స్వతంత్రంగా.. సంస్కృతులకు సంరక్షణగా!

తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతల్లో ప్రధానంగా పేర్కొనదగినవి సంస్థానాలు. కుతుబ్‌షాహీలు, దిల్లీ సుల్తానులు, అసఫ్‌జాహీల పాలనకు ముందు నుంచే అవి పాలన సాగిస్తున్నాయి. నిజాంల రాజ్యంలో భాగమైనప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించాయి.

Published : 18 Jul 2022 03:12 IST

తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర

తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతల్లో ప్రధానంగా పేర్కొనదగినవి సంస్థానాలు. కుతుబ్‌షాహీలు, దిల్లీ సుల్తానులు, అసఫ్‌జాహీల పాలనకు ముందు నుంచే అవి పాలన సాగిస్తున్నాయి. నిజాంల రాజ్యంలో భాగమైనప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించాయి. స్వభాషా సంస్కృతులను చెక్కుచెదరకుండా కాపాడాయి. సంస్థానాధీశులు కొందరు ప్రజలకు అనుకూలమైన పాలన సాగించి చరిత్రలో నిలిచిపోయారు. కవులను విశేషంగా పోషించారు. భాషాభివృద్ధికి దోహదపడ్డారు. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఆ వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.


సంస్థానాలు

హైదరాబాద్‌ రాజ్యంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. అందులో 14 తెలంగాణలో ఉన్నాయి. వాటిలోని కొన్ని కాకతీయుల కాలంలో, మరికొన్ని కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో ఆవిర్భవించాయి. ఈ సంస్థానాల హోదా జాగీర్ల కంటే ఎక్కువ. ఎందుకంటే జాగీర్లు నిజాం నవాబులు ఇచ్చినవి. కానీ సంస్థానాలు అసఫ్‌జాహీలు రాజ్యాధికారానికి రాక పూర్వం నుంచే ఉన్నాయి. అయితే అసఫ్‌జాహీలు వారి స్వతంత్ర ప్రతిపత్తిని అంగీకరించి తమ రాజ్యంలో భాగంగా ఉండమని కోరిన మేరకు సంస్థానాధీశులతో ఒప్పందం జరిగింది. వాటిలో కొన్ని పాలనాధికారం ఉన్న పెద్ద సంస్థానాలుగా ఉండేవి.


గద్వాల

రాయచూరు జిల్లా నుంచి విడిపోయి మొదట ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేరి ఇప్పుడు జోగులాంబ-గద్వాల జిల్లాలో ఉన్న గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైంది. ఈ సంస్థానంలో అప్పట్లో 360 గ్రామాలుండేవి. గద, వాలు ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించినవారు నిర్మించిన నగరానికి గదవాలు నగరమని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా గద్వాలగా మారింది. ఈ సంస్థానానికి తూర్పున అలంపురం తాలుకా, పడమర రాయచూరు జిల్లా, ఉత్తర, దక్షిణాలుగా కృష్ణా, తుంగభద్ర నదులు సరిహద్దులుగా ఉండేవి. గద్వాల సంస్థానానికి మూలపురుషుడు పొలనిరెడ్డి. ఆయనకు మరోపేరు బుద్దారెడ్డి. కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుడు 1290లో ఇతడిని పాలకుడిగా నియమించాడు. కర్నూలు నవాబు గద్వాల సంస్థానానికి కప్పం కట్టేవాడు. ఈ పాలకులకు ‘నాడగౌడ’ ‘సర్‌ నాడగౌడ’ అనే బిరుదులుండేవి. మొదట్లో వీరి రాజధాని పూడూరు. కులదైవం చెన్నకేశవస్వామి.

రాజాసోమనాద్రి: ఈయననే సోమభూపాలుడు అని కూడా అంటారు. గద్వాల సంస్థానానికి ఆద్యుడు. ఐజ గ్రామంలో ఒక కోటను, గద్వాల కోటను నిర్మించాడు. ఇతడి కాలం నుంచే పాలకులు ఐజనాడ గౌడులనే పేరు పొందారు. సోమనాద్రి అనంతరం పాలించిన అతడి భార్య లింగమ్మ బీచుపల్లి వద్ద కృష్ణానది మధ్య ఉన్న ఎత్తయిన కొండపై దుర్గ దేవాలయ నిర్మాణం ప్రారంభించింది. అది తిరుమలరావు కాలంలో పూర్తయింది. ఇదే ఆ తర్వాత నిజాంకోటగా ప్రసిద్ధి చెందింది. ఈమె సంగాల, తాండ్రపాటి చెరువులను నిర్మించారు. సోమనాద్రి స్వయంగా కవి. ఆయన జయదేవుడు రాసిన గీతగోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. సోమనాద్రి మనవడు చిన సోమభూపాలుడు కూడా కవే. సోమనాద్రి అనేకమంది కవులను పోషించాడు. ఈయన అష్ట పదులను యక్షగానంగా రూపొందించాడు. ఇతడికి అభినవ భోజుడు అనే బిరుదుండేది. ఇతడి ఆస్థాన కవి పెద్దమందడి వెంకటకృష్ణ ‘నిర్వచన భక్తివిజయం’, ‘మారుతి విలాసం’, ‘గద్వాల సంస్థాన చరిత్ర’, ‘రెడ్డికుల నిర్ణయ చంద్రిక’, ‘కేశవ విలాసం’ గ్రంథాలను రచించాడు. చేట్లూరి నారాయణాచార్యులు అనే కవి ‘ప్రతాపరుద్రీయసారము’ గ్రంథాన్ని రచించాడు. వాడాల శేషాచార్యులు ‘మైథిలీ పరిణయం’ అనే పద్య కావ్యాన్ని, పూలగుమ్మి వెంకటాచార్యులు ‘అంకారావళి’, ‘ఆంధ్ర వ్యాకరణ సూత్రావళి’ అనే గ్రంథాలను రచించారు. గద్వాల సంస్థానం చివరి పాలకురాలు ఆదిలక్ష్మీదేవమ్మ. 1949, సెప్టెంబరు 17న ఈ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో కలిసిపోయింది.


వనపర్తి

సంస్థానం ప్రస్తుత వనపర్తి జిల్లాలో ఉంది. దీని వైశాల్యం 450 చదరపు మైళ్లు. ఇందులో నాడు 124 గ్రామాలు ఉండేవి. ఈ సంస్థానాధీశుల ఇంటిపేరు జనంపల్లివారు. దీనికి మూల పురుషుడు వీరకృష్ణారెడ్డి. ఈయన నూగూరును రాజధానిగా చేసుకుని పాలించడంతో వీరిని నూగూరు సంస్థానాధీశులుగా వ్యవహరించేవారు. ఈ వంశంలో నాలుగో తరం వాడైన వేముడి వెంకట్‌రెడ్డి గొప్పవీరుడు. ఇతడు గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్‌షాకు 1633లో నెల్లూరు, ఉదయగిరి దండయాత్రల్లో సహాయపడి అతడి మెప్పు పొంది మరికొన్ని గ్రామాలను తన సంస్థానంలోకి తెచ్చుకున్నాడు. వెంకట్‌రెడ్డి కుమారుడైన గోపాలరాయలు ఈ సంస్థానాధీశుల్లో ‘బహిరీ’ పొందిన తొలి వ్యక్తి. ఇతడికి అష్టభాషా కవి అనే బిరుదు ఉండేది. ఈయనను అష్టభాషా గోపాలరాయ అని చరిత్రకారులు వ్యవహరించేవారు. శృంగార మంజరీ బాణం (సంస్కృత) గ్రంథాన్ని, రామచంద్రోదయం అనే కావ్యాన్ని రచించాడు. ఈయన దత్తపుత్రుడు మూడో వెంకట్‌రెడ్డి  కూడా సుప్రసిద్ధుడే. ఇతడు దిల్లీ సుల్తానుల నుంచి ‘సవై’ బిరుదు పొందాడు. తన దత్తత తండ్రి పేరున గోపాలపేట సంస్థానాన్ని స్థాపించాడు. నూగూరు సంస్థానంలోని 12 గ్రామాలను అందులో చేర్చి దానికి తన సోదరుడు రంగారెడ్డిని పాలకుడిగా నియమించాడు. మొగలుల అస్తవ్యస్త పరిస్థితిని ఆసరాగా చేసుకుని పన్ను చెల్లించడం ఆపేశాడు. దాంతో మొగల్‌ పాలకులు చేసిన దాడిలో  ఓడిపోయాడు. ఆ అవమానంతో 1711లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి కాలంలో ముద్రించిన నాణేలు నూగూరి సిక్కాలు సంస్థానానికి గొప్ప పేరు తెచ్చాయి. ఈ వంశంలో మొదటి రామకృష్ణారావు కూడా ప్రసిద్ధుడు. ఇతడు 1817లో నిజాం నుంచి ‘రాజ బహద్దూర్‌’ బిరుదు పొందాడు. మరో ముఖ్య పాలకుడు రెండో రాజా రామేశ్వర్‌రావు. ఈ యన వ్యవసాయాభివృద్ధికి చెరువులను తవ్వించాడు.


దోమకొండ

దోమకొండ సంస్థానం ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఉంది. బిక్కనవోలు (నేటి బిక్కనూరు) దానికి అప్పట్లో రాజధానిగా ఉండేది. దోమకొండ సంస్థానానికి మూలపురుషుడు కామినేని కాచారెడ్డి. ఈయన బహమనీ సుల్తాన్‌ అహ్మద్‌షా కాలంలో పాలకుడయ్యాడు. కాచారెడ్డి బిక్కనవోలు నగరాన్ని నిర్మించాడు. క్రీ.శ.1784లో రాజన్న చౌదరి ఈ సంస్థాన పాలకుడై తన రాజధానిని బిక్కనవోలు నుంచి కామారెడ్డి పేటకు మార్చాడు. ఈయన కుమారుడు  రాజేశ్వరరావు తన రాజధానిని దోమకొండకు మార్చాడు. కామినేడు ఈ వంశానికి ఆద్యుడు కాబట్టి ఆయన పేరున వీరిని కామినేని వంశీయులు అన్నారు. కామినేడు కామిరెడ్డిగా పేరొందారు. ఇతడి పేరుమీదే కామారెడ్డి పట్టణం నిర్మితమైంది. వీరి పేర్ల మీద ఎల్లారెడ్డి, మాచారెడ్డి, జంగంపల్లి, కాచారెడ్డి అనే గ్రామాలు నిర్మితమయ్యాయి. ఈ సంస్థాన పాలకుడు రాజా సోమేశ్వర్‌రావు నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ నుంచి ‘బల్వంత్‌’ అనే బిరుదు పొందాడు. ఈ సంస్థానం చివరి పాలకుడు రాజాసోమేశ్వర్‌ రావు. ఇతడి కాలంలోనే  సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది. వీరి పోషణలో కామినేని మల్లారెడ్డి అనే కవి శివధర్మోత్తరం, షట్చక్రవర్తి చరిత్రం, పద్మపురాణం అనే గ్రంథాలు రచించాడు. ఎల్లారెడ్డి అనే కవి భద్రాయురభ్యుదయం, ఉమాపతి అభ్యుదయం అనే గ్రంథాలు రచించాడు. సోమయాజి అనే కవి సూతసంహిత గ్రంథాన్ని రచించాడు. శేషాద్రి రమణ కవులు, పెద్దమందడి వెంకటకృష్ణ కవి సంయుక్తంగా ‘రెడ్డికుల నిర్ణయ చంద్రిక’ గ్రంథాన్ని రచించారు.


జటప్రోలు

టప్రోలు (కొల్లాపూర్‌) సంస్థానం ప్రస్తుత నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఉంది. అప్పట్లో ఈ సంస్థానం వైశాల్యం 191 చదరపు మైళ్లు. దీనిలో 89 గ్రామాలు ఉండేవి. ఈ సంస్థాన పాలకులు పద్మనాయకులు. ఈ వంశానికి మూలపురుషుడు చెవ్విరెడ్డి (బేతాళ నాయకుడు). ఈయనకు 13వ తరం వాడైన మాదానాయుడు జటప్రోలు సంస్థానానికి మూలపురుషుడు.  వీరి ఇంటిపేరు సురభి. ఈ వంశంలో 14వ తరం వాడైన ముల్లానాయకుడు (సురభి మాధవరాయలు) క్రీ.శ.1527లో విజయనగర అలియరామరాయలు నుంచి జటప్రోలు సంస్థానాన్ని కానుకగా పొందాడు. సురభి లక్ష్మణరాయలు తన రాజధానిని క్రీ.శ.1840లో జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చాడు. నాటి నుంచి వీరు కొల్లాపూర్‌ ప్రభువులుగా కీర్తి పొందారు. చివరి పాలకుడైన వెంకట జగన్నాథరావు కాలంలో కొల్లాపూర్‌ సంస్థా నం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది.


పాపన్నపేట

నిజాం రాష్ట్రంలోని ప్రాచీన సంస్థానాల్లో పాపన్నపేట ఒకటి. ఇప్పుడు మెదక్‌ జిల్లాలో ఉంది. ఫిరోజ్‌షా తుగ్లక్‌ దిల్లీ సుల్తాన్‌గా ఉన్న రోజుల్లో ఇది ఏర్పడింది. పాలకుల్లో 12వ తరానికి చెందిన రాణి శంకరమ్మ గొప్ప వీరవనిత. భర్త రాజావెంకట నరసింహారెడ్డి అనంతరం ఈమె బాధ్యతలు చేపట్టింది. నిజాం రాజ్యభాగాలపై దాడులు చేస్తున్న మహారాష్ట్రులను ధైర్యసాహసాలతో ఎదిరించి, జయించి నిజాం మన్ననలు పొందింది. 1948 తర్వాత ఈ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో కలిసిపోయింది.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఒక అధ్యాయం చదవగానే దానికి సంబంధించి ఏదైనా టెస్ట్‌ రాయాలి. కనీసం నమూనా ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. అప్పుడే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.  లేకపోతే మరచిపోయే అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని