దేశానికి శాసనకర్తలు!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం సక్రమంగా, సంతృప్తికరంగా కార్యనిర్వాహక విధులను నిర్వర్తించేందుకు కొన్ని శాసనాలు అవసరం. వాటిని పార్లమెంటు సభ్యులు రూపొందిస్తారు. దేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆ శాసనాలను నిర్మించే ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నికవుతారు? వారికి ఉండాల్సిన అర్హతలు, ఇతర అన్ని రకాల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.  

Published : 30 Jun 2022 01:48 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం సక్రమంగా, సంతృప్తికరంగా కార్యనిర్వాహక విధులను నిర్వర్తించేందుకు కొన్ని శాసనాలు అవసరం. వాటిని పార్లమెంటు సభ్యులు రూపొందిస్తారు. దేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆ శాసనాలను నిర్మించే ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నికవుతారు? వారికి ఉండాల్సిన అర్హతలు, ఇతర అన్ని రకాల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.


పార్లమెంటు సభ్యులు

భారతదేశంలో అత్యున్నత శాసననిర్మాణ వ్యవస్థ పార్లమెంటు. ఇందులో లోక్‌సభకు ప్రత్యక్షంగా, రాజ్యసభకు పరోక్షంగా ఎన్నికయ్యే వారే పార్లమెంటు సభ్యులు (ఎంపీలు). శాసననిర్మాణ వ్యవస్థలో వీరంతా కీలక వ్యక్తులు. పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు, షరతులను రాజ్యాంగం నిర్దేశించింది. ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం, వారికి ఉండే ప్రత్యేక రక్షణలు, అనర్హతకు గురయ్యే సందర్భాలను వివరంగా పేర్కొంది.


అర్హతలు

* భారతీయ పౌరసత్వం ఉండాలి.
* దివాలా తీసి ఉండకూడదు.
* నేరారోపణ రుజువై ఉండకూడదు (క్రిమినల్‌ కేసుల్లో).
* దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* మానసిక సమతౌల్యత కలిగి ఉండాలి.
* ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.
* లోక్‌సభ సభ్యత్వానికి 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యత్వానికి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
షరతులు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన నామినేషన్‌ పత్రంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా (ధరావతు) రూ.25 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి.
* అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా, ఒక సెక్యూరిటీ డిపాజిట్‌ సరిపోతుంది.
* ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం పోలై, చెల్లుబాటు అయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు రాని అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కోల్పోతారు.
* నామినేషన్‌ పత్రంతో పాటు అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, వైవాహిక వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలి.
ప్రమాణస్వీకారం: పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎదుట లేదా రాష్ట్రపతి ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి సమక్షంలో  రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లోని ఆర్టికల్‌ 99 ప్రకారం ‘భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్ఠలతో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను సంరక్షిస్తానని, తాను చేపట్టిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తానని’ ప్రమాణస్వీకారం చేయాలి. పదవీ ప్రమాణస్వీకారం చేయకుండా సభాకార్యక్రమాల్లో పాల్గొనే పార్లమెంటు సభ్యుడికి రోజుకు రూ.500 జరిమానా విధిస్తారు.
రాజీనామా: పార్లమెంటు సభ్యుల రాజీనామా గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(3)(b) పేర్కొంటుంది. సభ్యులు తమ రాజీనామా పత్రాలను నిర్ణీత ప్రొఫార్మాలో సంబంధిత సభాధ్యక్షులకు పంపాలి. సభ్యులు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని సభాధ్యక్షులు ధ్రువీకరించుకున్న తర్వాత అవి ఆమోదం పొందుతాయి.
జీతభత్యాలు: ఆర్టికల్‌ 106 ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 2019లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం సభ్యుల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి.
* నెలకు వేతనం - రూ.1,00,000
* నియోజకవర్గ అలవెన్స్‌ - రూ.70,000
* ఆఫీసు ఖర్చులు - రూ.60,000
* దినసరి అలవెన్స్‌ - రూ.2,000
* ఉచిత నివాసం, ఉచిత రవాణా, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. పదవీ విరమణ తర్వాత నెలకు రూ.25,000 పెన్షన్‌ లభిస్తుంది.
* వీరి జీతభత్యాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రావు.


సమావేశాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 85 ప్రకారం పార్లమెంటు సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. రెండు సమావేశాల మధ్య కాలం 6 నెలలకు మించకూడదు ప్రత్యేక పరిస్థితుల్లో, అవసరమైనప్పుడు ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో పార్లమెంటు సమావేశాలను సాంప్రదాయికంగా సంవత్సరానికి మూడు సార్లు నిర్వహిస్తున్నారు.
* బడ్జెట్‌ సమావేశాలు: ఫిబ్రవరి - మార్చి
* వర్షాకాల సమావేశాలు : జులై - ఆగస్టు
* శీతాకాల సమావేశాలు: నవంబరు - డిసెంబరు
ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హత: ఆర్టికల్‌ 101 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా కొనసాగడాన్ని నిషేధించారు. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు ఒక సభలో సభ్యత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాల్సి ఉంటుంది.
* ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటులోని ఉభయసభలకు ఎన్నికైతే అతడు 10 రోజుల్లోగా ఏ సభలో కొనసాగాలని కోరుకుంటున్నాడో తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే అతడు రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు.  
* ఒక వ్యక్తి ఒకే సభలో రెండు సీట్లకు ఎన్నికైతే ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపరిమితిలోగా ఒకదాన్ని వదులుకోవాలి. లేదంటే రెండు సీట్ల సభ్యత్వాన్నీ కోల్పోతాడు.
* ప్రస్తుతం ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు ఎన్నికయితే అతడు మొదటి సభలో సభ్యత్వాన్ని కోల్పోతాడు.
* ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు రెండింటికీ ఎన్నికైతే 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేకపోతే అతడు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు.
గైర్హాజరు: పార్లమెంటు సభ్యుడు సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు గైర్హాజరైతే ్బత్జి(’-్మ్శ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(4) ప్రకారం అతడు సభలో సభ్యత్వాన్ని కోల్పోతాడు. 60 రోజుల కాలవ్యవధిని లెక్కించడంలో సభ నిరవధికంగా వాయిదా పడిన కాలాన్ని లేదా వరుసగా నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా పడిన రోజులను పరిగణనలోకి తీసుకోకూడదు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన ఆధారంగా అనర్హత: మన దేశంలో చట్టసభల సభ్యులలో నైతికత, బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు మరో పార్టీలోకి మారితే అతడు సభలో సభ్యత్వాన్ని ఏ విధంగా కోల్పోతాడో నిర్దేశించారు. చట్టసభల సభ్యుల అనర్హతలను నిర్ణయించే అధికారం లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో ఛైర్మన్‌కు ఉంటుంది.


పదవిని కోల్పోయే సందర్భాలు

* ఏ రాజకీయ పార్టీ నుంచి ఎన్నికవుతారో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసినప్పుడు.  
* రాజకీయ పార్టీ జారీ చేసిన ‘విప్‌’నకు వ్యతిరేకంగా సభలో ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరైతే.
* స్వతంత్రంగా (ఇండిపెండెంట్‌) గెలిచిన సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు.
* పార్ల మెంటుకి నామినేట్‌ అయిన సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరితే.
* అనర్హతకు గురయ్యే ఇతర సందర్భాలు: పార్లమెంటు సభ్యుడు కింది సందర్భాల్లో సభలో సభ్యత్వం కోల్పోయి అనర్హతకు గురవుతాడు.
* సభ నుంచి సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు.
* సభ్యుడి ఎన్నిక చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్చు ఇచ్చినప్పుడు.      
* సభ్యుడు రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైనప్పుడు.  సభ్యుడు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైనప్పుడు.


ప్రత్యేక హక్కులు, రక్షణలు

* పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 105లో పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. వీరు ఓటు చేసిన విధానం గురించి న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలులేదు.
* పార్లమెంటు సమావేశాలకు 40 రోజుల ముందు లేదా సమావేశం తర్వాత 40 రోజుల వరకు లేదా సమావేశాలు జరుగుతున్నప్పుడు సభాధ్యక్షుల అనుమతి లేకుండా సభ్యులను అరెస్ట్‌ చేయకూడదు.
* సభా సమావేశాలు జరుగుతున్నప్పుడు సభాధ్యక్షుడి అనుమతి లేకుండా ఏ సభ్యుడిని న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి హాజరు కావాలని న్యాయస్థానాలు ఆదేశించలేవు.


అనర్హతలు

పార్లమెంటు సభ్యులు అనర్హతకు గురై, సభ్యత్వాన్ని కోల్పోయే సందర్భాలను ఆర్టికల్‌ 102 వివరిస్తుంది.
* లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టడం.
* మానసిక స్థితి సక్రమంగా లేదని న్యాయస్థానం ప్రకటించడం.
* దివాలా తీశాడని న్యాయస్థానం ధ్రువీకరించడం.
* ఎన్నికల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడం.
* ఎన్నికల వ్యయ పరిమితికి సంబంధించిన వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమవడం.
* భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోవడం.
* ఇతర దేశాలకు విధేయుడై ఉంటానని ప్రకటించడం.
* వరకట్న నిషేధ చట్టం, అస్పృశ్యత నేరనిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురవడం.
రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఒక పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు.


https://tinyurl.com/3t9m9zu7


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సబ్జెక్టు చదివేటప్పుడు ఒక పెన్సిల్‌ తీసుకొని ముఖ్యమైన పేర్లు, తేదీలు, నిర్వచనాలు,   లాజిక్‌ల వంటి వాటిని అండర్‌లైన్‌ చేసుకుంటే రివిజన్‌ తేలికగా, వేగంగా పూర్తవుతుంది. ప్రాధాన్యాన్ని గుర్తించకుండా ప్రతిదాన్ని మార్క్‌ చేస్తే, ప్రయోజనానికి బదులు నష్టం జరిగే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని