ఆ సర్టిఫికెట్లు చెల్లవా?

తెలంగాణలోని ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రంలో చదివాను. ఇక్కడ వందకు పైగా ఇలాంటి కేంద్రాలు నడిపించారు. ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్లో ఆ సర్టిఫికెట్లు చెల్లవంటున్నారు. పరిష్కారం ఏమిటి?

Updated : 21 Mar 2023 00:26 IST

తెలంగాణలోని ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రంలో చదివాను. ఇక్కడ వందకు పైగా ఇలాంటి కేంద్రాలు నడిపించారు. ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్లో ఆ సర్టిఫికెట్లు చెల్లవంటున్నారు. పరిష్కారం ఏమిటి?

విజయ్‌

నిబంధనల ప్రకారం, ఏ యూనివర్సిటీ అయినా యూజీసీకి చెందిన డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) జారీ చేసే నిర్దేశాలకు లోబడి దూరవిద్య కోర్సులను నిర్వహించాలి. ఈ బ్యూరో నియమావళి ప్రకారం- ఏ యూనివర్సిటీ అయినా దాని భౌగోళిక పరిధిలోనే స్టడీ సెంటర్‌లను నిర్వహించాలి. తదనుగుణంగా వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు సంబంధించిన స్టడీ సెంటర్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో  క్రమంగా మూసివేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్‌లను 2020 నుంచీ మూసివేసింది. 2013లో యూజీసీ పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా యూనివర్సిటీలు/ డీమ్డ్‌ టుబి యూనివర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల చట్టబద్ధతపై స్పష్టతనిచ్చింది. ఇదే విషయంపై గతంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు..  యూనివర్సిటీలు ఇచ్చే దూరవిద్య డిగ్రీలు యూజీసీ నిబంధనలకు లోబడే ఉండాలంటూ తీర్పులిచ్చాయి. ఈ విషయంపై కోర్టు తీర్పుల గురించి మరిన్ని వివరాలకోసం ‘ఇండియన్‌ కానూన్‌’ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2013 నుంచి 2020 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్‌యూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ స్టడీ సెంటర్‌లో చదివి, డిగ్రీ పొందినవారి సర్టిఫికెట్‌లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో చెల్లుబాటు గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు యూజీసీని కోరుతూ లేఖలు రాశాయి. నిర్ణయం వచ్చేవరకు వేచి ఉండకుండా అవకాశం ఉంటే మరో డిగ్రీని యూజీసీ డెబ్‌ నిబంధనలను పూర్తిగా అమలుచేస్తున్న యూనివర్సిటీల దూరవిద్య  ద్వారా చేసే ప్రయత్నం చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని