టీచింగ్లో రాణించాలని ఉందా?
కొత్త కోర్సులు ఎన్ని వచ్చినప్పటికీ వన్నె తరగని కెరియర్.. టీచింగ్. ఈ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు డీఎడ్ లేదా బీఎడ్ కోర్సులు పూర్తిచేయడం తప్పనిసరి.
ప్రతిష్ఠాత్మక సంస్థలో బోధన కోర్సులు
కొత్త కోర్సులు ఎన్ని వచ్చినప్పటికీ వన్నె తరగని కెరియర్.. టీచింగ్. ఈ వృత్తిపై ఆసక్తి ఉన్నవారు డీఎడ్ లేదా బీఎడ్ కోర్సులు పూర్తిచేయడం తప్పనిసరి. నాణ్యమైన ఉపాధ్యాయ విద్యను అందించడానికి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ)లను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ సంస్థలు అందించే బీఎస్సీ బీఎడ్, బీఏ బీఎడ్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ బీఎడ్ కోర్సుల్లో చేరిపోవచ్చు. వీటితోపాటు డిగ్రీ విద్యార్థుల కోసం ఇక్కడ బీఎడ్, ఎంఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సులూ ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల ద్వారా మంచి వేతనాన్నీ పొందుతున్నారు. ఇటీవలే ప్రకటన వెలువడిన నేపథ్యంలో వివరాలు...
ఉపాధ్యాయ విద్యలో ఆర్ఐఈలు దేశంలో పేరున్న సంస్థలు. ఇక్కడ చదువులు పూర్తిచేసుకున్నవారు వృత్తిపరంగా ముందు వరుసలో ఉంటారు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోగలరు. అందువల్ల బోధన రంగంలో రాణించాలనుకున్న ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు ఆర్ఐఈల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్యలో రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. రెండేళ్ల వ్యవధితో ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోన్న ఇంటిగ్రేటెడ్ బీఏ/బీఎస్సీ- ఎడ్ కోర్సుల్లో చేరడం.
వీటిలో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులకు తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ విధానంలో నాలుగేళ్లకే డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో అయితే.. డిగ్రీ అనంతరం బీఎడ్ పూర్తిచేయడానికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ చదువుల కారణంగా ఏడాది సమయం ఆదాతోపాటు నాణ్యమైన ఉపాధ్యాయ విద్య ప్రతిష్ఠాత్మక సంస్థలో అభ్యసించడానికి వీలవుతుంది. అలాగే ఇంటర్ ఎంపీసీ విద్యార్థులైతే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ ఎడ్ కోర్సులో చేరి ఆరేళ్లకే ఎమ్మెస్సీతోపాటు బీఎడ్ పూర్తి చేసుకుని ఏడాది వ్యవధిని ఆదా చేసుకోవచ్చు. డిగ్రీ విద్యార్థులైతే నేరుగా ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సును మూడేళ్లలో పూర్తి చేసుకోవచ్చు. విడిగా ఈ రెండు కోర్సులూ చదవడానికి నాలుగేళ్లు అవసరం. .
ఏమిటి ప్రత్యేకత?
ఇంటిగ్రేటెడ్ బీఎడ్, బీఎడ్, ఎంఎడ్ కోర్సులను పేరున్న సంస్థల్లో చదివినవారు బోధనలో మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. వీరికి తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగానికీ సులువుగానే వీరు పోటీ పడగలరు. నాణ్యమైన శిక్షణ కారణంగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పే సమర్థతా దక్కుతుంది. ఈ విధానంలో చదువుకున్నవారికి మెథడాలజీలో నైపుణ్యం మెరుగవుతుంది. ఆర్ఐఈల్లో ఇంటిగ్రేటెడ్ టీచింగ్ కోర్సులు చదివినవారికి జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్, అంతర్జాతీయ విద్యా సంస్థలు ప్రాంగణ నియామకాలతో బోధకులుగా అవకాశం కల్పిస్తున్నాయి.
ఆర్ఐఈలు.. సీట్లు
ఆజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరుల్లో ఆర్ఐఈలు ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఆర్ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీ విభజించారు.
మైసూర్లో బీఎస్సీబీఎడ్ (ఫిజికల్ సైన్స్)లో 55, బీఎస్సీబీఎడ్ (బయలాజికల్ సైన్స్)లో 55, బీఏబీఎడ్ 55 చొప్పున సీట్లు ఉన్నాయి. విడిగా బీఎడ్ కోర్సుకు సంబంధించి సైన్స్ అండ్ మ్యాథ్స్ గ్రూపులో 55, సోషల్ సైన్స్ అండ్ లాంగ్వేజ్ గ్రూపులో 55 సీట్లు లభిస్తున్నాయి. అలాగే ఈ సంస్థలో ఎంఎడ్లో 55, ఎమ్మెస్సీఎడ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 22 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ ఎడ్ సీట్లకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లలోపు వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే ఎడ్యుకేషన్లో పీహెచ్డీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.
ఆర్ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ స్కాలర్షిప్పులు లభిస్తాయి. అలాగే మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన వీటిని అందజేస్తారు. ప్రాంగణ నియామకాల్లో.. బీఎ/ బీఎస్సీ ఎడ్, బీఎడ్ చదువుకున్నవారికి నెలకు కనీసం రూ.35 వేల వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీఎడ్, ఎంఎడ్ కోర్సుల వారికి కనీసం రూ.40వేలు చొప్పున అవకాశాలు లభిస్తున్నాయి.
అర్హత ఎవరికి?
బీఎస్సీ బీఎడ్ కోర్సులో చేరడానికి ఇంటర్ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్ కోర్సుకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్ కోర్సుకు సైన్స్ / ఆర్ట్స్/ కామర్స్ ఏదైనా స్ట్రీమ్తో ఇంటర్ చదివినవాళ్లు అర్హులు. ఈ కోర్సులన్నింటికీ ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. బీఎడ్, ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సులకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. ఎంఎడ్ కోర్సుకు 50 శాతం మార్కులతో బీఎడ్ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉత్తీర్ణత అవసరం. అన్ని కోర్సులకూ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం మార్కులు సరిపోతాయి. బీఎస్సీ/బీఏ/ఎమ్మెస్సీ-ఎడ్ కోర్సులకు 2021, 2022లో ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు, 2023లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినవారే అర్హులు. బీఎడ్, బీఎడ్-ఎంఎడ్, ఎంఎడ్ కోర్సులకు మాత్రం ఎలాంటి నిబంధనలూ లేవు.
సీట్ల కేటాయింపు
పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్స్ల్లో సాధించిన మార్కులతో కోర్సులోకి తీసుకుంటారు. ఆర్ఐఈల్లో సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈఈ)ను ఎన్సీఈఆర్టీ నిర్వహిస్తోంది. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్/డిగ్రీ/బీఎడ్ మార్కులకు 40 శాతం వెయిటేజీ. ఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్షలో.. భాషా నైపుణ్యాలు, టీచింగ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20, టీచింగ్ ఆప్టిట్యూడ్/యాటిట్యూడ్ 30, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. విభాగాలవారీ సిలబస్, పాత ప్రశ్నపత్రాలు ఆర్ఐఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ప్రశ్నలిలా..
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ: కాంప్రహెన్షన్, వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చడం, ఖాళీలను సరైన పదంతో పూరించడం, వాక్యంలో ఉన్న తప్పుని గుర్తించడం, ఇచ్చిన ఫ్రేజ్కు సరైన అర్థం ఇచ్చే ఆప్షన్ గుర్తించడం, అసంపూర్ణంగా ఉన్న వాక్యానికి సరైన పదం చేర్చి పూర్తిచేయడం, సీక్వెన్సింగ్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ప్రిపొజిషన్స్, టెన్సెస్, ఆర్టికల్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
టీచింగ్ ఆప్టిట్యూడ్: ఎడ్యుకేషన్ ఆటిట్యూడ్, విద్యార్థులు, ఉపాధ్యాయవృత్తి, వృత్తిపరమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, బృంద నిర్వహణ, ఎమోషనల్ అండ్ సోషల్ అడ్జస్ట్మెంట్, ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, పాఠశాల విద్యకు సంబంధించి వర్తమాన సంఘటనలపైన అవగాహనను పరిశీలిస్తారు.
రీజనింగ్ ఎబిలిటీ: వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్, మిసింగ్ నంబర్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, థీమ్ ఫైండింగ్, జంబ్లింగ్, ఎనాలజీ, భిన్నమైనది గుర్తించడం, వాక్యాలను క్రమ పద్ధతిలో అమర్చడం, స్టేట్మెంట్ కన్క్లూజన్లు, సిలాజిజం, లాజికల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్మెంట్ల్లో ప్రశ్నలు సంధిస్తారు.
రాష్ట్రాలవారీ జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన చేశారు. ఎమ్మెస్సీ ఎడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ల్లో ఒక్కో సబ్జెక్టులో 22 చొప్పున మొత్తం 66 సీట్లు ఉన్నాయి. వీటికి రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆర్ఐఈ, భోపాల్లో ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఎడ్ కోర్సును మూడేళ్ల వ్యవధిలో అందిస్తున్నారు. ఇందులో 55 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 6
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600. మిగిలిన అందరికీ రూ.1200
పరీక్ష తేదీ: జులై 2
వెబ్సైట్: http://cee.ncert.gov.in
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే