డిప్లొమా ఇంజినీర్లకు నూతన అవకాశాలు

పాలిటెక్నిక్‌ (ఈఈఈ) తర్వాత ఉన్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలను వివరించగలరు. పాలిటెక్నిక్‌ తర్వాత ఏ పై చదువులు చదివితే మంచి ఉద్యోగావకాశాలుంటాయి?

Published : 02 May 2016 01:06 IST

డిప్లొమా ఇంజినీర్లకు నూతన అవకాశాలు

పాలిటెక్నిక్‌ (ఈఈఈ) తర్వాత ఉన్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలను వివరించగలరు. పాలిటెక్నిక్‌ తర్వాత ఏ పై చదువులు చదివితే మంచి ఉద్యోగావకాశాలుంటాయి?

- భీమిరెడ్డి నిఖిల్‌కుమార్‌, అనంతపురం

పాలిటెక్నిక్‌ (ఈఈఈ) చదివినవారికి ప్రభుత్వరంగంలోనైనా, ప్రైవేటు రంగంలోనైనా ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు... ఇండియన్‌ రైల్వే, డీఆర్‌డీవో, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌హెచ్‌పీసీ, డీవీసీ, ఎలక్ట్రిసిటీ బోర్డ్‌, ఎన్‌టీపీసీ, ఇస్రో, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ మొదలైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉపాధి లభిస్తుంది.

కొత్తగా వస్తున్న ఉద్యోగ ప్రకటనల ప్రకారం ఇండియన్‌ ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌, ఇండియన్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీస్‌ మొదలైనవాటిలో కూడా ఎలక్ట్రానిక్స్‌ డిప్లొమా ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అయితే పాలిటెక్నిక్‌ తర్వాత అవకాశాలున్నప్పటికీ బీటెక్‌ తర్వాత కొలువుకు ప్రయత్నించటం వల్ల ఉన్నత ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మీరు పై చదువులు కొనసాగించాలనుకుంటే బీటెక్‌ (ఈఈఈ), ఎంటెక్‌ చదవొచ్చు. ఆపై పీహెచ్‌డీ చేయటానికి కూడా వీలుంటుంది.



ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాను. నా సందేహం ఏమిటంటే... దూరవిద్య ద్వారా బీఏ చేయటం వల్ల అన్ని ఉద్యోగాలకూ అర్హత ఉంటుందా? రెగ్యులర్‌ డిగ్రీకి ఉన్న విలువ దీనికి ఉంటుందా?

- గూడుపు దుర్ల, వైజాగ్‌

దూరవిద్య ద్వారా చదవటం వల్ల కొన్ని ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. కానీ కొన్నిటికి తప్పనిసరిగా రెగ్యులర్‌గా చదివివుండాలని అడుగుతారు. ఒకవేళ నోటిఫికేషన్లో రెగ్యులర్‌ డిగ్రీని అడగకపోతే, ఆ సందర్భంలో ఆ ఉద్యోగాలకు అర్హులవుతారు. దూరవిద్య ద్వారా పొందిన చదువుకూ, రెగ్యులర్‌ చదువుకూ తేడా ఉంటుంది.

అన్నీ అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో రెగ్యులర్‌గా చదవడానికే ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఈ మార్గంలో సబ్జెక్టు పట్ల పరిజ్ఞానం పెంపొందటమే కాకుండా భావప్రకటన నైపుణ్యం, భావ ప్రసార సామర్థ్యం, మానసిక ఎదుగుదల, తోటివారితో సత్సంబంధాలు మొదలైనవి మెరుగుపడతాయి.

ఆర్థిక పరిస్థితులు సహకరించనపుడో, ఏదైనా ఉద్యోగం చేస్తున్నపుడో ... ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లోనే దూరవిద్యవైపు మొగ్గు చూపటం సరైనది. రెగ్యులర్‌గా చదవటం వల్ల అధ్యాపకులతో చర్చించే అవకాశాలుంటాయి. ఎక్కువ నేర్చుకోవచ్చు. దానివల్ల చదువులో ముందుకువెళ్లటానికి ఆస్కారం లభిస్తుంది. ఉద్యోగావకాశాలు, వ్యక్తిత్వ వికాసం, విద్యాభ్యాసంలో ప్రేరణ.. అన్నీ కళాశాల/ విశ్వవిద్యాలయంలో విద్య వల్ల మెరుగ్గా సాధ్యపడతాయి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని