ఆహ్వానిస్తోంది.. నౌకాదళం!

ఆఫీసర్‌ హోదాతో పరిమిత కాల సేవల ప్రాతిపదికన భారతీయ నౌకాదళం (నేవీ) అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సులు చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Published : 27 Oct 2022 01:19 IST

217 ఉద్యోగాలు

ఆఫీసర్‌ హోదాతో పరిమిత కాల సేవల ప్రాతిపదికన భారతీయ నౌకాదళం (నేవీ) అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ కోర్సులు చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కులతో అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో మెరిసినవారిని శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలు అందుకోవచ్చు.

గ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌.. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 217 పోస్టులు ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా పరీక్ష రాయనవసరం లేదు. అకడమిక్‌ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇవి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో సాధించిన మార్కుల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని పోస్టులకూ 60 శాతం మార్కులు తప్పనిసరి.

ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, తుది నియామకానికి ఖరారు చేస్తారు. ఇలా ఎంపికైనవారికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో జూన్‌, 2023 నుంచి 22 వారాలపాటు సంబంధిత విభాగాల్లో తర్ఫీదునిస్తారు. ఆ తర్వాత మరో 22 వారాలపాటు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో తదుపరి శిక్షణ ఉంటుంది. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారికి లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. ప్రారంభ వేతనం రూ.లక్షకు పైగా అందుకోవచ్చు. ప్రొబేషన్‌ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు. అందువల్ల గరిష్ఠంగా 14 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత వైదొలగాలి.

విభాగాలు... ఖాళీలు..అర్హతలు

* ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌లో.. జనరల్‌ సర్వీస్‌ హైడ్రో క్యాడర్‌ విభాగంలో 56 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 16 మహిళలకు కేటాయించారు. వీటికి ఏదైనా బ్రాంచీలో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ 5, నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ 15, పైలట్‌ 25.. ఖాళీలకు బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్‌ 20 ఖాళీలలకు ఎందులోనైనా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ(ఐటీ)/ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్‌/సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

* ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లో 12 ఖాళీలు ఉన్నాయి. వీటికి పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు.

* టెక్నికల్‌ బ్రాంచ్‌లో.. ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ 25, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ 45, నేవల్‌ కన్‌స్ట్రక్టర్‌ 14 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌లకు జులై 2, 1998 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. మిగిలిన అన్నింటికీ జులై 2, 1998 - జనవరి 1, 2004 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  

పై అన్ని పోస్టులకూ ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్‌ ఉన్నవారికి అకడమిక్‌ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు పూరించినప్పుడు పోస్టులవారీ తమ ప్రాధాన్యం ఎంచుకోవడం తప్పనిసరి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 6 వరకు స్వీకరిస్తారు.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్‌, విశాఖపట్నం, కోల్‌కతా. పైలట్‌, అబ్జర్వర్‌ పోస్టులకు మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారు.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని