త్వరగా ఉద్యోగం సంపాదించాలంటే..?

ఐదు సంవత్సరాల కిందట బీఎస్సీ (కంప్యూటర్స్‌) పాసయ్యాను. ఈ ఏడాది ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ రాయొచ్చా? ఇప్పుడు ఏ కోర్సు చేస్తే త్వరగా ఉద్యోగం సంపాదించవచ్చు?

Published : 22 Mar 2023 00:20 IST

ఐదు సంవత్సరాల కిందట బీఎస్సీ (కంప్యూటర్స్‌) పాసయ్యాను. ఈ ఏడాది ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ రాయొచ్చా? ఇప్పుడు ఏ కోర్సు చేస్తే త్వరగా ఉద్యోగం సంపాదించవచ్చు?

టి.సునీల్‌కుమార్‌

న్‌సీహెచ్‌ఎం- జేఈఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌)లో మెరుగైన ర్యాంకు సాధించినవారికి  బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)లో ప్రవేశం లభిస్తుంది. ఈ  కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సంవత్సరానికి ఒకసారి ఇంగ్లిష్‌/హిందీ మీడియాల్లో నిర్వహిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్‌. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం ఈ కోర్సులో చేరడానికి గరిష్ట వయః పరిమితి లేదు.

ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈలో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌లో 30 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌లో 30 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. మీకు హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగంపై ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ఈ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ సరళి ప్రకారం బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు బీఎస్సీ (కంప్యూటర్స్‌) కోర్సు పూర్తిచేసి ఐదేళ్లు అయింది కాబట్టి, డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ సబ్జెక్టులను మరొక్కసారి పూర్తిగా చదివి, ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) / ఎమ్మెస్సీ (డేటా సైన్స్‌) /ఎంసీఏ లాంటి పీజీ కోర్సులు చేయొచ్చు. మీకు ఎంబీఏ మీద ఆసక్తి ఉంటే ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) గురించీ ఆలోచించండి. ముందుగా మీరు ‘ఆర్‌’, ‘పైతాన్‌’ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై గట్టి పట్టు సాధించండి. ఆ తరువాత ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లను ప్రైవేటుగా నేర్చుకొని మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని