బోధన కొలువుల సాధనకు మొదటి మెట్టు!
బోధన రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు తొలి మెట్టు యూజీసీ నెట్లో అర్హత సాధించడం. ఈ అవకాశం వచ్చినవారు దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు.
బోధన రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు తొలి మెట్టు యూజీసీ నెట్లో అర్హత సాధించడం. ఈ అవకాశం వచ్చినవారు దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అవకాశం వస్తే ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ పీహెచ్డీ పూర్తి చేసుకోవచ్చు. కొన్ని కేంద్రీయ సంస్థలు నెట్ స్కోరుతో ఉన్నత స్థాయి ఉద్యోగాలూ అందిస్తున్నాయి. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా వెలువడిన జూన్ ప్రకటన వివరాలిలా..
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) 83 సబ్జెక్టులు/విభాగాల్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నిర్వహిస్తారు. భాషలు తప్పించి, మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడవచ్చు. డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థలు మేటి స్కోరు ఉన్నవారికి అధిక వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయి. పోటీ, ప్రవేశ పరీక్షల నిమిత్తం శిక్షణ ఇస్తోన్న సంస్థలూ నెట్ స్కోరుకు ప్రాధాన్యమిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగ విభాగాల్లో నేషనల్ ఫెలోషిప్పులు పొందడానికి నెట్ తప్పనిసరి. కొన్ని ప్రభుత్వ, అనుబంధ సంస్థలు (మహారత్న, నవరత్న కంపెనీలు) నెట్ స్కోర్తో మేనేజ్మెంట్ ట్రెయినీ హోదాతో లీగల్, హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు సైతం నెట్ అర్హులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
పరీక్ష ఇలా...
ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 300 మార్కులు. 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పేపర్ 1 అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. 50 ప్రశ్నలకు వంద మార్కులు. రెండో పేపర్ వంద ప్రశ్నలు 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ప్రశ్నపత్రం అభ్యర్థి ఎంచుకున్న విభాగం/సబ్జెక్టు నుంచి ఉంటుంది. రుణాత్మక మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్ 1, 2 మధ్య విరామం లేదు. పరీక్షను రోజూ ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు.
పేపర్ 1: ఇందులో 10 విభాగాలు ఉన్నాయి. అవి.. టీచింగ్ ఆప్టిట్యూడ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టం.
అభ్యర్థి బోధన, పరిశోధన రంగంలో రాణించగలరా, లేదా తెలుసుకునేలా ప్రశ్నలు వస్తాయి. ఆలోచన విధానం, ఆంగ్లాన్ని అర్థం చేసుకునే తీరు, గణితంలో ప్రాథమిక పరిజ్ఞానం, తర్కం, విశ్లేషణ సామర్థ్యం, కమ్యూనికేషన్ సాధనాలు, అభివృద్ధి, పర్యావరణం, ఉన్నత విద్యలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి.
పేపర్-2: ప్రశ్నలన్నీ అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచే ఉంటాయి. ఆ విభాగంలో.. ప్రాథమికాంశాలు, అనువర్తనం, విశ్లేషణ, అవగాహన, జ్ఞానం పరిశీలించేలా వీటిని అడుగుతారు. అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే. అయినప్పటికీ.. సబ్జెక్టులో లోతైన పట్టున్నవారే సమాధానం ఇవ్వగలరు. ప్రతి అంశాన్నీ విస్తృతంగా, సూక్ష్మంగా చదివితేనే నెగ్గగలరు.
రిఫరెన్స్ పుస్తకాలు
ట్రూమెన్స్/అరిహంత్/ఉప్కార్/ టాటా మెక్గ్రాహిల్స్/ పియర్సన్.. వీటిలో ఏదైనా ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకోవచ్చు.
జేఆర్ఎఫ్..
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) అవకాశం వచ్చినవారు మేటి సంస్థల్లో పరిశోధన (పీహెచ్డీ) దిశగా అడుగులేయవచ్చు. వీరికి మొదటి రెండేళ్లలో ప్రతి నెలా రూ.31,000 చెల్లిస్తారు. అనంతరం ఎస్ఆర్ఎఫ్కు అర్హత సాధిస్తే రూ.35,000 చొప్పున స్టైపెండ్ అందుతుంది. సంబంధిత సంస్థ వసతి కల్పించకపోతే స్టైపెండ్లో 30 శాతం వరకు హెచ్ఆర్ఏ రూపంలో చెల్లిస్తారు. ప్రతి ఏటా కంటింజెన్సీ గ్రాంటు అందుతుంది.
కటాఫ్ అంచనా..
సబ్జెక్టు బట్టి మారుతుంది. ఆ సబ్జెక్టులో ఎంత మంది పరీక్ష రాశారు, ప్రశ్నపత్ర కఠినత్వం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి. లెక్చరర్షిప్ అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 200 మార్కులు పొందితే సరిపోతుంది. అదే జేఆర్ఎఫ్ కోసమైతే 220 వరకు రావాలి. కొన్ని సబ్జెక్టుల్లో లెక్చరర్షిప్ 180, జేఆర్ఎఫ్ 200కీ లభిస్తోంది.
గతంలో అడిగిన ప్రశ్నలు పునరావృతం కావడానికి అవకాశం తక్కువే. అయినప్పటికీ పాత ప్రశ్నపత్రాల ద్వారా.. ప్రశ్నలు ఏ స్థాయిలో, ఏ విధంగా అడుగుతున్నారో తెలుస్తుంది. దీంతో వాటిని ఎదుర్కోవడానికి ఏం నేర్చుకోవాలో అవగతమవుతుంది.
నెట్ వర్సెస్ సెట్..
నెట్ జాతీయ స్థాయి పరీక్ష. అందువల్ల ఈ స్కోరుతో దేశంలో ఏ రాష్ట్రం/ విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకైనా పోటీపడవచ్చు. సెట్ రాష్ట్ర స్థాయి పరీక్ష. అందువల్ల ఆ రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకే పోటీ పడగలరు. నెట్ ఏటా రెండుసార్లు (సాధారణంగా జూన్, డిసెంబరుల్లో) నిర్వహిస్తారు. సెట్ కోసం ప్రత్యేకంగా క్యాలండర్ లేదు. నెట్లో అర్హత సాధించడం కష్టమే కానీ, ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల అదే ప్రయత్నంలో ఉన్నవారు విజయవంతం కాగలరు. కొద్ది శ్రమతోనే సెట్లో గట్టెక్కవచ్చు. విలువ పరంగా చూస్తే నెట్కే అధిక ప్రాధాన్యం.
ముఖ్య వివరాలు
విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు 50 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పొందడానికి వయసు నిబంధన లేదు. జేఆర్ఎఫ్ కోసం జూన్ 1, 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మహిళలకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల వరకు సడలింపు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: మే 31 సాయంత్రం 5 వరకు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150. ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్), ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు రూ.325.
పరీక్షలు: జూన్ 13 నుంచి 22 వరకు.
వెబ్సైట్: https://ugcnet.nta.nic.in/
సన్నద్ధత సూత్రాలు
1. యూజీసీ వెబ్సైట్లో సబ్జెక్టులవారీ సిలబస్ వివరాలు ఉన్నాయి. వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి.
2. ప్రశ్నలు ఆ సబ్జెక్టులో అభ్యర్థికెంత పట్టు ఉందో తెలుసుకునేలా రూపొందిస్తారు. ప్రాథమికాంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. కొన్ని ప్రశ్నలు పలు అంశాలను జోడించి అడుగుతారు. ఇలాంటివాటికి సబ్జెక్టులోని ప్రతి అంశంపైనా లోతైన పరిజ్ఞానం అవసరం.
3. ముందుగా ఆ సబ్జెక్టులో ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ పాఠ్యాంశాలను విస్తృతంగా చదవాలి. ఆ తర్వాత పీజీ, రిఫరెన్స్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
4. రిఫరెన్స్ పుస్తకాలను పరిమితంగా ఎంచుకుని, వాటినే విస్తృతంగా చదవాలి.
5.చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలను నోట్సు రాసుకోవాలి. పరీక్షకు ముందు వీటిని మరోసారి మననం చేయాలి.
6.పరీక్షలో విజయానికి పాత ప్రశ్నపత్రాలే దిక్సూచి. వీటి నుంచి.. ప్రశ్నలడిగే విధానం, వాటి స్థాయి, అంశాలవారీ లభిస్తోన్న ప్రాధాన్యం తెలుసుకోవచ్చు. సన్నద్ధతలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
7.రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెట్/స్లెట్ పేపర్లు పరిశీలించవచ్చు. జేఎల్, డీఎల్ ప్రశ్నపత్రాలూ ఉపయోగపడతాయి. పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల అధ్యయనమూ మేలు చేస్తుంది.
8. సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్ టెస్టులు రాయాలి. ఇందులో సాధించిన స్కోరు గమనించాలి. ఏ చాప్టర్లు/ విభాగాల్లో తప్పులొస్తున్నాయో తెలుసుకుని వాటిపై మరింత శ్రద్ధ వహించాలి. ఇదే పద్ధతిని చివరి పరీక్ష వరకు కొనసాగిస్తే విజయవంతం కావచ్చు.
9. రుణాత్మక మార్కులు లేవు కాబట్టి బాగా ఆలోచించి తెలియని ప్రశ్నకూ జవాబును ఊహించి, గుర్తించాలి.
10. ఏదైనా ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఉన్నా, ప్రశ్నలో ఏమైనా పొరపాట్లు ఉన్నా బోనస్ మార్కులు ఇస్తారు. అయితే ఆ ప్రశ్నకు ఏదో ఒక ఆప్షన్ జవాబుగా గుర్తించినవారికే ఇవి దక్కుతాయి. ఏ సమాధానమూ ఇవ్వనివారికి ఈ మార్కులు జతచేయరు. అందువల్ల తెలియని ప్రశ్నలైనా వదలొద్దు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tovino Thomas: ‘ది కేరళ స్టోరీ’ స్థానంలో ‘2018’కి ఆస్కార్ ఎంట్రీ?’.. టొవినో రియాక్షన్ ఏంటంటే?
-
Tirumala: ఘాట్రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు సడలించిన తితిదే
-
Pakistan: పాక్లో మరోసారి పేలుళ్లు.. పలువురి మృతి
-
Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?