ఎంఈసీ తర్వాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కుదిరేనా?

ఇంటర్‌ (ఎంఈసీ) పూర్తిచేశాను. సైన్స్‌ గ్రూపు (బీఎస్‌సీ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ) వైపు వెళ్లాలని ఉంది. కుదురుతుందా?

Published : 26 Jun 2018 02:20 IST

ఎంఈసీ తర్వాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కుదిరేనా?

* ఇంటర్‌ (ఎంఈసీ) పూర్తిచేశాను. సైన్స్‌ గ్రూపు (బీఎస్‌సీ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ) వైపు వెళ్లాలని ఉంది. కుదురుతుందా?

- ఎస్‌. భార్గవ్‌

ఇంటర్‌ ఎంఈసీతో పూర్తి చేసినవారు డిగ్రీ స్థాయిలో (మేథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులను ఎంచుకోవచ్చు. బీఎస్‌సీ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌)ను తీసుకోవచ్చు. లేదా బీకాం, బీబీఏ, బీబీఎం వంటి కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదవనందున బీఎస్‌సీ (కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌) కోర్సును ఎంచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీ ఆసక్తి మేరకు పైన తెలిపిన కోర్సులను ఎంచుకోవచ్చు.


రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి

* పీజీ చదువుతున్నాను. రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి. కోర్సులు, అందించే సంస్థల వివరాలను  తెలపండి.

- పావన జ్యోతి

పీజీ స్థాయిలో రూరల్‌ స్టడీస్‌ చేయాలనుకునేవారు మాస్టర్స్‌ ఇన్‌ రూరల్‌ స్టడీస్‌ (ఎంఆర్‌ఎస్‌)ను అందిస్తున్న భవ్‌నగర్‌ యూనివర్సిటీ-గుజరాత్‌, పట్నా యూనివర్సిటీ- పట్నా, నిమ్స్‌ యూనివర్సిటీ- రాజస్థాన్‌, ఆంధ్రా యూనివర్సిటీ, ఇగ్నోవారు అందించే ఎంఏ (రూరల్‌ డెవలప్‌మెంట్‌) కోర్సును ఎంచుకోవచ్చు. విశ్వవిద్యాలయాలు తమ ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తాయి. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు పై కోర్సులకు అర్హులు.
ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కావాలనుకునేవారు పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) కోర్సును ఎంచుకోవచ్చు. ఈ కోర్సు చేయాలనుకునేవారు డిగ్రీలో కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదివుండాలి. బీటెక్‌ (సివిల్‌) చదివినవారు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఆంధ్రా, ఆచార్య నాగార్జున, ఉస్మానియా యూనివర్సిటీలు  అందిస్తున్నాయి.


రక్షణ రంగంలో అమ్మాయిలకు అవకాశాలు?

* ఇంటర్‌ పూర్తిచేశాను. నాకు రక్షణ రంగంవైపు వెళ్లాలని ఉంది. అమ్మాయిలకు ఈ రంగంలో ఉన్న అవకాశాలూ, అందించే కళాశాలలు, ప్రవేశపరీక్షల వివరాలను తెలియజేయండి.

- పి.దిషిత

క్షణ రంగంలో అడుగిడాలనుకునేవారు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఏటా రెండుసార్లు యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో గమనించాల్సిన విషయం- అభ్యర్థి వయసు 16-19 ఏళ్ల మధ్య ఉండాలి. అంతకుమించినవారు అనర్హులు. ఆర్మీ విభాగంలో చేరాలంటే ఏదైనా సబ్జెక్టులో 10+2 పూర్తి చేసుండాలి. నేవీ లేదా ఏర్‌ఫోర్స్‌ విభాగంలో అభ్యర్థులు 10+2లో మేథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తారు. డిగ్రీ పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌- టెక్నికల్‌ ఉమెన్‌ పరీక్ష ద్వారా రక్షణ రంగంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. పట్టుదల, కార్యదక్షతతో ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

- ప్రొ.బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని