుండడం తప్పనిసరి.
* ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌ 14, హిస్టరీ 13, పొలిటికల్‌ సైన్స్‌ 13, సోషియాలజీ 14, ఆంత్రొపాలజీ 13 సీట్లు ఉన్నాయి. ఏ గ్రూపుతోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ విధానంలో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తోంది. కోర్సు వ్యవధి ఆరేళ్లు. 28 సీట్లు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 12 రాత్రి 9 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష తేదీలు: మే 21 నుంచి మే 31 వరకు పరీక్ష కేంద్రాలు: ఏపీలో 25, తెలంగాణలో 16 ఉన్నాయి.
ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు..3 సబ్జెక్టులకు రూ.750, 7 సబ్జెక్టుల వరకు రూ.1500, 10 సబ్జెక్టుల వరకు రూ.1750 ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు.. 3 సబ్జెక్టులైతే రూ.700, 7 వరకు రూ.1400, 10 వరకు రూ.1650 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులకు.. 3 సబ్జెక్టులకు రూ.650 7 వరకు రూ.1300, 10 వరకు రూ.1550
వెబ్‌సైట్‌: https://cuet.samarth.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని