అర్ధభాగం.. అయినా.. అసమానం!

జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు శతాబ్దాలుగా తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. పితృస్వామిక సమాజంలో లింగ వివక్ష సహజ పరిణామంగా మారిపోయింది. మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం, సాధికారత ఎండమావులుగా మిగిలిపోయాయి.

Published : 30 Jun 2022 01:48 IST

సామాజిక మినహాయింపు
హక్కులు, సమ్మిళిత విధానాలు

జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు శతాబ్దాలుగా తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. పితృస్వామిక సమాజంలో లింగ వివక్ష సహజ పరిణామంగా మారిపోయింది. మహిళలకు స్వాతంత్య్రం, సమానత్వం, సాధికారత ఎండమావులుగా మిగిలిపోయాయి. ఈ జాడ్యాలను రూపుమాపడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, చర్యలు చేపట్టినా ఆశించినంత ఫలితం అందడం లేదు. ఈ నేపథ్యంలో ‘సామాజిక మినహాయింపు-హక్కులు’ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షల అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.


లింగ ప్రాతిపదికన వెలి

భారతీయ సమాజంలో వివిధ రూపాల్లో వెలి, బహిష్కరణ కనిపిస్తుంది. మన సమాజం పితృస్వామ్యాన్ని అనుసరిస్తోంది. ఇందులో పురుషులకు ఎక్కువ హక్కులు, అవకాశాలు దక్కాయి. దీని నుంచే లింగ అసమానత్వం పుట్టుకొచ్చింది.

వర్గీకరణ: లింగాన్ని ఆంగ్లంలో ‘జెండర్‌’ అని పిలుస్తారు. లింగ వర్గీకరణ ప్రకారం 1) స్త్రీలు 2) పురుషులు 3) విషమ లింగీయులు/మధ్య లింగీయులు ఉన్నారు.

మధ్య లింగీయులను సమాజం విస్మరించింది. వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించలేదు. వారు సమాజంలో వెలికి, బహిష్కరణకు గురయ్యారు. అదేవిధంగా స్త్రీలు సమానత్వం లేకుండా హక్కులు కోల్పోయారు. సమాజంలో పురుషులకు ఇచ్చిన ప్రాధాన్యం స్త్రీలకు, మధ్య లింగీయులకు ఇవ్వలేదు. విషమ లింగీయులకు రక్షణ కల్పించడం, వారి హక్కులను కాపాడటం కోసం 2019లో లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల సంరక్షణ) చట్టం వచ్చింది. మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం అనేక చట్టాలు, విధానాలు రూపొందాయి.

అసమానతలు - మహిళలు
భారతీయ సమాజంలో లింగ అసమానత్వం ఒక ప్రధాన సమస్య. మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా సమాన అవకాశాలు, హక్కులు కల్పించకపోవడమే లింగ అసమానత్వం.

అసమానతకు గురయ్యే అంశాలు:  
భ్రూణ హత్యలు
ఆస్తి హక్కును నిరాకరించడం
గృహహింస
ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం
సమాన వేతనాలను నిరాకరించడం
పురుషాధిక్యత - పితృస్వామ్యం
వరకట్నం
అక్రమ రవాణా
సతీసహగమనం
పునర్వివాహంపై ఆంక్షలు
పని ప్రదేశాల్లో వేధింపులు
తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం

భ్రూణ హత్యలు: మలివేద కాలం నుంచి స్త్రీల పట్ల వివక్ష ప్రారంభమైంది. పురుష సంతానానికి ఇచ్చిన ప్రాధాన్యం స్త్రీ సంతానానికి ఇవ్వలేదు. సాంకేతికత పెరగడంతో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడ పిల్లలను పిండ దశలోనే నిర్మూలిస్తున్నారు. స్త్రీ బీజాలు, పిండాలను చంపేయడం లేదా నాశనం చేయడాన్ని ‘ఫెమిసైడ్‌’ అంటారు. గర్భంలో పెరుగుతున్న పిండంపై లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని నిషేధిస్తూ 1994లో గర్భస్త పూర్వ, పిండ పూర్వ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం తీసుకొచ్చారు. 1980 - 2020 మధ్యకాలంలో సుమారు కోటికి పైగా గర్భస్రావాలు జరిగాయి.

ఆస్తి హక్కును నిరాకరించడం: ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం దాదాపు 39 దేశాల్లో స్త్రీలకు కుటుంబంలో ఉన్న పురుషులతో సమానంగా వారసత్వ ఆస్తి హక్కు లేదు. 2005లో హిందూ వారసత్వ చట్టం - 1956కి సవరణలు చేసి భారతదేశంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. ఈ సవరణ ప్రకారం మహిళలకు పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వపు ఆస్తిలో సోదరులతో సమానంగా వాటా లభిస్తుంది.

గృహహింస: నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (విదిళిత్శీ నివేదికల ప్రకారం మహిళలపై గృహహింస అత్యధికంగా ఉంది. అది 4 రకాలుగా జరుగుతుంది. అవి  భౌతిక హింస, మానసిక హింస, లైంగిక హింస, ఆర్థిక హింస. దీనికి కారణం లింగ అసమానత్వం. మహిళలను ఇలాంటి హింసల నుంచి కాపాడటం కోసం 2005లో గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది.

ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం:  మహిళలను విద్యకు దూరం చేయడం, బయటకు వెళ్లనీయకపోవడం, అవకాశాలకు దూరం చేయడం లాంటి వాటి వల్ల వారు ఆర్థికంగా స్వావలంబన సాధించలేకపోయారు.

అసమాన వేతనాలు: గ్రామాల్లో నేటికీ స్త్రీ, పురుషులకు వేర్వేరు కూలీలు చెల్లిస్తున్నారు. వేతనాల్లో అసమానతలను రూపుమాపడానికి 1948లో కనీస వేతనాల చట్టం, 1976లో సమాన వేతనాల చట్టం తెచ్చారు.

పురుషాధిక్యత - పితృస్వామ్యం: పితృస్వామ్యం కారణంగా స్త్రీలు సమానత్వం కోల్పోయారు. ఉమ్మడి కుటుంబంలో స్త్రీల స్థాయి మరీ దిగజారింది.

వరకట్నం: పురుషుడికి స్త్రీ కట్నం చెల్లించాల్సి రావడం లింగ అసమానత్వానికి దారితీసింది. వరకట్నాన్ని రద్దు చేస్తూ 1961లో వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చారు.

అక్రమ రవాణా: వాణిజ్య ప్రయోజనాల కోసం మహిళలు, బాలికలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎగుమతి/ దిగుమతి లేదా రవాణా చేయడం కూడా లింగ అసమానత్వానికి దారితీసింది. అక్రమ రవాణాను నిషేధిస్తూ 1956లో స్త్రీల అనైతిక అక్రమ రవాణాను అణిచివేసే చట్టం తీసుకొచ్చారు.

సతీసహగమనం: భర్త మరణిస్తే అతడితో పాటు భార్యను చితిలో వేసి చంపేసే ఆచారం మధ్యయుగంలో ఎక్కువగా ఉండేది. రాజపుత్రతెగలో ఇది జౌహార్‌ రూపంలో అమలయ్యేది. రాజా రామ్‌మోహన్‌రాయ్‌ కృషితో 1829లో సతీసహగమన నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది.

పునర్వివాహంపై ఆంక్షలు: భార్య చనిపోతే భర్త పునర్వివాహం చేసుకోవచ్చు.  కానీ భర్త పోతే స్త్రీకి  పునర్వివాహానికి అవకాశం ఇవ్వలేదు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ కృషితో 1856లో ‘హిందూ వితంతు పునర్వివాహ చట్టం’ వచ్చింది.

పని ప్రదేశాల్లో వేధింపులు: పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. వీటిని అరికట్టడానికి 2013లో ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అరికట్టే చట్టం’ వచ్చింది.

రాజకీయాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం:  మహిళా సాధికారతలో భాగంగా 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 14% మాత్రమే.


https://tinyurl.com/4cn2th4t


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని