త్రివిధ దళాల్లోకి సీడీఎస్ఈ దారి
డిగ్రీ విద్యార్హతతో ఉన్న ముఖ్యమైన ప్రభుత్వోద్యోగ పరీక్షల్లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) ఒకటి. రక్షణ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు ఆశించేవారికి ఇది దారి చూపుతుంది.
డిగ్రీ విద్యార్హతతో ఉన్న ముఖ్యమైన ప్రభుత్వోద్యోగ పరీక్షల్లో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) ఒకటి. రక్షణ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు ఆశించేవారికి ఇది దారి చూపుతుంది. ఏడాదికి రెండుసార్లు యూపీఎస్సీ దీన్ని నిర్వహిస్తుంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఇందులో విజయవంతమైనవారు శిక్షణ అనంతరం త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లెవెల్-10 వేతనంతో సేవలు అందించవచ్చు. అనుభవం, ప్రతిభతో అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు. ఇటీవలే వెలువడిన సీడీఎస్ఈ 2023(2) ప్రకటన వివరాలు...
దేశ రక్షణలో భాగం కావాలనే ఆసక్తి, యూనిఫాం పోస్టులంటే ప్రత్యేక అభిమానం, అత్యున్నత ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్న పట్టభద్రులు సీడీఎస్ఈని ఎంచుకోవచ్చు. ఈ పరీక్షతో పైలట్గానూ అవతరించవచ్చు. 24 ఏళ్లలోపు వయసువారు పోటీపడవచ్చు. క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి కాబట్టి నిబద్ధతతో కృషిచేస్తే తక్కువ ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకోవచ్చు. గత ఫలితాలు గమనిస్తే.. పరీక్ష, ఇంట ర్వ్యూలో కలిపి 45 శాతం మార్కులు పొందినవారు ఏదో ఒక సర్వీసుకు ఎంపికవుతున్నారు.
పరీక్షలో..
పేపర్కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో 3 ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒక్కో పేపర్కు వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు దానికి కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. ఇంగ్లిష్ విభాగం మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్లోనూ కనీస మార్కులు పొందాలి. ఓటీఏ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు.
ప్రశ్నలడిగే విభాగాలు..
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్: ఈ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. అరిథ్మెటిక్ (నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ), ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ నుంచి వీటిని అడుగుతారు.
ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్, ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్.. నుంచి ప్రశ్నలు సంధిస్తారు.
జనరల్ నాలెడ్జ్: ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడినవే ఉంటాయి. రోజువారీ పరిశీలనల ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం. సైన్స్, టెక్నాలజీల్లో తాజా మార్పులపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర, భౌగోళిక వ్యవస్థ అంశాల్లో అభ్యర్థి అవగాహననూ పరీక్షిస్తారు.
ఇంటర్వ్యూ
పరీక్షతో సమానంగా ఈ విభాగానికీ 300 మార్కులు ఉన్నాయి. ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఐదు రోజులపాటు కొనసాగే ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో అంకానికి అనుమతిస్తారు. స్టేజ్-1లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి విశ్లేషించమంటారు. దీనిద్వారా అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం, అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ విభాగంలో అర్హత సాధించినవారికి స్టేజ్-2లో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. సైకాలజీ టెస్టులతోపాటు పలు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ
అభ్యర్థులు తమ ప్రాధాన్యం, మెరిట్ ప్రకారం.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ(ఓటీఏ) వీటిలో ఎందులోనైనా అవకాశం పొందుతారు. ఏ విభాగంలో చేరినప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలల పాటు పైలట్ శిక్షణ బీదర్, ఎలహంక, హాకీంపేటల్లో ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో 11 నెలలు శిక్షణలో పాల్గొంటారు. వీరు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని అందుకోవచ్చు. అనంతరం ఆసక్తి ఉంటే మరో ఏడాది కోర్సు పూర్తిచేసుకుని పీజీ పట్టా పొందవచ్చు.
ఉద్యోగంలో...
శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నప్పటికీ ఈ మూడూ సమాన హోదా (లెవెల్ 10) ఉద్యోగాలే. వీరికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలటరీ సర్వీస్ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్ అలవెన్స్ అందుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. రెండేళ్ల సర్వీస్తో ఆర్మీలో కెప్టెన్, నేవీలో లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ హోదాలు సొంతం చేసుకోవచ్చు. ఆరేళ్లపాటు విధుల్లో కొనసాగితే మేజర్/ లెఫ్టినెంట్ కమాండర్/ స్క్వాడ్రన్ లీడర్ గుర్తింపు లభిస్తుంది. 13 ఏళ్ల సర్వీస్ ఉన్నవాళ్లు ఎయిర్ ఫోర్సులో వింగ్ కమాండర్ కావచ్చు. అదే నేవీలో కమాండర్, ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందవచ్చు.
కటాఫ్ ఇలా...
2022(1): రాత పరీక్షలో 300కు గానూ ఐఎంఏ 136, ఐఎన్ఏ 128, ఏఎఫ్ఏ 147, ఓటీఏ 100 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ) 600కు ఐఎంఏ 258, ఐఎన్ఏ 256, ఏఎఫ్ఏ 269, ఓటీఏ మెన్ 181 ఓటీఏ ఉమెన్ 184 మార్కుల వరకు అవకాశం లభించింది.
2021(2): రాత పరీక్ష 300కు: ఐఎంఏ 138, ఐఎన్ఏ 132, ఏఎఫ్ఏ 148, ఓటీఏ 102 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ)600కు.. ఐఎంఏ 263, ఐఎన్ఏ 256, ఏఎఫ్ఏ 270, ఓటీఏ మెన్ 183, ఓటీఏ ఉమెన్ 184 వరకు అవకాశం పొందారు.
విద్యార్హత
మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి. ఓటీఏ ఎస్ఎస్సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2024 నాటికి 20-24 ఏళ్లలోపు ఉండాలి. ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జులై 2, 2000 - జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీ పోస్టులకు జులై 2, 2000 - జులై 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జులై 2, 1999 - జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు.
ఖాళీలు: 349. విభాగాల వారీ.. ఐఎంఏ-100, ఐఎన్ఏ-32, ఏఎఫ్ఏ-32, ఓటీఏ ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్ -169, ఓటీఏ ఎస్ఎస్సీ ఉమెన్ నాన్ టెక్నికల్ 16.
ఆన్లైన్ దరఖాస్తులు: జూన్ 6 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలినవారు రూ.200 చెల్లించాలి.
పరీక్ష తేదీ: సెప్టెంబరు 3
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్.
వెబ్సైట్: https://upsc.gov.in/
సన్నద్ధత ఎలా?
మ్యాథ్స్: 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. యూజీ/ ఇంటర్మీడియట్ స్థాయిలో గణిత నేపథ్యం ఉన్నవారు ఈ పేపర్ను సులువుగానే ఎదుర్కోవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు ఈ విభాగంలో మెరుగైన మార్కుల కోసం అదనంగా సమయం కేటాయించాలి. ప్రాథమికాంశాలు అధ్యయనం చేసి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.
జనరల్ నాలెడ్జ్: భారతదేశ చరిత్ర, భౌగోళికశాస్త్రం, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు ఉపయోగపడతాయి. లూసెంట్ లేదా అరిహంత్ జీకే పుస్తకాల్లో ఏదైనా చదివితే సరిపోతుంది. సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎన్సీఈఆర్టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు శ్రద్ధగా చదవాలి.
ఇంగ్లిష్: ప్రశ్నలన్నీ హైస్కూల్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8,9,10 తరగతుల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టి సారించాలి. అనంతరం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
* ప్రాథమిక స్థాయి సన్నద్ధత పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి వీటిని పొందవచ్చు. వీటి ద్వారా.. విభాగాలవారీ ప్రశ్నలు ఏ తరహాలో వస్తున్నాయి, చదవాల్సిన అంశాలు, సన్నద్ధత ఎలా ఉండాలో అర్థమవుతుంది.
* పరీక్షకు నెల ముందు నుంచి వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. వీటిని మూల్యాంకనం చేసి, ఫలితాలు విశ్లేషించాలి. ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏ అంశాల్లో వెనుకబడ్డారో గమనించి, వాటికి అధిక ప్రాధాన్యమివ్వాలి. తర్వాత పరీక్షల్లో గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
* రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి, తెలియని ప్రశ్నలు వదిలేయాలి. ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలకు పరీక్ష చివరలో సమయం మిగిలితేనే ప్రయత్నించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: ‘ఐప్యాక్కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా
-
RK Roja: తెదేపాను వీడినప్పటి నుంచి కక్ష కట్టారు: మంత్రి రోజా
-
YS Jagan: రేపు దిల్లీకి సీఎం జగన్.. హఠాత్తుగా సామర్లకోట పర్యటన వాయిదా
-
స్నేహితులను వరించిన అదృష్టం.. లాటరీలో రూ.కోటిన్నర గెలుపు