బ్యాంకుల్లో సేవలకు సాంకేతిక శిక్షణ!

భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ ....

Published : 12 May 2020 00:13 IST

బ్యాంకింగ్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా

ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని వేగంగా వినియోగదారులకు సేవలందించడానికి ప్రయత్నించే రంగాల్లో బ్యాంకింగ్‌ ముందు వరుసలో ఉంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ ఒక సంస్థను ఏర్పాటు చేసి పీజీ డిప్లొమా కోర్సునూ నిర్వహిస్తోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిపుణులను సిద్ధం చేస్తోంది.

భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) సంస్థ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (పీజీడీబీటీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సులో చేరినవారు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అవసరమైన సాంకేతికాంశాలపై నాణ్యమైన శిక్షణ పొందవచ్ఛు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ల ద్వారా ఉద్యోగాన్నీ అందుకోవచ్చు.

ఇప్పుడు టెక్నాలజీ వినియోగం అన్ని రంగాలకూ విస్తరించింది. బ్యాంకింగ్‌పై ఆ ప్రభావం మరీ ఎక్కువ. నాణ్యమైన సేవలు అందించడానికీ, సమర్థంగా వ్యాపారాన్ని నిర్వహించడానికీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సమర్థ నిర్వహణలో టెక్నాలజీ అవసరాన్ని ఆర్‌బీఐ గుర్తించింది. ఈ దిశగా 1996లో ఐడీఆర్‌బీటీని హైదరాబాద్‌లో మాసాబ్‌ట్యాంకు ఎన్‌ఎండీసీ సమీపంలో నెలకొల్పింది. ఈ సంస్థ భారతీయ బ్యాంకులు, ఆర్థిక విభాగాలకు అవసరమైన టెక్నాలజీని అందించడంతోపాటు ఆ రంగాలకు అవసరమైన సాంకేతికాంశాలపై పరిశోధనలు చేపడుతుంది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడం, బ్యాంకులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడం, అవి లాభదాయకంగా మారడానికి టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో సమర్థ మానవ వనరులను వృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో భాగంగా బ్యాంకింగ్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సును రూపొందించింది. దీన్ని 2016 నుంచి అందిస్తున్నారు. ప్రస్తుతం అయిదో బ్యాచ్‌లో చేరడానికి ప్రకటన వెలువడింది.

మొత్తం సీట్లు: 40. వీటిలో 10 స్పాన్సర్ఢ్‌ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేటాయించారు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీటెక్‌ లేదా ఏదైనా సబ్జెక్ట్‌లో ఫస్ట్‌ క్లాస్‌తో పీజీ. అయితే వీరు 10+2+4 విధానంలో చదివుండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు గేట్‌, క్యాట్‌, జీమ్యాట్‌, జీఆర్‌ఈ, సీమ్యాట్‌, గ్జాట్‌, మ్యాట్‌, ఆత్మా వీటిలో ఏదో ఒక స్కోర్‌ తప్పనిసరి.

ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సులోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి జులై 1 నుంచి తరగతులు మొదలవుతాయి. కోర్సు ఫీజు వసతితో కలిపి రూ.5 లక్షలు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 31

టెక్నాలజీ నిపుణులుగా..!

కోర్సును ఫుల్‌ టైమ్‌ విధానంలో ఏడాది వ్యవధితో అందిస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక విజ్ఞాన వినియోగం, సమన్వయం, నిర్వహణల గురించి తెలియజేస్తారు. మారుతున్న సాంకేతికతను బ్యాంకింగ్‌ రంగానికి ఎలా అనువర్తించాలో విద్యార్థులకు నేర్పుతారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీకి సంబంధించి శిక్షణ ఇచ్చి నిపుణులుగా రూపొందిస్తారు. భారతీయ బ్యాంకింగ్‌, ఆర్థిక విభాగాలు సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండే విధంగా ట్రెయినింగ్‌ ఇస్తారు. తాజా టెక్నాలజీలను అనువర్తిస్తారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడతారు. కోర్సులో ప్రాక్టికల్‌ లర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం దేశీయ, విదేశీ బ్యాంకులు ఉపయోగిస్తున్న టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తారు. కోర్సు 3 నెలలకు ఒక టర్మ్‌ చొప్పున 4 టర్మ్‌ల్లో ఉంటుంది. ఇందులో భాగంగా లెక్చర్లు, సెమినార్లతోపాటు ఐటీ నిపుణులతో ఇంటరాక్టివ్‌ సెషన్లు ఉంటాయి. సీనియర్‌ బ్యాంకర్లు, సంస్థకు చెందిన రిసెర్చ్‌ సెంటర్లు ఇందులో భాగమవుతాయి. ఎనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ బ్యాంకింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, పేమెంట్‌ సిస్టమ్‌ మొదలైన వాటిపై విస్తృత స్థాయిలో శిక్షణ ఇస్తారు. చివరి టర్మ్‌ ప్రాజెక్ట్‌ వర్క్‌కు కేటాయించారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ప్రదానం చేస్తారు. కోర్సు చివరలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ, బంధన్‌, ఐడీబీఐ, కరూర్‌ వైశ్య, ఫెడరల్‌, కొటాక్‌, సౌత్‌ ఇండియా, ఎన్‌పీసీఐ తదితర సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి.

వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in/PGDBT-SITE/pgdbt-index.html


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని