ఇంటర్‌లో మంచి మార్కులు వస్తే..!

ఆర్థిక స్తోమత లేని వాళ్లు డిగ్రీ.. పీజీ కోర్సులు చేసేటప్పుడు రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడకుండా కేంద్ర మానవ వనరుల విభాగం ...

Published : 05 Sep 2019 00:34 IST

సెంట్రల్‌ సెక్టార్‌ స్కాలర్‌షిప్‌లు

ఆర్థిక స్తోమత లేని వాళ్లు డిగ్రీ.. పీజీ కోర్సులు చేసేటప్పుడు రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడకుండా కేంద్ర మానవ వనరుల విభాగం 82 వేల స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. వీటిలో సగం విద్యార్థినులకు ప్రత్యేకం.

ఇంటర్‌లో మంచి మార్కులు సాధించారా? ప్రస్తుతం ఏదైనా డిగ్రీ/ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులు లేదా బీటెక్‌/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/ఏజీబీఎస్‌సీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నారా? అయితే మీ కోసమే 82 వేల స్కాలర్‌షిప్పులు ఎదురుచూస్తున్నాయి! యూజీ నుంచి పీజీ వరకు అయిదేళ్లపాటు ఇవి అందుతాయి. వీటికి ఎంపికైనవారు ఏటా రూ.10,000 చొప్పున మొదటి మూడేళ్లూ, రూ.20,000 చొప్పున తర్వాతి రెండేళ్లూ అందుకోవచ్ఛు

కేంద్ర మానవ వనరుల విభాగానికి చెందిన ఉన్నతవిద్యాశాఖ ఈ సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ను అమలు చేస్తోంది. దీనికి దరఖాస్తు చేయాలంటే ఇంటర్మీడియట్‌ లేదా ప్లస్‌ 2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. రెగ్యులర్‌ విధానంలో చదివినవారే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. ఏదైనా ఇతర స్కాలర్‌షిప్‌ పొంది ఉంటే ఈ పథకానికి అనర్హులు. ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్‌ అందుకునేవారికీ ఈ పథకం వర్తించదు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఏజీబీఎస్‌సీ లేదా మరేదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు దక్కుతాయి. ప్రస్తుతం ఏదైనా యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు

ఎవరికి ఎన్ని?

రాష్ట్రాల్లో ఉన్న 18-25 ఏళ్ల వయసు జనాభా ఆధారంగా స్కాలర్‌షిప్‌లు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ ద్వారా ప్లస్‌ 2 చదివినవారికి 5413, ఐసీఎస్‌ఈ విద్యార్థులకు 577 స్కాలర్‌షిప్‌లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ద్వారా చదువుకున్న విద్యార్థులకు 3527, తెలంగాణ ఇంటర్‌ బోర్డు విద్యార్థులకు 2570 కేటాయించారు. వీటిని సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ కోర్సులవారీగా 3:2:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం దక్కుతాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 31

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in

ఎంపిక ఎలా?

ఇంటర్‌ మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం వీటిని అందిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 82,000 మంది దీని ద్వారా లబ్ధి పొందవచ్ఛు వీటిలో 41,000 అమ్మాయిలకు, 41,000 అబ్బాయిలకు కేటాయించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఉన్నత చదువుల విషయంలో ఆర్థికంగా తోడ్పడటానికి ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. బీటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.10,000 చొప్పున మొదటి మూడేళ్లు చెల్లిస్తారు. పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ.20,000 రెండేళ్లపాటు అందిస్తారు. ఎంపికైనవారు తర్వాతి ఏడాదిలోనూ ప్రోత్సాహకాలు పొందడానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం పొందడం తప్పనిసరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని