10తర్వాత.. డిప్లొమాతో దిగ్విజయం!

పదో తరగతి తర్వాత భవిష్యత్తుకు దారిచూపే కోర్సుల్లో డిప్లొమాలు ముఖ్యమైనవి. ఇప్పుడివి ఎంతో వైవిధ్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఎంతో ప్రాధాన్యం పొందుతోన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌, బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ...

Updated : 04 Jul 2022 06:43 IST

పదో తరగతి తర్వాత భవిష్యత్తుకు దారిచూపే కోర్సుల్లో డిప్లొమాలు ముఖ్యమైనవి. ఇప్పుడివి ఎంతో వైవిధ్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఎంతో ప్రాధాన్యం పొందుతోన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌, బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ... డిప్లొమాలో భాగంగా చదువుకోవచ్ఛు ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య మూడింటికీ అనువైనవిగా పాలిటెక్నిక్‌ కోర్సులు గుర్తింపు పొందాయి. అలాగే వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీల్లో రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో ప్రత్యేక డిప్లొమాలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వీటితోపాటు జాతీయ స్థాయిలో ప్రత్యేక విభాగాల్లో డిప్లొమాలు పూర్తిచేసుకోవచ్చు.

సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి ఉండి, తక్కువ వ్యవధిలో జీవితంలో స్థిరపడాలని ఆశించేవాళ్లు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్ఛు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో కొంత పట్టుంటే చదువుల్లో రాణించవచ్ఛు పలు బ్రాంచీల్లో కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి అవకాశాలు ఎక్కువ. అన్ని బ్రాంచీల్లోనూ ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా కోర్సుల్లోకి చేరే అవకాశం పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)తో లభిస్తుంది. పరీక్షలో పదో తరగతి సిలబస్‌లోని మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న పలు డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు పదో తరగతి తర్వాత ఆరేళ్ల వ్యవధితో డిప్లొమా + బీటెక్‌ కోర్సులను నడుపుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు వాటిలోనూ చేరవచ్చు.

ఇవీ కోర్సులు

విస్తృత సంఖ్యలో బ్రాంచీలు ఉండడం డిప్లొమాల ప్రత్యేకత. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకునే అవకాశం దక్కుతుంది. సివిల్‌, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్‌, మెటలర్జికల్‌, కెమికల్‌, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఏపీ, తెలంగాణ పాలిటెక్నిక్‌లు మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి.

ఉద్యోగాలిక్కడ...

డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు విరివిగా ఉంటాయి. వీరికి మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో కొలువులు లభిస్తాయి. రైల్వేల్లో జేఈ పోస్టులకు డిప్లొమాతో పోటీపడవచ్ఛు అలాగే వివిధ కేంద్రీయ సంస్థల్లోనూ జేఈ పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి భర్తీ చేస్తోంది. రాష్ట్ర స్థాయుల్లో విద్యుత్తు పంపిణీ, రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్‌, నీటిపారుదల.. శాఖల్లో డిప్లొమాతో దూసుకుపోవచ్చు.

ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రైవేటు రంగంలో విస్తృతంగా అవకాశాలు అందుతున్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్‌, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ ఫర్మ్‌ల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్ఛు పేరొందిన పాలిటెక్నికల్‌ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. కార్పొరేట్‌ సంస్థలు వీరిని ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. రైల్వేలో లోకో పైలట్‌ ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్ఛు సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు. సివిల్‌ అభ్యర్థులు నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్ఛు కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఎయిర్‌ ఫోర్సులో ఎక్స్‌, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్ఛు దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా, యూఏఈ...తదితర చోట్ల మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.


ఉన్నత విద్య

డిప్లొమా అనంతరం ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని భావించినవాళ్లు ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్ఛు వీరు ఎంసెట్‌, ఐఐటీ-జేఈఈ పరీక్షలూ రాసుకోవచ్ఛు డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవాళ్లు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్ఛు ఇది బీటెక్‌తో సమాన స్థాయి కోర్సు. ఆ తర్వాత ఎంటెక్‌ దిశగానూ అడుగులేయవచ్ఛు లేదా డిప్లొమా అర్హతతోనే బీఎస్సీ, బీఏ...తదితర కోర్సులూ చదువుకోవచ్చు.

ఇటీవల కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (ఏఐ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైనింగ్‌, 3డీ యానిమేషన్‌ గ్రాఫిక్స్‌, యానిమేషన్‌-మల్టీ మీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ...మొదలైన కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన కళాశాలల్లో డిప్లొమాలో భాగంగా అందిస్తున్నారు. పాలీసెట్‌లో చూపిన ప్రతిభతో వీటిలోనూ చేరవచ్ఛు ఇవే కోర్సులను బీఎస్సీ/బీటెక్‌ స్థాయుల్లో చదువుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని