ఈ మార్కుల శాతంతో అడ్మిషన్‌ దొరుకుతుందా?

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2009లో 62.89 శాతం మార్కులతో పూర్తిచేశాను. బీహెచ్‌ఈఎల్‌లో పదేళ్లుగా పనిచేస్తున్నాను.

Updated : 02 May 2023 04:02 IST

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2009లో 62.89 శాతం మార్కులతో పూర్తిచేశాను. బీహెచ్‌ఈఎల్‌లో పదేళ్లుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు యూరప్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ చేద్దామంటే తక్కువ ఉత్తీర్ణత శాతం వల్ల పబ్లిక్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ దొరుకుతుందా? 36 సంవత్సరాల ఈ వయసులో నా నిర్ణయం సరైనదేనా?

జి.అరుణ్‌కుమార్‌

* 36 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ చేయాలనుకొంటున్నందుకు అభినందనలు. జర్మనీలో మాస్టర్స్‌ చేయడానికి వయః పరిమితి లేదు. మీరు ఎంచుకొన్న కోర్సు/ యూనివర్సిటీలకు అవసరమైన పరీక్షలు (జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/టోఫెల్‌/ఐఈఎల్‌ఈఎస్‌) రాసి, ఆయా యూనివర్సిటీలు నిర్దేశించిన కనిష్ఠ స్కోర్లను పొందాక దరఖాస్తు చేయాలి. సాధారణంగా జర్మనీలో చాలా పబ్లిక్‌ యూనివర్సిటీలు డిగ్రీలో కనీసం 70% మార్కులు ఉన్నవారికే పీజీలో ప్రవేశం కల్పిస్తున్నాయి. మీ ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌ డిగ్రీతో, అతి తక్కువ యూనివర్సిటీల్లో మాత్రమే పీజీ చదవడానికి అర్హులవుతారు. డిగ్రీలో తక్కువ మార్కులు ఉన్నందున పీజీలో ప్రవేశం పొందినా స్కాలర్‌షిప్‌/ ఫెలోషిప్‌ అవకాశాలు తక్కువే. చాలా అంతర్జాతీయ యూనివర్సిటీలు డిగ్రీ/ అర్హత పరీక్షలో పొందిన మార్కులతో పాటు రిఫరెన్స్‌ లెటర్లు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, వివరణాత్మక బయోడేటా, ఉద్యోగానుభవం లాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకొంటాయి. యూనివర్సిటీలో ప్రవేశం లభించిన తరువాత కూడా కొన్ని సందర్భాల్లో వయసు ఎక్కువగా ఉన్నందున వీసా లభించకపోయే అవకాశం ఉంది. కానీ రిస్క్‌ తీసుకొని ప్రయత్నం చేస్తే మీ కలను నిజం చేసుకోవచ్చు. ఒకవేళ జర్మనీలో చదవడం సాధ్యం కాకపోతే మరేదైనా దేశంలో అయినా పీజీ చేసే ప్రయత్నం చేయండి. ఈ వయసులో మాస్టర్స్‌ చదవడం సరైన నిర్ణయమేనా అనేది మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలను బట్టి ఆలోచించండి. పీజీ చదివాక జర్మనీలో స్థిరపడతారా, మరేదైనా దేశానికి వెళ్తారా, మళ్ళీ ఇక్కడికే వస్తారా, ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్తారా, ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్తారా అనే అంశాలతో పాటు, మీ స్వల్పకాలిక/ దీర్ఘకాలిక ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని