దక్షిణాసియా వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ

జ్ఞానానికి హద్దులు లేవని చాటి చెప్పడానికి ఎనిమిది దేశాలు కలిసి దక్షిణాసియా విశ్వవిద్యాలయాన్ని దిల్లీలో నెలకొల్పాయి. ఇది ఒక అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార ...

Updated : 21 Apr 2022 05:31 IST

జ్ఞానానికి హద్దులు లేవని చాటి చెప్పడానికి ఎనిమిది దేశాలు కలిసి దక్షిణాసియా విశ్వవిద్యాలయాన్ని దిల్లీలో నెలకొల్పాయి. ఇది ఒక అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం పేరుతో అప్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు ఈ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాయి. 2010 నుంచి ఈ సంస్థలో అకడమిక్‌ కోర్సులు మొదలయ్యాయి. వీటిని పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు. ఇందులో చదవడానికి 8 భాగస్వామ్య దేశాల విద్యార్థులకూ అనుమతిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు..

దిల్లీలోని చాణక్యపురిలో అక్బర్‌ భవన్‌ క్యాంపస్‌లో ఉన్న సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీ కోసం దక్షిణ దిల్లీలో వంద ఎకరాల విస్తీర్ణంలో కొత్త ప్రాంగణం తయారవుతోంది. ఇక్కడ అధ్యాపక- విద్యార్థుల నిష్పత్తి సుమారు 1:6గా ఉంది. మెరిట్‌ విద్యార్థులకూ, ఆర్థిక అవసరాలు ఉన్నవారికీ స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. విద్యార్థులు పార్ట్‌ టైం విధానంలో పనిచేయడానికి క్యాంపస్‌ ఉద్యోగాలూ ఉంటాయి. ఇక్కడ చేరినవారికి విదేశీ విద్యార్థులతో కలిసి చదువుకునే అవకాశం లభిస్తుంది. వసతినీ కల్పిస్తారు. ఇప్పటికే డిగ్రీ పూర్తయినవారూ, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ పీజీ, పీహెచ్‌డీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఇవీ కోర్సులు

*  పీజీ: ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, అప్లయిడ్‌ మ్యాథమేటిక్స్‌, సోషియాలజీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ఎల్‌ఎల్‌ఎం కోర్సులను అందిస్తున్నారు. ఒక్కో విభాగంలోనూ 30 చొప్పున సీట్లున్నాయి. వీటిలో ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం అంటే 15 చొప్పున సీట్లు భారతీయ విద్యార్థులకు దక్కుతాయి. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో పీజీలోకి అవకాశం కల్పిస్తారు.

అర్హత: సంబంధిత లేదా అనుబంధ సబ్జెక్టులను యూజీలో చదివివుండాలి. యూజీలో ఆ సబ్జెక్టును బట్టి 55/50 శాతం మార్కులు సాధించాలి. సోషియాలజీ, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ సబ్జెక్టులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది.

పీహెచ్‌డీ: పీజీలో ఉన్న సబ్జెక్టుల నుంచే పీహెచ్‌డీనీ అందిస్తున్నారు. ఒక్కో విభాగంలోనూ 6 చొప్పున సీట్లు ఉన్నాయి. వీటిలో సబ్జెక్టులవారీ 50 శాతం అంటే 3 సీట్లు భారతీయ విద్యార్థులకు చెందుతాయి. సంబంధిత/ అనుబంధ విభాగాల్లో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసుకున్నవారు పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కటాఫ్‌ కంటే ఎక్కువ మార్కులు పొందినవారి జాబితా నుంచి ఒక్కో సీటుకు సీటుకు 5 మందికి చొప్పున ఇంటర్వ్యూకు పిలుస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో విడిగా కనీసం 50 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. తుది ఎంపికలో పరీక్ష, ఇంటర్వ్యూకు 50 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది.

పీజీ పరీక్ష  

రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. సంబంధిత సబ్జెక్టులవారీగా ఇది ఉంటుంది. అన్ని విభాగాలకూ పరీక్ష వ్యవధి 2 గంటలు.

* మ్యాథ్స్‌ సబ్జెక్టునే తీసుకుంటే ఇందులో 50 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి.

* కంప్యూటర్‌ సైన్స్‌ అయితే రెండు విభాగాల్లో 80 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌-ఎలో 20, పార్ట్‌- బిలో 60 ఉంటాయి.

* బయోటెక్నాలజీకి పార్ట్‌-ఎలో 30 ప్రశ్నలు ఇంటర్మీడియట్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి వస్తాయి. పార్ట్‌-బిలో వంద ప్రశ్నలు బయాలజీ, అనుబంధ విభాగాల నుంచి అడుగుతారు. అయితే ఈ వందలో ఏవైనా 70 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే సరిపోతుంది.

* ఎకనామిక్స్‌లో 40 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌కు సంబంధించి దక్షిణ ఆసియా, ప్రపంచంపై మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు వస్తాయి.

* సోషియాలజీలోనూ 2 సెక్షన్ల నుంచి 50 ప్రశ్నలు వస్తాయి.

* ఎల్‌ఎల్‌ఎం ప్రశ్నపత్రం ఎల్‌ఎల్‌బీ సిలబస్‌ నుంచి ఉంటుంది. రెండు విభాగాల్లో వంద ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌- ఎలో 20 ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్‌, పొలిటికల్‌ సైన్స్‌, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌, సివిక్స్‌ల నుంచి ఉంటాయి. పార్ట్‌- బిలో 80 ప్రశ్నలు ఎల్‌ఎల్‌బీ సిలబస్‌ నుంచి వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి.

దాదాపు అన్ని పేపర్లలోనూ తప్పుగా గుర్తించిన జవాబుకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో పావు శాతం తగ్గిస్తారు. ఈ ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ సిలబస్‌ నుంచే వస్తాయి. అభ్యర్థులకు అవగాహన కోసం సబ్జెక్టులవారీ మాదిరి ప్రశ్నలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. సిలబస్‌ వివరాలూ పేర్కొన్నారు. అందులో పేర్కొన్న అంశాల ప్రకారం డిగ్రీ పాఠ్యపుస్తకాలను బాగా చదువుకుంటే సరిపోతుంది. సంబంధిత సబ్జెక్టుల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు సన్నద్ధతలో ఉపయోగపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని