ఆవిష్కర్తలకు ఆహ్వానం!

పరిశీలించి చూడాలేకానీ మన చుట్టూ ఎన్నో సామాజిక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించగలిగే ఆలోచనాశక్తి కలిగింది నేటితరం విద్యార్థులకే!

Updated : 27 Apr 2023 05:17 IST

ఐఐటీ దిల్లీ, సామ్‌సంగ్‌ ఇండియా ఆధ్వర్యంలో ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’


పరిశీలించి చూడాలేకానీ మన చుట్టూ ఎన్నో సామాజిక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించగలిగే ఆలోచనాశక్తి కలిగింది నేటితరం విద్యార్థులకే! అందుకే కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (మైటీ), సామ్‌సంగ్‌ ఇండియా, ఐఐటీ దిల్లీ సంస్థలు సంయుక్తంగా ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ ఆవిష్కరణల పోటీని ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఉత్సాహవంతులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
* సగటు మనుషుల జీవితాలను ప్రభావితం చేసేలా, వారిని జీవనవిధానాన్ని మెరుగుపరిచేలా నూతన టెక్నాలజీను సృష్టించే వారి కోసమే ఈ పోటీ. ఇందుకోసం కొన్ని అంశాలను ఎంపిక చేశారు. విద్య - అభ్యాసం, వాతావరణం - సుస్థిరత్వం, ఆరోగ్యం - సంక్షేమం, వైవిధ్యం - ఏకత్వం అనే అంశాలపై ఈ పోటీ ఉంటుంది. 16 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేయవచ్చు.
ఈ పోటీలో ఒక్కరుగా లేదా బృందంగా పాల్గొనవచ్చు.
ఒక జట్టుకు ముగ్గురుకంటే ఎక్కువ సభ్యులు ఉండకూడదు. ఇందులో నెగ్గిన మొదటి 3 బృందాలకు... తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు మొత్తం రూ.కోటిన్నర బహుమతిగా లభిస్తుంది. అదేవిధంగా టాప్‌ 10, టాప్‌ 30 జట్లను తగిన విధంగా ప్రోత్సహిస్తారు. వీరికి ముఖ్యంగా టెక్నికల్‌ శిక్షణ దొరుకుతుంది. టాప్‌ 30లో ఒక్కో బృందానికి రూ.20 వేల చొప్పున ఫండ్‌ లభిస్తుంది. వీరికి సామ్‌సంగ్‌ ఇండియా ఆఫీసులు, ఆర్‌అండ్‌డీ సెంటర్లు, డిజైన్‌ సెంటర్‌, బెంగళూరులో ఉన్న సామ్‌సంగ్‌ ఒపేరా హౌస్‌ వంటివి చూసే అవకాశం దక్కుతుంది.
*  టాప్‌ 10 బృందాలకు తమ ఐడియా ప్రొటోటైప్‌, ఆచరణ కోసం ఒక్కో బృందానికీ రూ.లక్ష చొప్పున అందిస్తారు. ఇది ఈ కార్యక్రమంలో రెండో సీజన్‌. గతేడాది దీనికి దేశవ్యాప్తంగా 18 వేల బృందాలు దరఖాస్తు చేసుకున్నాయి. పోటీలో విజయవంతమైన మొదటి రెండు బృందాలు ఇప్పటికే సొంతంగా తమ కంపెనీలను నెలకొల్పాయి! మూడోదీ అదే ప్రక్రియలో ఉంది.
*     ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేయడానికి మే 31 సాయంత్రం 5 గంటలవరకూ గడువు ఉంది.
వెబ్‌సైట్‌: samsung.com/in/solvefortomorrow


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని